మీడియాను అడ్డుపెట్టుకుని నీచ రాజకీ యాలు | Sakshi
Sakshi News home page

మీడియాను అడ్డుపెట్టుకుని నీచ రాజకీ యాలు

Published Sun, Feb 2 2014 3:46 AM

Shobha Nagireddy takes on Congress, TDP

 కాంగ్రెస్, టీడీపీలపై శోభా నాగిరెడ్డి ధ్వజం
 రఘురామ కృష్ణంరాజు ఓ కోవర్టు..
 ఎమ్మెల్యే బాలరాజు, ప్రసాదరాజు

 
 వేముల, వేంపల్లె, న్యూస్‌లైన్: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక కాంగ్రెస్, టీడీపీలు మీడియాను అడ్డు పెట్టుకొని నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి ధ్వజమెత్తారు. శనివారం ఇడుపులపాయలో పార్టీ కేంద్ర పాలక మండలి సమావేశం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత 50 నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు జరిగితే సగం నియోజకవర్గాలలో కాంగ్రెస్, టీడీపీలకు డిపాజిట్లు కూడా దక్కలేదని ఆమె విమర్శించారు. జగన్ రమ్మని పిలిస్తే కాంగ్రెస్, టీడీపీలు ఖాళీ అవుతాయన్నారు. పార్టీలో కొంతమంది ఉన్నన్ని రోజులు పొగడటం.. వెళ్లిన తర్వాత విమర్శించడం మంచిది కాదన్నారు. ఎస్‌పీవై రెడ్డి సీఎంను కలిశారని విలేకరులు అడగగా.. తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా సీఎంను కలుస్తున్నారని.. ఆయనను సీఎంగా కలుస్తున్నారు తప్ప.. కాంగ్రెస్ నాయకులుగా కలవలేదని, మీడియాయే తప్పుదోవ పట్టిస్తోందన్నారు.

 ఆ మూడు పార్టీల కోవర్టు...

 బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు కోవర్టుగా ఉండటంవల్లే రఘురామ కృష్ణంరాజును వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ నుంచి బహిష్కరించారని పోలవరం ఎమ్మెల్యే బాలరాజు, నరసాపురం మాజీ ఎమ్మెల్యే ప్రసాదరాజు పేర్కొన్నారు. పార్టీలో ఉంటూ.. వ్యక్తిగత విషయాలను టీడీపీ, కాంగ్రెస్ నాయకులకు చెప్పడం తెలుసుకొని పార్టీ నుంచి సాగనంపారన్నారు. ఆయన వ్యక్తిగతంగా తలబిరుసు మనిషి అని, డబ్బులు ఉన్నాయన్న అహంకారంతో ప్రవర్తిస్తుంటారని విమర్శించారు. శనివారం వారు ఇడుపులపాయలో విలేకరులతో మాట్లాడారు. పార్టీ నాయకులు, కార్యకర్తల అభీష్టం మేరకే జగన్ బహిష్కరణ నిర్ణయం తీసుకున్నారన్నారు. రఘురామకృష్ణం రాజు వెంట ఏ ఒక్క వైఎస్‌ఆర్ సీపీ కార్యకర్తా వెళ్లడం లేదంటే.. ఆయనకు ఏ మేరకు రాజకీయ భవిష్యత్ ఉందో స్పష్టమవుతోందన్నారు. 17 మంది ఎమ్మెల్యేల్లో త్యాగం చేసిన ఎమ్మెల్యేగా తానూ ఒకడినని బాలరాజు చెప్పుకొస్తూ.. జగన్ మనస్తత్వం ఏమిటో తమకు తెలుసునని, ఇటువంటి కుట్రలు, కుతంత్రాలు ఏమీ చేయలేవన్నారు.
 

Advertisement
Advertisement