రాష్ట్ర హైకోర్టు ఏర్పాటుకు ఏలూరులో స్థలముంది | Sakshi
Sakshi News home page

రాష్ట్ర హైకోర్టు ఏర్పాటుకు ఏలూరులో స్థలముంది

Published Sun, Sep 14 2014 1:40 AM

రాష్ట్ర హైకోర్టు ఏర్పాటుకు ఏలూరులో స్థలముంది

 సాక్షి, ఏలూరు : నవ్యాంధ్రప్రదేశ్ రాజధానిగా విజయవాడను ఖరారు చేసిన నేపథ్యంలో.. దానికి అతి చేరువలో ఉన్న ఏలూరు నగరంలో రాష్ట్రస్థాయి కార్యాలయా లు ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఊపందుకుం టోంది. ఇందుకు అవసరమైన వసతులు, వనరులు ఇక్కడున్నాయి. కారణాలు కూడా సహేతుకంగానే ఉన్నాయి. ప్రత్యేకించి కోట్లాది రూపాయలను వెచ్చించి నిర్మాణాలు చేయూల్సిన అవసరం లేకుండా భవనాలు కూడా ఇక్కడ సిద్ధంగానే ఉన్నాయి. నిర్మాణానికి అయ్యే ఖర్చులో సగం మొత్తం కేటాయిస్తే వీటిని మరింత విస్తరించేందుకు సువిశాల స్థలాలు సైతం అందుబాటులో ఉన్నాయి. ఈ దృష్ట్యా జిల్లా కోర్టును హైకోర్టుగా.. జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రినిఎయిమ్స్‌గా మార్చాలని న్యాయవాదులు, ప్రజా సం ఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
 
 హైకోర్టు ఏర్పాటుకు అనుకూలం
 ఏలూరులోని జిల్లా కోర్టు ప్రాంగణం 14 ఎరాలకు పైగా స్థలంలో విస్తరించి ఉంది. బ్రిటిష్ కాలంనాటి సువిశాలమైన.. పటిష్టమైన కట్టడాలు కోర్టు ప్రాంగణంలో ఉన్నాయి. విభాగాల వారీగా పెంచుకుంటూ నిర్మాణాలు చేయడానికి ఈ స్థలం సరిపోతుంది. ఈ దృష్ట్యా హైకోర్టును గుంటూరులో ఏర్పాటు చేయాలనే వాదనలు సమర్థనీయం కాదని.. ఏలూరులో అనుకూలమైన నిర్మాణాలు, అందుకు కావలసిన స్థలాలు ఉన్న దృష్ట్యా హైకోర్టును ఇక్కడే ఏర్పాటు చేయూలని జిల్లాలోని వివిధ ప్రాంతాల బార్ అసోసియేషన్ల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా జడ్జిల నివాసానికి అనుకూలమైన వాతావరణంలో 13 ఎకరాల స్థలం ఉంది. నివాస ప్రాంతాలకు దగ్గరగానే కోర్టు భవనం కూడా ఉంది. ఇన్ని సౌకర్యాలు ఉన్నప్పుడు ప్రత్యేకించి స్థల సేకరణ, నిర్మాణాల పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేయాల్సిన అవసరం ఏముందనేది ప్రజా సంఘాల వాదన.
 
 ఎయిమ్స్ ఏర్పాటుకు అనుకూలం
 జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రిని వెయ్యి పడకలకు పెంచి, నిర్మాణాలను ఆధునికీకరించి ఎయిమ్స్ స్థాయి ఆస్పత్రిగా తీర్చిదిద్ద వచ్చని స్పష్టం చేస్తున్నారు. ఆస్పత్రి ప్రాంగణంలో వైద్య కళాశాల ఏర్పా టు చేసేందుకు సరిపడినన్ని నిర్మాణాలు, విస్తరణకు అవసరమైన స్థలాలు కూడా ఏలూరులో ఉన్నాయి. ఇక్కడ 23.60 ఎకరాల విస్తీర్ణంలో ఇప్పటికే నిర్మిం చిన భవనాలతోపాటు నూతనంగా వివిధ విభాగాల కోసం నిర్మాణాలు జరుగుతున్నాయి. వీటిని విని యోగించుకుంటే ‘ఎయిమ్స్’ ఏర్పాటుకు సరిపోతాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఆస్పత్రి చుట్టూ కమర్షియల్ కాంప్లెక్స్‌లు నిర్మించడం ద్వారా ఆస్పత్రి అభివృద్ధికి మరొకరి సహాయం అవసరం లేకుండా నిధులు కూడా సమకూరతాయని అభిప్రాయ పడుతున్నారు.
 
