అడ్మిషన్లలో కొనసాగుతున్న గందరగోళం | Sakshi
Sakshi News home page

అడ్మిషన్లలో కొనసాగుతున్న గందరగోళం

Published Tue, Jul 14 2015 3:46 AM

అడ్మిషన్లలో కొనసాగుతున్న గందరగోళం - Sakshi

- జేఈవో లేరంటూ రెండో విడత కౌన్సెలింగ్ నిలిపివేత
- ఎస్‌జీఎస్ వద్ద విద్యార్థుల ఆందోళన
యూనివర్సిటీక్యాంపస్:
అధికారుల నిర్లక్ష్యం.. ఆన్‌లైన్ పై అవగాహన, స్పష్టత లేమి.. వెరసి అడ్మిషన్ల ప్రక్రియ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే చందంగా మారింది. ఫలితంగా టీటీడీ విద్యాసంస్థల్లో నిర్వహిస్తున్న అడ్మిషన్ల ప్రక్రియలో గందరగోళంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 33 శాతం కూడా పూర్తి కాలేదు. ఖాళీలు ఉన్నప్పటికీ అర్హులైన విద్యార్థులకు అడ్మిషన్ ఇవ్వడంలేదు. ఒకేషనల్ కోర్సులు చేసిన అభ్యర్థులకు  అడ్మిషన్లు ఇవ్వడానికి అధికారులు విముఖత చూపుతున్నారు.

ఫలితంగా అర్హత, ప్రతిభ ఉండి కూడా విద్యార్థులు అడ్మిషన్లు పొందలేక పోతున్నారు. సోమవారం నుంచి ఈనెల 16వ తేదీ వరకు రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తామని ప్రకటించిన అధికారులు పత్తా లేకుండా పోయారు. తిరుపతి జేఈవో పోలా భాస్కర్ అందుబాటులో లేరంటూ రెండో విడత కౌన్సెలింగ్ నిలిపివేశారు. టీటీడీలో తొలిసారిగా ప్రవేశపెట్టిన ఆన్‌లైన్ అడ్మిషన్ల ప్రక్రియ అభాసుపాలవుతోంది. టీటీడీ విద్యాసంస్థల్లో ఆన్‌లైన్ అడ్మిషన్లలో భాగంగా తొలివిడత అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహించారు. అయితే ఎక్కువ మార్కులు వచ్చిన వారికి సీటు దక్కలేదు. అత్తెసరు మార్కులు వచ్చినవారికి మాత్రం సీట్లు దక్కాయనే ఆరోపణలు ఉన్నాయి. పలువురి విద్యార్థుల దరఖాస్తులు గల్లంతయ్యాయి. దీంతో విద్యార్థులు లబోదిబోమంటున్నారు.
 
ఒకేషనల్  విద్యార్థులకు అడ్మిషన్లు లేవు
ఇంటర్మీడియట్‌లో ఒకేషనల్ కోర్సు చదివిన విద్యార్థులు ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలోని ఒకేషనల్ కోర్సులు చేయడానికి అర్హులు. అయితే వారికి అడ్మిషన్ ఇవ్వడాని కి అధికారులు నిరాకరిస్తున్నారు. 90 శాతం మార్కులు పొందినవారికి కూడా ఒకేషనల్ కోర్సులో అడ్మిషన్ ఇవ్వడంలేదు.
 
35 శాతం అడ్మిషన్లే పూర్తి
టీటీడీ అధికారులు జూన్ 30వ తేదీన 70 శాతం సీట్లకు మెరిట్ లిస్టు ప్రకటించారు. మిగతా 30 శాతం సీట్లకు రెండోవిడత భర్తీచేస్తామని చెప్పారు. అయితే ఈ జాబితాలో అవకతవకల వల్ల చాలామంది అడ్మిషన్ పొందలేక పోయారు. ఇప్పటివరకు 35 శాతం మాత్రమే అడ్మిషన్లు పూర్తయ్యాయి. ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో 278, ఎస్‌జీఎస్ డిగ్రీ కళాశాలలో 168, పద్మావతి డిగ్రీ కళాశాలలో 448, ఎస్వీయూ జూనియర్ కళాశాలలో 218, పద్మావతి జూనియర్ కళాశాలలో 396 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి.
 
రెండో విడత కౌన్సెలింగ్ వాయిదా
సాంకేతిక సమస్యలతో ఇబ్బందులు పడిన వారికి రెండోవిడత కౌన్సెలింగ్‌లో న్యాయం చే స్తామని అధికారులు హామీ ఇచ్చారు. ముందుగా ప్రకటించిన షెడ్యూ ల్ ప్రకారం సోమవారం నుంచి ఈనెల 16వరకు అడ్మిషన్లు జరగాలి. అయితే టీటీడీ జేఈవో పోలా భాస్కర్  అమెరికాలో ఉండడంతో రెండోవిడత కౌన్సెలింగ్‌కు సంబంధించి మెరిట్‌లిస్టు ప్రకటించలేదు. అయితే ఇంతకుముందు  ఈనెల 13 నుంచి రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తామని అధికారులు ప్రకటించారు. దీంతో అన్యాయానికి గురైన  విద్యార్థులు పెద్దసంఖ్యలో  కళాశాల వద్దకు  చేరుకున్నారు. అడ్మిషన్లు వాయిదా వేశామంటూ అక్కడి నోటీసు బోర్డులు చూసి అసంతృప్తికి గురయ్యారు. అడ్మిషన్లు వాయిదా వేసిన విషయాన్ని ముందే ఎందుకు చెప్పరని ప్రశ్నించారు.
 
విద్యార్థుల ఆందోళన
టీటీడీ విద్యాసంస్థల్లో అడ్మిషన్లలో అక్రమాలను నిరసిస్తూ విద్యార్థులు  సోమవారం ఎస్‌జీఎస్  కళాశాల ఎదుట ఆందోళన చేశారు. ఎక్కువ శాతం మార్కులు పొందినప్పటికీ  తమకు సీట్లు ఇవ్వలేదని  ఒకేషనల్ కోర్సు విద్యార్థులు  ఆరోపించారు.  తమకు న్యాయం చేయాలని  కోరారు.
 
కౌన్సెలింగ్ వాయిదా
సోమవారం నుంచి జరగాల్సిన  రెండోవిడత  కౌన్సెలిం గ్‌ను వాయిదా వేసినట్లు ఎస్‌జీఎస్  కళాశాల ప్రిన్సిపాల్  విజయలక్ష్మి తెలిపారు. ఇప్పటివరకు 30 శాతం అడ్మిషన్లు నిర్వహించామన్నారు. ఆన్‌లైన్  అడ్మిషన్లలో  సాం కేతిక సమస్యలు తలెత్తడం, తిరుపతి జేఈవో పోలాభాస్కర్ అందుబాటులో లేకపోవడం కౌన్సెలింగ్ వాయిదా వేశామన్నారు. ఒకేషనల్ కోర్సు విద్యార్థులకు  అడ్మషన్‌ఇచ్చే అంశంపై  ఇంకా నిర్ణయం తీసుకోలేదని, జేఈవో  దృష్టికి తీసుకెళ్లి నిర్ణయం తీసుకుంటామన్నారు.

Advertisement
Advertisement