చివరి వరకు పోరాటం | Sakshi
Sakshi News home page

చివరి వరకు పోరాటం

Published Sun, Dec 22 2013 4:06 AM

Until the end of the fight

ప్రొద్దుటూరు, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర కోసం చివరి వరకు పోరాటం చేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ జిల్లా కన్వీనర్ కె.సురేష్‌బాబు తెలిపారు. గడపగడపన సమైక్య నినాదం కార్యక్రమంలో భాగంగా శనివారం సాయంత్రం పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త రాచమల్లు ప్రసాదరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక మైదుకూరు రోడ్డులోని అన్వర్ థియేటర్ వద్ద  భారీ బహిరంగ సభ నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన సురేష్‌బాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వల్లే రాష్ట్ర విభజన నిర్ణయం జరిగిందన్నారు.  సమైక్యాంధ్ర కోసం  వైఎస్సార్‌కాంగ్రెస్‌పార్టీ  చిత్తశుద్ధితో పోరాటం చేస్తోందన్నారు. వైఎస్ కృషి వల్ల జిల్లాకు ఎంతో మేలు జరిగిందన్నారు.   జైలులో సైతం సమైక్యాంధ్ర కోసం దీక్ష చేసిన ఘనత జగన్‌దేనని తెలిపారు.
 
 ఎమ్మెల్సీ నారాయణరెడ్డి మాట్లాడుతూ  సమైక్య రాష్ర్టం కోసం ఎక్కడా లేని విధంగా నాలుగు నెలలుగా ప్రొద్దుటూరులో దీక్షలు చేపడుతున్నారన్నారు. వైఎస్సార్‌కాంగ్రెస్‌పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు వైఎస్ అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ  విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు తమ భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్ దెబ్బతింటుందని, రైతులకు సాగు నీరు అందడం ప్రశ్నార్థకంగా మారుతుందని, ఉద్యోగులకు ఉద్యోగ భద్రత ఉండదన్నారు.  తన కుమారుడు రాహుల్ గాంధీ కోసం తెలుగుజాతిని నిలువునా చీల్చే ప్రయత్నాన్ని సోనియా గాంధీ చేస్తున్నారన్నారు. రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి మాట్లాడుతూ సమైక్యాంధ్ర కోసం జగన్‌మోహన్‌రెడ్డి దేశమంతా తిరిగి శ్రమిస్తున్నారన్నారు.
 
 తెలుగు సంస్కృతిపై ఏమాత్రం అవగాహన లేని ఇటలీ మహిళ రాష్ట్ర విభజనకు పూనుకుందన్నారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధిచెందాలంటే హైదరాబాద్‌పై వచ్చే  పన్నులే ఆధారమని తెలిపారు. సమైక్య రాష్ట్రంలో  ఎన్నికలు జరిగితే సీమాంధ్రలోని 175 అసెంబ్లీ స్థానాల్లో 150  సీట్లు, తెలంగాణాలో  మరో 30 శాతం సీట్లను వైఎస్సార్‌సీపీ గెలిచే అవకాశం ఉందన్నారు.   డబ్బు ఇచ్చి రాజ్యసభ సీటును కొనుక్కున్న సీఎం రమేష్‌నాయుడుకు  జగన్‌ను విమర్శించే హక్కు లేదన్నారు.  ప్రొద్దుటూరు నియోజకవ్గ సమన్వయకర్త రాచమల్లు ప్రసాదరెడ్డి మాట్లాడుతూ సీఎం పదవి కోసం   కక్కుర్తి పడుతున్న  కిరణ్‌కుమార్‌రెడ్డి, రాజకీయ అవకాశవాది  చంద్రబాబు నాయుడు వల్లే రాష్ట్ర విభజన ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు. రానున్న ఎన్నికల్లో ఓటు అనే అస్త్రం ద్వారా రాష్ట్ర విభజనను సులువుగా ఆపవచ్చన్నారు.  కడప నియోజకవర్గ సమన్వయకర్త అంజాద్ బాషా మాట్లాడుతూ తెలుగు దేశం, కాంగ్రెస్ పార్టీ నేతల స్వార్థం వల్లే రాష్ట్ర విభజన జరుగుతోందన్నారు. చంద్రబాబు నాయుడు ఇప్పటికీ  జై సమైక్యాంధ్ర అనకుండా రెండు కళ్ల సిద్ధాంతాన్ని పాటిస్తున్నారన్నారు. సమావేశంలో  పార్టీ మండల కన్వీనర్ కల్లూరు నాగేంద్రారెడ్డి, ఈవీ సుధాకర్‌రెడ్డి,  పట్టణాధ్యక్షురాలు జింకా విజయలక్ష్మి, గోపికృష్ణ విద్యా సంస్థల అధినేత కేవీ రమణారెడ్డి, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి నిమ్మకాయల సుధాకర్‌రెడ్డి, మాధవ్ రెసిడెన్సీ మాధవరెడ్డి, రాజుపాళెం మండల కన్వీనర్ ఎస్‌ఏ నారాయణరెడ్డి, మాజీ కౌన్సిలర్లు పోరెడ్డి నరసింహారెడ్డి, గరిశపాటి లక్ష్మిదేవి తదితరులు ప్రసంగించారు.  జగన్‌మోహన్‌రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని  నేతలు వేదికపైనే కేక్ కట్ చేశారు.
 

Advertisement
Advertisement