ప్రజా కోర్టులో బాబు ఖైదీ | Sakshi
Sakshi News home page

ప్రజా కోర్టులో బాబు ఖైదీ

Published Fri, Aug 21 2015 4:40 AM

ప్రజా కోర్టులో బాబు ఖైదీ - Sakshi

- ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారు
- ప్రత్యేక హోదా కావాలో.. వద్దో టీడీపీ ఎంపీలు, మంత్రులు తేల్చి చెప్పాలి
- 29న రాష్ట్ర బంద్‌కు అందరూ మద్దతు ఇవ్వాలి
- వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా విస్తృత సమావేశంలో పరిశీలకుడు మేరుగ నాగార్జున
కడప కార్పొరేషన్ :
ఇచ్చిన హామీలన్నీ మాఫీ చేసి, ప్రత్యేక హోదాపై డ్రామాలాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజా కోర్టులో ఖైదీగా నిలబడక తప్పదని వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా పరిశీలకుడు మేరుగ నాగార్జున హెచ్చరించారు. కడపలోని అపూర్వ కళ్యాణ మండపంలో గురువారం నిర్వహించిన ఆ పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల హామీలు విస్మరిస్తున్న టీడీపీ ప్రభుత్వాన్ని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెంటాడుతున్నారన్నారు. ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోకుండా మోసం చేయడమే లక్ష్యంగా చంద్రబాబు పనిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సహజ వనరులను ఆ పార్టీ నేతలు దోచుకుంటున్నారని, ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు.

విద్యా వ్యవస్థను నాశనం చేశారని, పరిపాలన గాలి కొదిలేశారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా కావాలా.. వద్దా అనేది టీడీపీ ఎంపీలు, మంత్రులు తేల్చి చెప్పాలన్నారు. ప్రత్యేక హోదా అంటే తనకు తెలీదని ఒక ఎంపీ మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. ఈ నెల 29వ తేదీన కనీ, వినీ ఎరుగని రీతిలో బంద్ నిర్వహించాలని పిలుపునిచ్చారు. మరో పరిశీలకుడు, నగర మేయర్ కె.సురేష్‌బాబు మాట్లాడుతూ ప్రత్యేక హోదా వస్తే కేంద్ర నిధులన్నీ గ్రాంటు రూపంలో వస్తాయన్నారు. ఆ నిధులను తిరిగి చెల్లించాల్సిన అవసరం ఉండదన్నారు. రాజధాని కూడా లేని ఆంధ్రప్రదేశ్‌ను కాదని, బీహార్‌కు ప్రత్యేక ప్యాకేజీ కింద రూ.1.25 లక్షల కోట్లు ఇస్తామని ప్రకటించడం దారుణం అన్నారు. జెడ్పీ చైర్మన్ గూడూరు రవి మాట్లాడుతూ పచ్చచొక్కాలు వేసుకొన్నవారికే ఈ ప్రభుత్వంలో పనులు జరుగుతున్నాయన్నారు. ప్రత్యేక హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ది లేదన్నారు.  
 
శవ రాజకీయాలు చేసింది ఎవరు?
గోదావరి పుష్కరాల్లో 29 మందిని పొట్టన బెట్టుకొని శవ రాజకీయాలు చేసిందెవరని రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు అన్నారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును జైల్లో పెడతారనే ప్రత్యేక హోదాపై టీడీపీ ఎంపీలు, మంత్రులు మాట్లాడటం లేదన్నారు. ప్రధాని న రేంద్ర మోదీ తీరు చంద్రబాబును మరిపిస్తోందని దుయ్యబట్టారు. కడప శాసన సభ్యుడు ఎస్‌బి అంజద్‌బాషా మాట్లాడుతూ విభజన చట్టంలో ఏపీకి ఇచ్చిన హామీలను కేంద్రం బుట్టదాఖలు చేస్తోందన్నారు.

ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పిన వాగ్దానాలు, చేసిన బాసలు మర్చిపోయాయని, కర్రు కాల్చి వాత పెడితేనే వాటిలో చలనం వస్తుందన్నారు. డీసీసీబీ మాజీ చైర్మన్ బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ బంద్‌ను నిర్వీర్యం చేయాలనే కుట్రలను తిప్పికొట్టాలన్నారు. డిప్యూటీ మేయర్ బి. అరీఫుల్లా మాట్లాడుతూ పక్కా ప్రణాళికతో బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఈ నెల 29న రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేయాలనే పోస్టర్లను ఆవిష్కరించారు.

సమావేశం ప్రారంభంలో ఇటీవల నారాయణ కళాశాలలో నందిని, మనీషాల మృతికి రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపం తెలిపారు. సమావేశంలో వైఎస్‌ఆర్‌సీసీ సీనియర్ నాయకులు నవనీశ్వర్‌రెడ్డి, గౌసులాజం, జిల్లా అధికార ప్రతినిధులు టీకే అఫ్జల్‌ఖాన్, జి. రాజేంద్రరెడ్డి, నగర అధ్యక్షుడు నిత్యానందరెడ్డి, అనుబంధ విభాగాల అధ్యక్షులు పులిసునీల్, వేణుగోపాల్‌నాయక్, నాగేంద్రారెడ్డి, బంగారు నాగయ్య, కరిముల్లా, చల్లా రాజశేఖర్, షఫీ, ఖాజా, ఏ. సుబ్బరాయుడు, త్యాగరాజు, ఆదిత్య, సాయిచరణ్, టీపీ వెంకట సుబ్బమ్మ తదితరులు పాల్గొన్నారు.
 
బంద్‌ను విజయవంతం చేయాలి
తుపాకులు ఎక్కుపెట్టినా, బుల్లెట్ల వర్షం కురిసినా ఈ నెల 29న బంద్‌ను విజయవంతం చేయాలి. రాష్ట్ర విభజనకు మూల కారణం కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలే. ఏపీకి ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని నాడు ప్రధాని ప్రకటిస్తే, ఐదేళ్లు సరిపోదు.. పదేళ్లు కావాలని అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు పట్టుబట్టారు. నేడు వారు కేంద్ర మంత్రులై ఉండీ ప్రత్యేక హోదాపై నోరుమెదపడం లే దు. గట్టిగా మాట్లాడితే జైలుకు పంపుతారేమోనని చంద్రబాబు మౌనం విహ స్తూ తెలుగు వారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారు.
- ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు

Advertisement
Advertisement