విభజన గుబులు | Sakshi
Sakshi News home page

విభజన గుబులు

Published Fri, Mar 7 2014 12:40 AM

విభజన గుబులు

సాక్షి, ఏలూరు : సాధారణంగా ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత రాజకీయ నాయకుల తలరాతలు మారేవి. రాష్ట్ర విభజనతో ఇప్పుడు ఎన్నికలకు మందే వారి తలరాతలు తెలిసిపోతున్నాయి. ఎన్నికలకు వరుసగా నోటిఫికేషన్లు వెలువడుతుండటంతో జిల్లాలో రాజకీయం వేడెక్కింది. జిల్లాలో నిన్నమొన్నటి వరకూ సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతంగా సాగింది. రాష్ట్ర విభజన జరిగిపోవడంతో ఉద్యమం నిలిచిపోయింది. సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం ఆరు నెలలు నడిచిన ప్రజా పోరాటంతో రాజ కీయ పార్టీల అంతరంగం బయటపడింది.ప్రజాప్రతినిధుల స్వార్థాన్ని వెలుగులోకి తెచ్చింది. ఇప్పుడు ఇది ఎన్నికల్లో ప్రధాన భూమిక పోషించనుందనేది విశ్లేషకుల భావన. దీంతో నేతల్లో గుబులు పట్టుకుంది. సార్వత్రిక ఎన్నికల కంటే ముందే మునిసిపల్ ఎన్నికలు 
 
జరగనుండటంతో వారిలో వణుకు మొదలైంది. ఈనెల 30న జిల్లాలో ఏలూరు కార్పొరేషన్‌తోపాటు నిడదవోలు, కొవ్వూరు, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం పురపాలక సంఘాలు, జంగారెడ్డిగూడెం నగర పంచాయతీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల ఎంపికపై రాజకీయ పార్టీలు దృష్టి కేంద్రీకరించాయి. అంతలోనే సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. జిల్లాలోని 15 అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాలకు మే 7న పోలింగ్ జరగనుంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు మునిసిపల్ ఎన్నికలు జరగనుండటంతో పార్టీ స్థితి ఏమిటనేది బయటపడిపోయి, ప్రధాన ఎన్నికల్లో తమ పరిస్థితి మరింత దిగజారుతుందని కాంగ్రెస్, టీడీపీలు భయపడుతున్నాయి. ఈ భయంతోనే మూడేళ్లుగా మునిసిపల్ ఎన్నికలను వాయిదా వేస్తూ వ చ్చిన కాంగ్రెస్ పాలకులకు సుప్రీం కోర్టు జో క్యంతో సంకట పరిస్థితి ఏర్పడింది. 
 
ఇవి ఎగ్జిట్ పోల్స్ లాంటివని, ఫలితాలు వెల్లడవగానే తమ డొల్లతనం బయటపడుతుందని వణికిపోతున్నారు. ఎన్నికలు ఎలాగూ తప్పవు కాబ ట్టి ఫలితాలైనా వాయిదా వేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి మొరపెట్టుకుంటున్నారు. జిల్లాలో అయితే నేతలు తమ భవిష్యత్ ఏమిటో మీరే తేల్చండంటూ కార్యకర్తలతో అత్యవసర సమావేశాలు జరుపుతున్నారు. మరికొందరు ఒకడుగు ముందుకు వేసి తప్పుచేశాం ఇప్పుడు ఏం చేయమంటారంటూ నిస్సిగ్గుగా ప్రజలకు బహిరంగ లేఖలు రాస్తున్నారు. కానీ వారిని ఇంకా నమ్మి మరోసారి వంచనకు గురయ్యేందుకు జనం సిద్ధంగా లేరు. ఈ విషయం నాయకులకు కూడా అర్థమైంది. సమైక్యాంధ్రపై చివరి వరకూ మభ్యపెట్టిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు రాష్ట్రా న్ని చీల్చేసిన తరువాత రాష్ట్ర విభజనను అడ్డుకోలేకపోయామని చెబుతుంటే జిల్లా ప్రజ లు మండిపడుతున్నారు.
 
ఆ పార్టీ నాయకుడినని, కార్యకర్తనని చెప్పుకుని జనంలో తిరగలేని పరిస్థితి వచ్చింది. చేసిన తప్పుకు తలెత్తుకోలేక, ఓట్లు ఎలా అడగాలో తెలియక ఆ పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. వారికి కార్యకర్తల నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తమ భ వి ష్యత్‌ను నాశనం చేశారంటూ నాయకులను దుమ్మెత్తిపోస్తున్నారు. రెండు కళ్ల సిద్ధాంతంతో రెండిటికీ చెడ్డ రేవడిలా తయారైంది టీడీపీ దుస్థితి. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని విభజించమని లేఖ ఇస్తే జిల్లాలో ఆ పార్టీ నాయకులు సమైక్యాంధ్ర అంటూ నాటకాలాడారు. నడిరోడ్డుపై సమైక్యవా దులు నిలదీస్తే సమాధానం చెప్పలేక ముఖం చాటేశారు.  ఇప్పుడు ఓట్లు అడగడానికి జనం వద్దకు వెళితే తమ పరిస్థితి ఏమిటని వారి అందోళన. ఆ రెం డు పార్టీల నాయకులు, కార్యకర్తలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. పార్టీ మారితేనైనా జనానికి ముఖం చూపించగలమని భావిస్తున్నారు. 
 

Advertisement
Advertisement