సూట్ కేసులో దుంగలు | Sakshi
Sakshi News home page

సూట్ కేసులో దుంగలు

Published Sat, Oct 26 2013 2:35 AM

Redwood thieves keeping in suit case very safety

రాజంపేట, న్యూస్‌లైన్ : ఎర్రచందనం దొంగలు స్మగ్లింగ్‌ను కొత్తపంథాల్లో నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు కార్లు, లారీలు, స్కార్పియాలలో దుంగలు తరలిపోయేవి. అవి పట్టుబడుతున్నాయని..స్మగ్లర్లు కొత్తరూట్‌ను ఎంచుకున్నారు. సూట్ కేసుల్లో దుంగలను అమర్చి అక్రమ రవాణా చేస్తున్నారు. ఇందుకు నిదర్శనం మన్నూరు పోలీసులకు రైల్వేకోడూరు చెందిన యువకుడు పట్టుబడిన ఉదంతం. ఎస్‌ఐ మధూసూదన్‌రెడ్డి కథనం మేరకు .. రాజంపేట పట్టణ శివార్లలో ఉన్న బోయనపల్లె ఇంజనీరింగ్ కళాశాల వద్ద వాహనాలను గురువారం రాత్రి మన్నూరు పోలీసులు తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో రైల్వేకోడూరుకు చెందిన సందీప్, రవి అనే యువకులు స్కూటర్‌లో సూట్‌కేసును పెట్టుకొని పోవడాన్ని గమనించారు.
 
 పోలీసులను గమనించి స్కూటరు, సూట్‌కేసును వదలి పరారయ్యారు. పోలీసులు వారిని వెంటాడి సందీప్‌ను పట్టుకున్నారు. రవి అని మరో యువకుడు తప్పించుకున్నాడు. వీరికి రైల్వేకోడూరు సమీపంలో దొరస్వామినాయుడు రూ.5వేలు ఆశచూపి, సూట్‌కేసులో ఉన్న దుంగలను కడపలో తాను చెప్పిన వ్యక్తికి అప్పగించాలని కోరారు. అందుకు ఒప్పుకున్న యువకులు చివరికి పోలీసులు పట్టుబడ్డారు. సందీప్ పాలిటెక్నిక్ విద్యను అభ్యసిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇలావుండగా రోళ్లమడుగు వద్ద ఓ వ్యక్తి ప్లాస్టిక్ సంచిలో 11కేజీల బరువు కలిగిన దుంగను తీసుకుపోతుండగా రేంజర్ టీవైఎన్ గౌడ్ పట్టుకున్నారు.  
 
 గుండ్లూరు చెక్‌పోస్టు వద్ద...
 గుండ్లూరు చెక్‌పోస్టు వద్ద లారీని తనిఖీ చేసి అందులో ఉన్న 70 ఎర్రచందనం దుంగలను పట్టుకున్నట్లు రేంజర్ టీవైఎన్ గౌడ్ శుక్రవారం తెలిపారు. అలాగే డ్రైవర్ సయ్యద్ ముబారక్‌ను అదుపులోకి తీసుకున్నారు. ముబారక్ కర్నాటక రాష్ట్రంలోని కోలార్ జిల్లా ఊసకోట మండలానికి చెందిన వాడు.  
 

Advertisement
Advertisement