గుంటూరు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్లీనరీలో ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి ప్రవేశపెట్టిన రాజకీయ తీర్మానాన్ని బలపరుస్తూ పార్టీ ఎమ్మెల్యే కొడాలి నాని ప్రసంగించారు. గత ఎన్నికల్లో చంద్రబాబు సీఎం అయిననాటి నుంచి వైఎస్ఆర్ సీపీ శ్రేణులను వేధించడం ప్రారంభించారని, పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తూ కేసులు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఏదోరకంగా బెదిరించి ప్రలోభాలకు గురిచేసి ప్రతిపక్ష ఎమ్మెల్యేలను, ఎంపీలను టీడీపీలో చేర్చుకుంటూ చంద్రబాబు అనేక అనైతిక చర్యలకు పాల్పడ్డారని అన్నారు. గుండె ధైర్యం, ఎవరినైనా ఎదురించే సత్తా గల నేతలు ఇప్పుడు పార్టీలో ఉన్నారని, చవట దద్దమ్మలే తెలుగుదేశంలో చేరారని ఆయన విమర్శించారు.
'వైఎస్ఆర్ సీపీ గత ఆరేళ్ల నుంచి అనేక రకాల పోరాటాలు చేసింది. రాష్ట్ర ప్రజల సమస్యలు తన సమస్యలుగా భావించి వారికి అండగా నిలిచిన ఏకైక ప్రతిపక్ష నేత వైఎస్ జగన్. వైఎస్ జగన్ 175 నియోజకవర్గాల్లో ఎలాంటి అభ్యర్థిని కేటాయించినా పార్టీకి 44 శాతం ఓట్లు వస్తాయి. 2014 ఎన్నికల్లో బీజేపీకి గానీ, టీడీపీకి గానీ రాని ఓట్లు సింగిల్గా పోటీ చేసిన వైఎస్ఆర్ సీపీకి వచ్చాయి. ఇప్పుడు ఎక్కడ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా విజయం వైఎస్ఆర్సీపీదే' అని కొడాలి నాని వివరించారు.
బలహీనవర్గాల అభ్యున్నతికి పాటుపడిన దివంగత మహానేత వైఎస్ఆర్ అని, ఆయన్ను గుండెల్లో పెట్టుకొని వైఎస్ జగన్ను ప్రజలు ఆదరిస్తున్నారన్నారు. రాష్ట్రంలో వైఎస్ జగన్ ఏ కార్యక్రమం చేపట్టినా ఎల్లో మీడియా, తెలుగుదేశం పార్టీ శ్రేణులు బురదజల్లుతున్నాయని మండిపడ్డారు. వీటన్నింటినీ జాగ్రత్తగా ఎదుర్కోవాలని పార్టీ శ్రేణులకు సూచించారు. వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే అన్ని రంగాల వారి అభివృద్ధి జరుగుతుందన్నారు.
'చంద్రబాబు అంత్యంత మోసపూరితమైన వ్యక్తి'
చంద్రబాబు నాయుడు అంత్యంత మోసపూరితమైన వ్యక్తి. వెన్నుపోటు దారుడు. కుట్ర రాజకీయాలు చేయగలిగిన వ్యక్తి. అవసరమైతే కాళ్లు లేకపోతే జుట్టు పట్టుకునే వ్యక్తి. ఈ రాష్ట్రంలో ఎన్ని అవలక్షణాలున్నాయో అవన్నీ ఒక్క చంద్రబాబులోనే ఉన్నాయి. రాష్ట్రాన్ని దొంగ ముఖ్యమంత్రి పరిపాలిస్తున్నారు. ఎన్నికల్లో గెలవడం కోసం అడ్డమైన హామీలిచ్చి మోసం చేసిన వ్యక్తి ఆయన. కానీ వైఎస్ జగన్ తన తండ్రి చూపించిన దారిలో నడుస్తూ అబద్ధాలు చెప్పకుండా నిజాయితీగా ప్రతిపక్షంలో కొనసాగుతున్నారు. 2019లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితే బతికి ఉన్నంతవరకు ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటారు. చంద్రబాబుకు 70 ఏళ్ల వయస్సు రావడంతో మైండ్ పనిచేయడం లేదు. ఎప్పుడు ఉంటారో.. ఎప్పుడు పోతారో తెలియదు.. అలాంటి వ్యక్తి ఆ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన మరణిస్తే వారి అబ్బాయి లోకేష్ పార్టీని టైటానిక్ షిప్ని ముంచినట్లు ముంచుతారు' అని కొడాలి నాని అన్నారు. టీడీపీ నేతలంతా ఇప్పుడే అప్రమత్తమై వేరే పార్టీలకు జంప్ కావాలని సూచించారు.