రావులపాలెంలో అగ్ని ప్రమాదం | Sakshi
Sakshi News home page

రావులపాలెంలో అగ్ని ప్రమాదం

Published Fri, Nov 30 2018 7:46 AM

Fire Accident In Ravulapalem East Godavari - Sakshi

తూర్పుగోదావరి , రావులపాలెం (కొత్తపేట): రావులపాలెంలోని ప్రముఖ ఆర్‌కే రెసిడెన్సీ హోటల్‌లో గురువారం విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు రూ.పది లక్షల వరకు ఆస్తినష్టం వాటిల్లినట్టు అంచనా. వివరాల్లోకి వెళితే.. స్థానిక అమలాపురం రోడ్డులో ఉన్న ఆర్‌కే రెసిడెన్సీ హోటల్‌లో కింద భాగంలో భోజన, టిఫిన్‌ విభాగాల్లో హోటళ్లు ఉన్నాయి. పైన వివిధ అంతస్తుల్లో లాడ్జి నిర్వహిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం విద్యుత్‌ మీటర్ల వద్ద షార్ట్‌ సర్క్యూట్‌ సంభవించి మంటలు చెలరేగాయి. దీంతో హోటల్‌ ముందు భాగంలో ఒక వైపు మంటలు ఎగసిపడడంతో హోటల్‌ అంతా దట్టంగా పొగలు అలముకున్నాయి. దీంతో లాడ్జీ రూముల్లో ఉన్నవారు ప్రాణభయంతో కిందకు పరుగులు తీశారు. వెంటనే స్పందించిన హోటల్‌ యాజమాన్యం పోలీసులకు, అగ్ని మాపక అధికారులకు సమాచారం అందించారు. స్థానికులు, హోటల్‌ సిబ్బంది అందుబాటులో ఉన్న నీటితో మంటలను అదుపు చేసే చర్యలు చేపట్టారు. అంతలో సీహెచ్‌ విద్యాసాగర్‌ సిబ్బందితో అక్కడికి చేరుకుని మంటలు అదుపు చేసే చర్యల్లో పాలుపంచుకున్నారు. పోలీసులు హోటల్‌ సిబ్బంది తీవ్రంగా శ్రమించి మొత్తానికి మంటలను అదుపు చేశారు. మంటలు చెలరేగుతున్న సమయంలో దగ్గరలో ఉన్న గ్యాస్‌ సిలిండర్లను పోలీసులు దూరంగా తరలించడంతో పెనుప్రమాదం తప్పింది.  ఇంతలో అక్కడికి చేరుకున్న కొత్తపేట అగ్నిమాపక అధికారి ఎం.నాగభూషణం ఫైర్‌ ఇంజిన్‌ సాయంతో సిబ్బందితో కలసి మంటలను పూర్తిగా ఆర్పి వేశారు. ఈ ప్రమాదంలో విద్యుత్‌ మీటర్లతోపాటు హోటల్‌లోని వివిధ సామగ్రి దెబ్బతిని ఆస్తి నష్టం సుమారు రూ. 10 లక్షల వరకు ఉంటుందని అగ్నిమాపక అధికారి నాగభూషణం తెలిపారు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే అక్కడికి చేరుకుని సహాయ చర్యల్లో చేపట్టడంలో మంటలను అదుపు చేయడంలో చురుగ్గా వ్యవహరించిన ఎస్సై విద్యాసాగర్, హెచ్‌సీ అమ్మిరాజు తదితర సిబ్బందిని స్థానికులు అభినందించారు. ప్రధాన రహదారిపై ఉన్న హోటల్‌లో ప్రమాదం జరగడంతో పెద్ద ఎత్తున జనం గుమిగూడారు. తృటిలో పెద్ద ప్రమాదం తప్పడంతో అంతా
ఊపిరిపీల్చుకున్నారు. 

Advertisement
Advertisement