 రాష్ట్ర డ్రగ్ స్టోర్స్‌కు ఆస్కారం
 దాదాపు 40 లక్షల జనాభా కలిగిన పశ్చిమగోదావరి జిల్లాకు తొమ్మిది నెలలకు సరిపోయే మందులను నిల్వచేసే సామర్ధ్యం కలిగిన కోల్డ్ స్టోరేజీతో కూడిన డ్రగ్ స్టోర్స్‌ను రాష్ట్ర స్థాయికి తగిన రీతిలో తీర్చిదిద్దడానికి కావాల్సిన నిర్మాణం కూడా ఏలూరులో సిద్ధంగా ఉంది. ఈ స్టోర్స్‌లో 200 నుంచి 300 రకాల మందులు అందుబాటులో ఉంటాయి. 1998లో దాదాపు రూ.కోటిన్నర ఉన్న జిల్లా డ్రగ్స్ బడ్జెట్ ప్రస్తుతం రూ.7 కోట్ల నుంచి రూ.10 కోట్లకు మధ్యకు చేరింది. త్వరలో మందుల స్టాకు వివరాలను ఆన్‌లైన్ చేయబోతున్నారు. డ్రగ్ స్టోర్స్‌ను ఆధునికీకరిండానికి కావాల్సినంత స్థలం కూడా ఉంది.
 
 హైకోర్టు ఏర్పాటుకు అనుకూలం
 హైకోర్టు ఏర్పాటు కోసం వేరేచోట కొత్తగా నిర్మాణాలు చేపట్టడం వల్ల ప్రజాధనం వృథా అవుతుంది. ఉన్న నిర్మాణాలను అనుకూలంగా మలిచి మౌలిక వసతులకు, ఆధునికీకరణకు కొద్దిపాటి నిధులు ఖర్చు చేస్తే సరిపోతుంది. ఏలూరులోని కోర్టును ఆధునికీకరిస్తే రాష్ట్ర హైకోర్టుకు పూర్తిగా సరిపోతుంది. భౌగోళికంగా నవ్యాంధ్రప్రదేశ్‌కు మధ్యలో.. అన్ని ప్రాంతాలకు అందుబాటులో ఏలూరు నగరం ఉంది. అందువల్ల హైకోర్టు ఇక్కడే ఏర్పాటు చేయూలి.             
 - బీవీ కృష్ణారెడ్డి, జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్
 
 ఆస్పత్రి అభివృద్ధ్దికి సహకరించాలి
 ఏలూరులో ఆస్పత్రి ప్రాంగణం ఎంతో సువిశాలంగా ఉంది. ఇక్కడే నర్సింగ్ కళాశాల కూడా ఏర్పాటు చేయవచ్చు. అన్ని వసతులతో 2012లో ప్రారంభించిన డ్రగ్‌స్టోర్స్‌ను రాష్ట్ర స్థారుు డ్రగ్ స్టోర్స్‌గా తీర్చిదిద్దడానికి అనుకూలంగా ఉంది. వీటిని పరిగణనలోకి తీసుకుని ఆస్పత్రి అభివృద్ధ్దికి ప్రజాప్రతినిధులు, అధికారులు సహకరించాలి.
 - నేరెళ్ల రాజేంద్ర ప్రసాద్, ఐక్య ప్రజావేదిక కన్వీనర్, ఏలూరు
 
 జిల్లా ప్రభుత్వాస్పత్రిని  ఎయిమ్స్‌గా మార్చవచ్చు
 అనుభవజ్ఞులైన సిబ్బంది, నైపుణ్యం కలిగిన వైద్యులను అన్ని విభాగాల్లో భర్తీ చేసి పూర్తిస్థాయిలో ఆధునిక వైద్య పరికరాలను సమకూర్చడం ద్వారా జిల్లా ప్రభుత్వాస్పత్రిని ఎయిమ్స్‌గా మార్చవచ్చు. ఇక్కడ అందుబాటులో ఉన్న భవనాలు, ఖాళీ స్థలాలు ఎయిమ్స్ ఏర్పాటుకు సరిపోతాయి. జిల్లా ప్రజలకు ఇప్పటివరకూ సరైన ప్రభుత్వ వైద్యసేవలు అందడం లేదు. వైద్యం కోసం ఇతర జిల్లాలకు వెళ్లాల్సి వస్తోంది. కనీసం ఎయిమ్స్ వస్తే ఇక్కడి ప్రజల ఇబ్బందులు తీరతాయి.
 -మంతెన సీతారాం, సీపీఎం జిల్లా కార్యదర్శి
 

Advertisement
Advertisement