ఏపీ సీఎం చంద్రబాబు... టీటీడీపీ నేతలతో భేటీ
సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టులు, హై కోర్టు విభజనకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తనపై దుష్ర్పచారం చేస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పునర్విభజన చట్టంలో ఉన్న అంశాలనే అమలు చేయాలని తాను కోరుతున్నానని పేర్కొన్నారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు సోమవారం హైదరాబాద్లో చంద్రబాబుతో భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులతో పాటు, తెలంగాణలో పార్టీ బలోపేతానికి సంబంధించిన అంశాలపై చంద్రబాబు వారితో చర్చించినట్లు సమాచారం.
స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని, ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించాలని, కలసికట్టుగా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని చంద్రబాబు టీ నేతలకు దిశా నిర్దేశం చేసినట్లు తెలిసింది. టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, కార్య నిర్వాహక అధ్యక్షుడు రేవంత్రెడ్డి, నేతలు రావుల చంద్రశేఖర్రెడ్డి, పెద్దిరెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, సీతక్క తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.