ముఖ్యమంత్రిని ఓడించిన ధీశాలి గల్లా | Sakshi
Sakshi News home page

ముఖ్యమంత్రిని ఓడించిన ధీశాలి గల్లా

Published Tue, Jan 6 2015 2:44 AM

ముఖ్యమంత్రిని ఓడించిన ధీశాలి గల్లా - Sakshi

తిరుపతి రూరల్: సభ్యత్వ నమోదు చేయడంలో టీడీపీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ఓడించిన ధీశాలి గల్లా అరుణకుమారి అని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కొనియాడారు. సోమవారం తిరుపతి రూరల్ మండలం వేదాంతపురంలో చంద్రగిరి సభ్యత్వ నమోదు సంబరాలు జరిగాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోనే గర్వించే నాయకురాలు గల్లా అరుణకుమారి అన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో సభ్యత్వ నమోదు సంబరాలు చూస్తుంటే సంక్రాంతి ముందుగానే వచ్చినట్లుందన్నారు. ఓడిన చోటే మళ్లీ విజయాన్ని వెతికేందుకు కృషి చేస్తున్న కెరటమని గల్లా అరుణకుమారిని చిత్తూరు ఎంపీ శివప్రసాద్ అభినందించారు.

పార్టీ కోసం పనిచేస్తే వచ్చే తృప్తి ఆత్మసంతృప్తే వేరని, అందుకనే జిల్లాలోనే అత్యధిక సభ్యత్వాలు చేయాలనే సంకల్పంతో నడిచామని మాజీ మంత్రి, చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి గల్లా అరుణకుమారి చెప్పారు. సభ్యత్వ నమోదులో రాష్ట్రంలో ద్వితీయ స్థానం, జిల్లాలో ప్రథమస్థానం సాధించడంతో భారీ కేక్‌ను కట్ చేశారు. అంతకుముందు వేదాంత పురం సర్కిల్ నుంచి  సభా వేదిక వరకు మంత్రి బొజ్జల, ఎంపీ శివప్రసాద్, ఎమ్మెల్యేలు ఆదిత్య, సత్యప్రభ, మాజీ మంత్రి గల్లా అరుణకుమారి కార్యకర్తలతో కలసి ర్యాలీగా వచ్చారు. ర్యాలీ మధ్యలో కళాకారులతో కలసి చెక్కభజనలు చేశారు. టీడీపీ అడహక్ కమిటీ జిల్లా కన్వీనర్ శ్రీనివాసులు, నియోజకవర్గ సభ్యత్వ పరిశీలకురాలు పుష్పావతి, జెడ్పీటీసీ కుర్రకాల్వ సుభాషిణి, బీసీ పైనాన్స్ కార్పొరేషన్ రాష్ట్ర డెరైక్టర్ బడి సుధాయాదవ్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నరసింహయాదవ్, నాయకులు పాల్గొన్నారు.
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement