శెవ్వా.. కంపు పంపకం | Sakshi
Sakshi News home page

శెవ్వా.. కంపు పంపకం

Published Thu, Dec 19 2013 3:43 AM

శెవ్వా.. కంపు పంపకం - Sakshi

=మరుగుదొడ్ల నిర్మాణాల్లో ప్రధాన పార్టీలకు వాటాలు
 =నేతలకు ఆదాయ వనరులుగా మేడారం జాతర పనులు

 
సాక్షిప్రతినిధి, వరంగల్ : మేడారం జాతర పనులు.. రాజకీయ నాయకులకు ఆదాయ వనరులయ్యూరుు. జాతరకు వచ్చే భక్తుల సౌకర్యం కోసం చేపట్టే పలు అభివృద్ధి పనులను పంచుకుంటున్నారు. టెండర్లు లేకుండా నామినేషన్ పద్ధతిపై చేపట్టే పనులు దక్కించుకోవడానికి పోటీపడుతున్నారు. జాతర ఏర్పాట్లలో భాగంగా గ్రామీణ నీటిసరఫరా శాఖ రూ.9.30 కోట్లతో పనులు చేపడుతోంది. రూ.4.80 కోట్లు పారిశుద్ధ్య పనులకు, రూ.4.50 కోట్లు తాగునీటి సరఫరా పనులకు కేటాయించారు.

పారిశుద్ధ్య పనుల కింద జాతర ప్రాంతంలో 10వేల మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేశారు. ఒక్కో మరుగుదొడ్డి (యూనిట్)కి రూ.2300 చొప్పున రూ.2.30కోట్లతో ఈ పనులు పూర్తి చేయనున్నారు. వీటి ని కాంగ్రెస్ పార్టీ నేతలు 40 శాతం, టీఆర్‌ఎస్, టీడీపీ నేతలు 30 శాతం చొప్పున చేపట్టేలా బుధవారం ఒప్పందం కుదిరింది. మరుగుదొడ్ల నిర్మాణంపై ప్రతి జాతరలోనూ ఇబ్బందులు తలెత్తుతున్నా.. పంపకాల ఆనవాయితీ కొనసాగడంపై విమర్శలు వస్తున్నాయి. ఈసారి జాతరలోనూ నాసిరకం నిర్మాణాలే జరుగను న్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎక్కువ పనులు టెండర్ పద్ధతిన చేపట్టగా.. మరుగుదొడ్ల నిర్మాణాలకు నామినేషన్ పద్ధతిని ఎంచుకున్నారు. దీంతో అందినకాడికి దండుకునే పనిలో పార్టీల నేతలు తలమునకలయ్యారు.
 
నిర్మాణాలు ఇక్కడే..

ములుగు శివారులోని ఆది దేవత గట్టమ్మ ఆలయం వద్ద మొదలుకుని మేడారం చిలకలగుట్ట, జంపన్నవాగు, పడిగాపూర్, నార్లాపూర్, కాల్వపల్లి, కన్నెపల్లి, కొత్తూరు, ఊరట్టం, శివరాంసాగర్, గద్దెల పరిసరాలు, ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతాల్లో వీటిని నిర్మించనున్నారు. గ్రామ అభివృద్ధి కమిటీ(వీడీసీ)లకు పనులు అప్పగిం చాల్సి ఉండగా ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ముందస్తు ఒప్పందాలకు తెరలేపారు. పంపకాల ఆధారంగా ఆ మూడు పార్టీలకు ‘కంపు’పనులు అప్పగిస్తే ఎటువంటి ఫిర్యాదులూ ఉండవని భావిస్తున్న అధికారులు ఈ తతంగానికి అంగీకరించినట్లు తెలిసింది.

వీడీసీల సిఫారసుతో నామినేషన్ పద్ధతిన అప్పగించనున్న ఈ పనుల కోసం కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్ పార్టీల ద్వితీయ శ్రేణి నాయకులు హన్మకొండ కేంద్రం గా పలుసార్లు చర్చలు జరిపినా వాటాల పై మొదట్లో స్పష్టత రాలేదు. అధికారంలో ఉన్న తమకు 50శాతం పనులు.. టీడీపీ, టీఆర్‌ఎస్‌లకు 25 శాతం చొప్పున ఇవ్వాలని కాంగ్రెస్ వారు పట్టుబట్టారు. ఈ ప్రతిపాదనకు టీడీపీ, టీఆర్‌ఎస్ వారు అంగీకరించలేదు. చివర కు కాంగ్రెస్‌కు 40, టీఆర్‌ఎస్, టీడీపీకి 30 శాతం చొప్పున వాటా ఉండేలా ఒప్పందం కుదిరింది.
 
 వీడీసీల ప్రతిపాదనలు రాలేదు : శ్రీనివాసరావు, ఆర్‌డబ్లూఎస్ ఈఈ
 
 మరుగుదొడ్ల నిర్మాణాలకు సంబంధించి వీడీసీ నుంచి ప్రతిపాదనలు ఇప్పటి వరకు మావద్దకు రాలేదు. రెండుమూడు రోజుల్లో తెప్పించుకుని పనులను అప్పగిస్తాం. 10వేల మరుగుదొడ్లు నిర్మించనున్నాం. వీటిలో 8వేలు వీడీసీ ద్వారా ఇవ్వనున్నాం. మిగిలిన 2వేలకు సంబంధించి చివర్లో స్థలాలు(లొకేషన్) మారే అవకా శం ఉంది. వీటిపై తర్వాత చర్యలు తీసుకుంటాం. నాసిరకం పనులకు తావులేకుండా చూస్తాం.  
 

Advertisement
Advertisement