సీఎం ఆశయాలకు అనుగుణంగా.. | Sakshi
Sakshi News home page

సీఎం ఆశయాలకు అనుగుణంగా..

Published Fri, Jul 26 2019 11:09 AM

Performance Of Officers In Line With CM Ambitions - Sakshi

సాక్షి, అనంతపురం అర్బన్‌: గత ప్రభుత్వ హయాంలో ప్రజాసమస్యల పరిష్కారం కే వలం ‘కాగితాల్లో’నే కనిపించేది. ఒకే సమస్యపై మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ ప్రజలు కాళ్లరిగేలా తిరిగినా పరిష్కారం లభించేది కాదు. దీంతో విసిగివే సారి చివరకు అధికారులకు చెప్పుకోవడమే మానేశారు. తాజాగా  ఈ పరిస్థితిలో మార్పు వచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయాలకు అనుగుణంగా అధికారుల పనితీరులో మార్పు వచ్చింది. నిర్ధేశించిన గడువులోగా ప్రజల సమస్యలకు నాణ్యమైన పరిష్కారం చూపించే దిశగా జిల్లా యంత్రాగం పనితీరులో వేగం పెరిగింది.  ప్రజాసమస్యల పరిష్కారం లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. సమస్యలపై వచ్చిన అర్జీలను ఎప్పటికప్పుడు పరిలిస్తున్నారు. అర్హమైన వాటిని మాస్టర్‌ రిజిస్టర్‌లో నమోదు చేస్తున్నారు. సమస్య పరిష్కార వివరం గురించి ప్రజలకు ఎండార్స్‌మెంట్‌ ఇస్తున్నారు. దీంతో ప్రజల్లో ప్రభుత్వంపై విశ్వాసం పెరిగింది.   

గతంలో కాగితాల్లోనే పరిష్కారం 
గత ప్రభుత్వ హయాంలో ప్రజాసమస్యలపై వచ్చిన అర్జీల పరిశీలన, పరిష్కారం క్షేత్రస్థాయిలో కాకుండా ‘కాగితాల్లో’ కనిపించేది. ఆ ప్రభుత్వ పనితీరుకు అనుగుణంగానే అధికారులూ తప్పుడు నివేదికలు ఇచ్చేవారు. ఇప్పుడా తీరు పూర్తిగా మారింది. సమస్య పరిష్కారం విషయంలో కచ్చితమైన విధానం పాటిస్తున్నారు. అర్జీదారునికి రశీదు ఇస్తూ అందులో పరిష్కార గడువును నమోదు చేస్తున్నారు. ఆర్థికేతర సమస్యల పరిష్కారానికి అక్కడిక్కడే చర్యలు తీసుకుంటున్నారు. మండలస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకూ నిర్వహిస్తున్న ‘స్పందన’ కార్యక్రమంలో ప్రజల నుంచి పింఛన్లు, ఇళ్ల స్థలాలు, పక్కా గృహాలు, రేషన్‌ కార్డులకు దరఖాస్తులు అధికారులకు అందుతున్నాయి. వీటిని పరిశీలించడంతో పాటు  క్షేత్రస్థాయిలో విచారణ చేసి అర్హులను గుర్తిస్తున్నారు. ఆర్థికపరమైన, ప్రభుత్వపరంగా రావాల్సినవి కావడంతో ప్రత్యేకంగా మాస్టర్‌ రిజిస్టర్‌ను ఏర్పాటు చేసి అందులో నమోదు చేస్తున్నారు. అర్జీదారులకు అదే విషయాన్ని తెలియజేస్తూ ఎండార్స్‌మెంట్‌ ఇస్తున్నారు.  

ఒక్కసారి దరఖాస్తు చేసుకుంటే చాలు 
పింఛన్లు, ఇళ్ల స్థలాలు, పక్కాగృహాలు, రేషన్‌ కార్డుల కోసం అర్హులైన ప్రజలు గత ప్రభుత్వ హయాంలో మాదిరిగా పదేపదే దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. మండలస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు జరిగే ‘స్పందన’ కార్యక్రమంలో ఎక్కడైనా ఒక్కసారి దరఖాస్తు చేసుకుంటే చాలు. దరఖాస్తును అధికారులు పరిశీలిస్తారు. అనర్హమైన వాటిని తిరస్కరిస్తారు. అర్హత ఉన్న వాటిని మాస్టర్‌ రిజిస్టర్‌లో నమోదు చేస్తారు. నిర్ధేశిత గడువులోగా సమస్య పరిష్కారం అవుతుందని వివరం తెలియజేస్తున్నారు.   


 

Advertisement
Advertisement