ఫుడ్‌ టెక్నాలజీ కోర్సుకు గ్రీన్‌సిగ్నల్‌ | Sakshi
Sakshi News home page

ఫుడ్‌ టెక్నాలజీ కోర్సుకు గ్రీన్‌సిగ్నల్‌

Published Thu, May 24 2018 10:01 AM

Food Technology Courses In Anantapur JNTU - Sakshi

జేఎన్‌టీయూ : జేఎన్‌టీయూ అనంతపురం కానిస్టిట్యూట్‌ కళాశాల అయిన జేఎన్‌టీయూ కలికిరిలో నూతనంగా బీటెక్‌ ఫుడ్‌ టెక్నాలజీ కోర్సును ప్రవేశపెడుతున్నారు. 2018–19 విద్యాసంవత్సరం నుండి ఈ కోర్సు అందుబాటులోకి రానుంది. మొత్తం 60 సీట్లు భర్తీ చేసేందుకు ఏఐసీటీఈ బుధవారం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా అందాయి. ఇంటర్‌ మీడియట్‌లో ఎంపీసీ పూర్తీ చేసి , ఎంసెట్‌లో ర్యాంకు వచ్చిన వారికి మెరిట్‌ ప్రాతిపదికగా బీటెక్‌ ఫుడ్‌ టెక్నాలజీ కోర్సులో అడ్మిషన్‌ కల్పిస్తారు.

కర్రికులమ్‌ ఖరారు
బీటెక్‌ (ఫుడ్‌ టెక్నాలజీ) కోర్సు ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా ప్రవేశపెడుతున్నారు. కర్రికలమ్‌ ( విద్యా ప్రణాళిక) , సిలబస్‌ రూపకల్పన పూర్తయింది. ఇందుకోసం బోర్డ్‌ఆఫ్‌ స్టడీస్‌ సభ్యులను, ఛైర్మన్‌లను ఇప్పటికే నియమించారు. కోర్సుకు సంబంధించిన అడ్వైయిజరీ కమిటీని నియమించారు. బీఎస్సీ (అగ్రికల్చర్‌) కోర్సుకు దీటుగా ఈ సిలబస్‌ను రూపొందించారు.

28న లెక్చరర్‌ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు
ఈ నెల 28న అడ్‌హాక్‌ లెక్చరర్‌ పోస్టుల భర్తీకి సంబంధించిన ఇంటర్వ్యూలు జేఎన్‌టీయూ అనంతపురం పాలక భవనంలో జరగనున్నాయి. శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీని త్వరలో పూర్తిచేయనున్నారు. 50 సంవత్సరాలు ఫుడ్‌ ప్రాసెసింగ్‌లో అనుభవం గల ప్రొఫెసర్‌ రామకృష్ణను విజిటింగ్‌ ప్రొఫెసర్‌గా నియమించారు.

సాంకేతిక మానవ వనరులు అవసరం
కలికిరి చుట్టు పక్కల తిరుపతి, చిత్తూరు, మదనపల్లి ప్రాంతాల్లో ఇప్పటికే 200 పుడ్‌ ప్రాసెసింగ్‌ కంపెనీలు ఉన్నాయి. ఇందులో నిష్ణాతులైన సాంకేతిక మానవ వనరులు అవసరం. ఫుడ్‌ ప్రాసెసింగ్‌లో ఇండస్ట్రీ కోర్సులు నిర్వహిస్తే ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఇందుకోసమే బీటెక్‌ ఫుడ్‌ టెక్నాలజీ కోర్సును అందుబాటులోకి తీసుకొచ్చాం. – ప్రొఫెసర్‌ ఎస్‌ .శ్రీనివాస్‌ కుమార్,వీసీ, జేఎన్‌టీయూ అనంతపురం.  

Advertisement
Advertisement