నీలి ఇంధనం..! | Sakshi
Sakshi News home page

నీలి ఇంధనం..!

Published Mon, Dec 5 2016 3:43 AM

నీలి ఇంధనం..!

మాఫియా చేతుల్లో నీలి కిరోసిన్
నార్కెట్‌పల్లి రహదారిలో విచ్చలవిడిగా వ్యాపారం
పౌరసరఫరాల శాఖ నుంచి పక్కదోవ పడుతున్న వైనం
నోరు మెదపని అధికారులు.. తనిఖీ బృందాలు

 
ప్రతి ఒక్కరూ పేదలపై దండయాత్ర చేసేవారే. వారి నోటి దగ్గర కూడు లాక్కొని భోం చేసేవారే. స్థలాలు.. పొలాల నుంచి కష్టపడి సంపాదించే కూలి దాకా.. పంటల ఉత్పత్తి దాకా! ఇక రేషన్ సరుకుల గురించి చెప్పేదేముంది?ఎంత పిండితే అంత! పౌర సరఫరాల శాఖ ద్వారా పంపిణీ చేసే కిరోసిన్ సంపాదనకు ఇం‘ధనం’గా మారింది. మాఫియా చేతుల్లో వేలాది లీటర్లు పక్క దోవ నుంచి కారిపోతూనే ఉంది.                - సంతమాగులూరు
 
చాలా పేద కుటుంబాల్లో ఇప్పటికీ వంట గ్యాస్ లేదు. ఇలాంటి వారందరికీ నీలి కిరోసినే ఆధారం. దానిని స్టౌలలో పోసుకొని కావాల్సిన వంట చేసుకుంటారు. అందుకే పౌర సరఫరాల శాఖ తెల్ల రేషన్‌కార్డు దారులకు  ప్రతినెలా రేషన్ డీలర్ల నుంచి కిరోసిన్ సరఫరా చేస్తుంది. అరుుతే కొంతమంది మాఫియాగా ఏర్పడి దీనిని అక్రమ మార్గాల్లో తరలిస్తున్నారు. ఈ తరహా దందాకు అద్దంకి- నార్కెట్‌పల్లి రహదారి నిలయంగా మారింది. ఇక్కడ నుంచి బహిరంగంగా తరలిస్తున్నా సంబంధిత అధికారులు కన్నెత్తి చూడటంలేదు. సంతమాగులూరు మండలం కొమ్మాలపాడు సమీపం లోని పాత హోటళ్ల వద్ద భారీ స్టాక్ ఉంటోంది. కిరోసిన్‌ను పీపాల్లో భద్రపరుస్తున్నారు. ఒక్క పీపాలో 220 లీటర్లు పడుతుంది. ఇలాంటివి ప్రతి నెలా 10 డ్రమ్ముల దాకా తరలిపోతోంది. అంటే ప్రతి నెలా దాదాపు 2000 లీటర్ల కిరోసన్ బ్లాక్ మార్కెట్‌లో అమ్ముడు పోతోంది. దీని విలువ రూ. 5 లక్షల దాకా ఉం టుందని అంచనా. గతంలో ఈ వ్యాపారంపై దినపత్రికల్లో వార్తలు రాగా కాసేపు హడావుడి చేసినా అధికారులు మామూళ్లు పుచ్చుకొని వదిలేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నారుు.

డీలర్ల పాత్ర?
ఏల్చూరు, రొంపిచర్ల, సజ్జాపురం, కొమ్మాలపాడు, మక్కెనవారిపాలెం తదితర గ్రామాల నీలి కిరోసిన్ తరలి వస్తోంది. ఒక్కోడీలర్ నుంచి 100 లీటర్ల దాకా సేకరిస్తున్నారు. అలాగే హైవేపై మద్దిపాడు, మేదరమేట్ల వంటి ప్రాంతాల్లోనూ కిరోసిన్ వ్యాపారం జోరుగా సాగుతోంది. గతంలో రేషన్ డీలర్లకు పంచదార, కిరోసిన్, బియ్యం సరఫరా మధ్య జాప్యం ఉండేది. దీంతో దాదాపు లబ్ధిదారులందరికీ సరుకు ఇవ్వడం అనివార్యమయ్యేది. కానీ ప్రస్తుతం సరకులన్నీ ఒకేసారి రావటంతో డీలర్లు అన్ని రకాల పదార్థాలకు ఒకే సారి వేలిముద్ర వేరుుంచుకొంటున్నారు. అవసరంలేని వారి వద్ద కిరోసిన్ సేకరించి లీటరు రూ. 30 చొప్పున బ్లాక్‌లో అమ్ముకుం టున్నారు. వ్యాపారులు లారీలకు లీటరు రూ. 50 చొప్పున అమ్ముతున్నారు. ఇలా లక్షలాది రూపాయలు వారి జేబుల్లో పడుతున్నారుు. ప్రభుత్వం మాత్రం లీటరు రూ.15కే  సరఫరా చేస్తుంది. కొంతమంది దళారులు.. వ్యాపారులకు, డీలర్లకు మధ్య సంబంధాలు నిర్వహిస్తూ చీకటి వ్యాపారాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు. లారీ డ్రైవర్లు ఓనర్లకు తెలియకుండా డీజిల్‌ను పక్కదోవ పట్టించి దాని స్థానంలో కిరోసిన్ నింపుతున్నారు.

వాహనాలు, ఎరువుల దుకాణాలనే పరిశీలిస్తారా?  
జిల్లా విజిలెన్‌‌స అధికారులు వారానికి ఒక సారి పుట్టావారిపాలెం జంక్షన్‌లో వాహనాలు తనిఖీ చేస్తుంటారు.- అలాగే ఇటీవల కాలంలో కొమ్మాలపాడులో ఎరువుల దుకాణాల్లోనూ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కానీ ఏల్చూరు- కొమ్మాలపాడు గ్రామాల మధ్య యథేచ్ఛగా సాగుతున్న నీలికిరోసిన్ వ్యాపారాన్ని ఎందుకు కట్టడి చేయడంలేదో వారికే తెలియాలి. అధికారులు దాడులకు ఉపక్రమించిన సమయంలో వ్యాపారులకు కొంతమంది ముందస్తు సమాచారం ఇవ్వటంతో జాగ్రత్త పడుతున్నట్లు తెలిసింది.

బాధ్యులపై చర్యలు తీసుకుంటాం:  పార్వతి ,తహసీల్దార్
కిరోసిన్ విషయం తన దృష్టికి వచ్చింది. కొత్త గా విధుల్లోకి చేరడం వల్ల కొంత పని ఒత్తిడి ఉంది. మూడు, నాలుగు రోజుల్లో తనిఖీలు చేసి.. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.

Advertisement
Advertisement