‘రాజధాని ప్లాట్ల కేటాయింపు’ ఖరారు | Sakshi
Sakshi News home page

‘రాజధాని ప్లాట్ల కేటాయింపు’ ఖరారు

Published Wed, Apr 27 2016 3:33 AM

Finalized the Allocation of plots of capital

 సాక్షి, విజయవాడ బ్యూరో: భూ సమీకరణ కింద రాజధానికి భూములిచ్చిన రైతులకు ప్లాట్లు కేటాయించే విధానాన్ని ప్రభుత్వం ఖరారు చేసింది. నివాస, వాణిజ్య స్థలాలను ఏయే రైతులకు ఎలా ఇవ్వాలో నిర్ణయించింది. మంగళవారం ఉండవల్లిలోని తన నివాసంలో సీఆర్‌డీఏ అధికారులతో సమావేశమైన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్లాట్ల కేటాయింపు విధానానికి అంగీకారం తెలిపారు. ఒక రెవెన్యూ గ్రామంలో భూములిచ్చిన రైతులకు అదే గ్రామంలో నివాస, వాణిజ్య ప్లాట్లు ఇవ్వాలని నిర్ణయించారు. మెట్ట భూములిచ్చిన వారికి మెట్ట ప్రాంతంలో, జరీబు భూములిచ్చిన వారికి జరీబు ప్లాట్లు ఇవ్వనున్నారు.

తాత్కాలిక సచివాలయ ప్రారంభోత్సవం సందర్భంగా రైతులకిచ్చిన మాట ప్రకారం రైతులకు అదనంగా మరో 50 గజాల వాణిజ్య స్థలాన్ని ఇస్తూ కేటాయింపులు జరపాలని సీఎం అధికారులను ఆదేశించారు. రైతులకిచ్చే లే అవుట్లలో నివాస స్థలాలు 120 చదరపు గజాల నుంచి నాలుగు వేల చదరపు గజాల వరకు వివిధ సైజుల్లో, వాణిజ్య స్థలాలు 30 గజాల విస్తీర్ణం నుంచి ప్రారంభించి నాలుగు వేల గజాల వరకు వివిధ సైజుల్లో ఇవ్వడానికి సిద్ధం చేసిన ప్రణాళికను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు.

ఒకవేళ ఎవరైనా రైతుకు దక్కాల్సిన ప్లాటు 120 గజాల కన్నా (ప్లాటు కనీస సైజు) తక్కువగా ఉన్న పక్షంలో అలాంటి రైతులు కొందరిని కలిపి వారికి ఉమ్మడి ప్లాట్లు కేటాయించనున్నారు. ఈ ప్లాట్లను వేలం వేసి వచ్చే సొమ్మును రైతుల వాటా ప్రకారం పంచుతారు. ఒకవేళ ఎవరైనా ఉమ్మడి ప్లాటు వద్దనుకుంటే అభివృద్ధి హక్కు కలిగి, అమ్ముకునేందుకు వీలుండే (టీడీఆర్) బాండ్లు తీసుకునే వెసులుబాటును రైతులకు ఇవ్వనున్నారు.

Advertisement
Advertisement