Sakshi News home page

రెండు చుక్కలు..

Published Sun, Jan 19 2014 2:31 AM

Two drops

కడపరూరల్, న్యూస్‌లైన్: పల్స్‌పోలియో టీకాల మందు కార్యక్రమం ఆదివారం జిల్లాలో ప్రారంభం కానుంది. అందుకోసం జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. 0-5 సంవత్సరాల మధ్య వయస్సుగల పిల్లల ఆరోగ్యానికి పల్స్‌పోలియో చుక్కల మందును తప్పక వేయించాలని అధికారులు పిలుపునిచ్చారు.
 
 జిల్లాలో 3.17 లక్షల మంది
 చిన్నారులకు
 ఆదవారం ప్రారంభం కానున్న పల్స్‌పోలియో కార్యక్రమంలో 0-5 సంవత్సరాల వయస్సుగల పిల్లలు జిల్లా వ్యాప్తంగా 3.17 లక్షల మందికి పైగా ఉన్నట్లు గుర్తించారు. ఇందుకోసం స్థానిక పల్స్‌పోలియో కేంద్రాలతోపాటు రైల్వేస్టేషన్, బస్టాండు, మొబైల్ వాహనాలను కలుపుకుని మొత్తం 3054 బూత్‌లను ఏర్పాటు చేశారు.
 
 ఒక బూత్‌కు నలుగురు సిబ్బంది చొప్పున మొత్తం 12,216 మందిని కేటాయించారు. ప్రస్తుతం ఆదివారం పల్స్‌పోలియో కేంద్రాల్లో చిన్నారులకు చుక్కల మందు వేయనున్నారు. ఈరోజు ఎవరైనా మందును వేయించుకోని పక్షంలో సోమ, మంగళ వారాల్లో సిబ్బంది ఇంటింటికి వచ్చి మందును వేస్తారు.
 
 వ్యాధుల నిరోధానికి
 ప్రధానంగా ధనుర్వాతం, కామెర్లు, కోరింత, కంఠసర్పి, క్షయ, పోలియో నివారణ కోసం చుక్కల మందు ఉపయోగపడనుంది. క్రమం తప్పకుండా చుక్కల మందును వేయించడం వల్ల పిల్లల ఆరోగ్య భవిష్యత్తుకు రక్షణగా నిలబడనుంది.
 
 ఆ మేరకు నిర్మాణరంగం, ఇటుకబట్టీలు, సంచార జాతులు, మురికివాడల్లో ఉన్న చిన్నారుల సంఖ్యను అధికారులు ఎప్పటికప్పుడు సిద్ధం చేయడం విశేషం. పోలియో కేసులకు సంబంధించి 2003 అక్టోబరులో కడప నగరం రవీంద్రనగర్‌లో ఒక కేసు మాత్రమే నమోదైంది.
 
 అన్ని చర్యలు చేపట్టాం!
 పల్స్‌పోలియో కార్యక్రమానికి అన్ని చర్యలు చేపట్టాము. తల్లిదండ్రులు 0-5 సంవత్సరాల లోపు పిల్లలకు తప్పకుండా పోలియో చుక్కల మందును వేయించాలి.
 - డాక్టర్ ప్రభుదాస్,
 జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి
 

Advertisement

What’s your opinion

Advertisement