చంపేస్తానంటూ టీడీపీ కార్పొరేటర్ వీరంగం | Sakshi
Sakshi News home page

చంపేస్తానంటూ టీడీపీ కార్పొరేటర్ వీరంగం

Published Fri, May 23 2014 9:11 AM

తన కుమారుడుని చితకబాదారని ఎస్ఐకి వివరిస్తున్న ఉషా - Sakshi

అనంతపురంలోని 34వ డివిజన్‌కు వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేసిన  నాయక్‌నగర్ నివాసి ఉష ఇంటిపై తెలుగుదేశం పార్టీ నాయకులు గురువారం దౌర్జన్యం చేశారు. ఇల్లు ఖాళీ చేయాలంటూ బెదిరించారు. బాధితురాలి కథనం మేరకు... గురువారం మధ్యాహ్నం 3.45 గంటల సమయంలో టీడీపీ నాయకులు, కార్పొరేటర్ నరసింహులు, నాగరాజులు ఉష ఇంట్లోకి చొరబడ్డారు. లోపల ఉన్న ఆమె చిన్న కుమారుడు అభిషేక్‌ను చితకబాదారు. ‘ఏయ్ నీ పెద్ద కొడుకు జ్ఞానిగాడు ఎక్కడున్నాడే... వాడ్ని రమ్మని చెప్పు’ అంటూ కత్తి చూపి ఉషను బెదిరించారు.
 
 
 ‘ఎన్నికల్లో ఏజెంట్‌గా కూర్చోవద్దని చెప్పినా నీ కొడుకు జ్ఞానేశ్వర్ వైఎస్సార్ సీపీ తర ఫున పనిచేశాడు. రేపటిలోపు ఇళ్లు ఖాళీ చేయండి. లేకపోతే ప్రాణాలు తీస్తాం’ అంటూ అల్టిమేటం జారీ చేశారు. ఇంతలోనే  ఉష బిగ్గరగా కేకలు వేయడంతో చుట్టుపక్కలవారు అక్కడికి చేరుకున్నారు. జనాలను చూసిన టీడీపీ నాయకులు అక్కడి నుంచి పరుగులు తీశారు. బాధితురాలు ఉష టూటౌన్ ఎస్‌ఐ సుబ్బరాయుడు ఫోన్ చేసి ‘సార్ ఇలా మా ఇంటిపైకి దాడికి వచ్చారు. మీరు రండి’ అంటూ వేడుకున్నారు. అయితే స్టేషన్‌కి వచ్చి ఫిర్యాదు చేయమ్మా అంటూ ఎస్‌ఐ సూచించారు.
 
 
 నాయక్‌నగర్‌లో అక్కడక్కడ వాళ్ల వాళ్లున్నారు మీరేరండి అని వేడుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది. చివరకు అదే స్టేషన్‌కు చెందిన ఎస్‌ఐ రవిశంకర్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని గుమిగూడిన జ నాన్ని చెదరగొట్టారు. ఎవరూ అవాంఛనీయ సంఘటనలకు పాల్పడినా జైలుకు పంపుతామని హెచ్చరికలు జారీ చేశారు. బాధిత కుటుంబ సభ్యులతో వివరాలను సేకరించారు. ఎవరిపైనైనా ఫిర్యాదు చేయాలనుకుంటే పోలీస్ స్టేషన్ రావాలన్నారు. ఇంటి వద్ద ఇద్దరు పోలీసులను ఉంచి ఎవరైనా ఆ ప్రాంతం కాని వారు వస్తే అదుపులోకి తీసుకోవాలని ఆదేశించారు. 

Advertisement
Advertisement