నేడు విజయవాడకు అన్ని శాఖల అధికారులు | Sakshi
Sakshi News home page

నేడు విజయవాడకు అన్ని శాఖల అధికారులు

Published Thu, Aug 7 2014 2:19 AM

Today, all branches of the authorities to Vijayawada

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అన్ని శాఖల అధికారులు ఒకేసారి విజయవాడకు రానున్నారు. గురువారం నగరంలోని గేట్‌వే హోటల్‌లో జరిగే జిల్లా కలెక్టర్ల సదస్సుకు హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు తరలివస్తున్నారు. సీఎం చంద్రబాబుతోపాటు 20 మంది మంత్రులు పాల్గొనే ఈ సదస్సును విజయవంతం చేసేందుకు జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు కసరత్తు చేస్తున్నారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, మంత్రులు, ఆయా శాఖల ముఖ్య అధికారులు, అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, జిల్లాల ఎస్పీలు, పోలీసు కమిషనర్లు, ఉన్నతాధికారులు హాజరవుతారు. జిల్లాల వారీగా సీఎం సమీక్షలు జరుపుతారు. శాఖల వారీగా సమీక్షలు ఉంటాయి. మధ్యాహ్నం భోజనం అనంతరం ఒంటి గంట నుంచి రాత్రి 8 గంటల వరకు తిరిగి సదస్సు నిర్వహిస్తారు.

ఈ సదస్సులో ఏడు ప్రాధాన్యతా రంగాలను గుర్తించి వాటికి అనుగుణంగా మిషన్లు ఏర్పాటు చేస్తారు. ముఖ్యమంత్రి ఏడు మిషన్లకు చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారు. ఈ సదస్సు నేపథ్యంలో బుధవారం నుంచే విజయవాడలో సందడి నెలకొంది. మంత్రులు చినరాజప్ప, యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమామహేశ్వరరావు, అచ్చెన్నాయుడు, అడిషినల్ డీజీ ఎన్‌వీ సురేంద్రబాబు తదితరలు గేట్‌వే హోటల్‌కు చేరుకున్నారు.

డెప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, వ్యవసాయశాఖా మంత్రి పి.పుల్లారావు, రాత్రికి నగరానికి చేరకున్నారు. నగరంలోనూ, గన్నవరం ఎయిర్‌పోర్టు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.  ఎయిర్‌పోర్టు నుంచి విజయవాడ వరకు ట్రయల్ రన్ నిర్వహించారు.
 

Advertisement
Advertisement