అబద్ధాలతో గద్దెనెక్కిన బాబు | Sakshi
Sakshi News home page

అబద్ధాలతో గద్దెనెక్కిన బాబు

Published Fri, Sep 26 2014 12:03 AM

అబద్ధాలతో గద్దెనెక్కిన బాబు - Sakshi

ఆత్మకూరు: చంద్రబాబు నాయుడు అబద్ధాలతో గద్దెనెక్కాడని వైఎస్‌ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి ఆరోపించారు. రుణాలు మాఫీ చేస్తానని రైతులను, డ్వాక్రా మహిళలను మోసగించిన చంద్రబాబుకు వారే తగిన బుద్ధి చెబుతారన్నారు. గురువారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రుణమాఫీపై షరతులు విధిస్తూ రైతులను, డ్వాక్రా మహిళలను ఆందోళనకు గురిచేస్తున్నారన్నారు. గెలుపు కోసం తప్పుడు హామీలిచ్చారని దుయ్యబట్టారు.

అక్టోబర్2న ప్రవేశపెట్టబోయే పథకాలు కూడా ప్రజలకు ఎంత మేరకు ఉపయోగపడతాయోనని అనుమానం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ ప్రోటోకాల్‌ను పాటించడంలేదని, వార్డు మెంబర్‌గా కూడా గెలవని వ్యక్తులను పక్కనే కూర్చోబెట్టుకోవడం తగదన్నారు. జిల్లా స్థాయి అధికారులు సైతం అధికార పార్టీ నేతల చెప్పుచేతుల్లో ఉండటం సిగ్గుచేటన్నారు. కలెక్టర్, మంత్రులు సైతం నియోజకవర్గాల్లో పర్యటించే సమయాల్లో కనీసం సమాచారం కూడా ఇవ్వకపోవడం ఎంతవరకు సమంజసమన్నారు. ఇప్పటి కైనా అధికారులు రాజకీయ నాయకులకు భజన చేయడం మాని నిజాయతీగా విధులు నిర్వర్తించాలన్నారు.

Advertisement
Advertisement