అంతా మాయ | Sakshi
Sakshi News home page

అంతా మాయ

Published Mon, May 18 2015 4:04 AM

So far untaxed Places To determine the Officers Survey Being

- కార్పొరేషన్ ఆదాయానికి సర్కార్ గండి
- రూ.1.32 కోట్ల వీఎల్‌టీకి మినహాయింపు
- మంత్రి అండతో ఎంఏయూడీ సర్క్యులర్ జారీ
విజయవాడ సెంట్రల్ :
4 నగరంలో 14వేల ఖాళీ స్థలాలకు సంబంధించి రూ.40 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఇప్పటివరకు పన్ను విధించని స్థలాలను గుర్తించేందుకు అధికారులు సర్వే చేస్తున్నారు. ఆర్థిక సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకుని ఖాళీ స్థలాల యజమానుల నుంచి ముక్కుపిండి మరీ పన్నులు వసూలు చేయాలని మేయర్ కోనేరు శ్రీధర్ ఆదేశాలు జారీ చేశారు.

4 బందరురోడ్డులో ప్రశాంత్ ఆస్పత్రి ఎదురుగా భవన నిర్మాణం జరుగుతోంది. రెవెన్యూ రికార్డుల ప్రకారం ఖాళీ స్థలం పన్ను రూ.1.32 కోట్లు బకాయి ఉంది. ఒక్క సంవత్సరానికి సంబంధించి రూ.9 లక్షలు కట్టించుకుని బిల్డింగ్ ప్లాన్‌ను టౌన్‌ప్లానింగ్ విభాగం మంజూరు చేసింది. ఎంఏయూడీ (మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్    డెవలప్‌మెంట్) నుంచి ప్రత్యేక ఉత్తర్వులు ఉన్నాయని, అందుకే ప్లాన్ ఇచ్చామని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రత్యేక సర్క్యులర్ వెనుక జిల్లా మంత్రి అండదండలు ఉన్నాయనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. నగరపాలక సంస్థలో నిబంధనలు అడ్డగోలుగా మారాయి. రాజకీయ అండదండలతో చీకటి జీవోలు పుట్టుకొస్తున్నాయి. ప్రతిదానికీ రూల్స్ బూచిని చూపి పేచీ పెట్టే టౌన్‌ప్లానింగ్ అధికారులు బడాబాబులకు రెడ్ కార్పెట్ వేసి మరీ ప్లాన్లు మంజూరు చేస్తున్నారు. బందరురోడ్డులోని ప్రశాంతి ఆస్పత్రి ఎదురుగా మల్టీప్లెక్స్ నిర్మాణం సాగుతోంది. రూ.1.32 కోట్లు ఖాళీ స్థలం పన్ను బకాయి ఉన్నప్పటికీ టౌన్‌ప్లానింగ్ అధికారులు ఇట్టే ప్లాన్ ఇచ్చేశారు. అదేమంటే ప్రజెంట్ ఈయర్ ట్యాక్స్ కట్టి ఉంటే ప్లాన్ ఇవ్వొచ్చనే నిబంధన ఉందని చెబుతున్నారు. ఈ ప్లాన్ మంజూరు వెనుక భారీగా ముడుపులు చేతులు మారాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

గండికొట్టిన సర్కార్
భవనం నిర్మించాలంటే ఖాళీ స్థలం పన్ను బకాయిలను పూర్తిస్థాయిలో చెల్లించాలి. రెవెన్యూ రికార్డుల ప్రకారం నగరంలో రూ.40 కోట్లు వీఎల్‌టీ (వేకెండ్ ల్యాండ్ ట్యాక్స్) వసూలు కావాల్సి ఉంది.

ఈ సంవత్సరం ట్యాక్స్ కడితే పాత పన్నుకు మినహాయింపు ఇవ్వొచ్చన్న ఎంఏయూడీ సర్క్యులర్ ప్రకారం నగరంలో ఖాళీస్థలాల యజమానులెవరూ బకాయిలు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఇదే జీవో అందరికీ వర్తించే అవకాశం ఉంటుంది. గృహ నిర్మాణం చేపడదాం అనుకున్నప్పుడు ఆ సంవత్సరం వీఎల్‌టీ కడితే సరిపోతుంది. అంటే కార్పొరేషన్ ఆదాయానికి రాష్ట్ర ప్రభుత్వమే గండికొడుతోందన్న విషయం ఇక్కడ స్పష్టమవుతోంది.
 
వెలుగుచూసింది ఇలా..
ఈనెల ఏడో తేదీన జరిగిన కౌన్సిల్ సమావేశంలో ఈ విషయాన్ని వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ పి.సుభాషిణి సభ దృష్టికి తెచ్చారు. రెవెన్యూ విభాగంలో బకాయి ఉంటే టౌన్‌ప్లానింగ్ అధికారులు ప్లాన్ ఎలా ఇచ్చారని నిలదీశారు. దీంతో అధికారులు తడబడ్డారు. కమిషనర్ జి.వీరపాండియన్ జోక్యం చేసుకుని రెండుశాఖల మధ్య సమన్వయం లేకపోవడం వల్లే బకాయి విషయంలో పొరపాటు జరిగి ఉండొచ్చని, తాను ఫైల్‌ను పరిశీలిస్తానని సర్దిచెప్పారు. వీఎల్‌టీ మినహాయింపునకు సంబంధించి ప్రత్యేక సర్క్యులర్ ఉందన్నది తాజా వాదన. ఆ సర్క్యులర్ ఇవ్వాల్సిందిగా రెవెన్యూ అధికారులు పది రోజులుగా కోరుతున్నప్పటికీ టౌన్‌ప్లానింగ్ అధికారులు ఇవ్వకపోవడం అనుమానాలను తావిస్తోంది.

Advertisement
Advertisement