సాక్షి, అమరావతి: అమెరికాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తిని వ్యక్తం చేస్తోందని ఉత్తర అమెరికాలో రాష్ట్రానికి చెందిన ప్రిన్సిపల్ లైజన్ లింగాల హరిప్రసాద్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే ముంబై, చెన్నై వంటి నగరాలను పరిశీలించిన ఆ కంపెనీ అక్కడి కంటే రాష్ట్రంలో వ్యయం తక్కువగా ఉండటం, నైపుణ్యం కలిగిన ఉద్యోగులు అందుబాటులో ఉండటంతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తిని చూపిస్తున్నట్లు హరిప్రసాద్రెడ్డి అమెరికా నుంచి ‘సాక్షి’కి ఫోన్లో వివరించారు. (చదవండి: సచివాలయాల్లో పారదర్శక పాలన)
ఆటో మొబైల్ కంపెనీలతో పాటు ఎలక్ట్రిక్ వాహనాలు, ఆటో విడిభాగాలు, డిజైనింగ్కు చెందిన అనేక చిన్న పెద్ద సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు. పలు కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అమెరికా పర్యటన సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్న కంపెనీలతో చర్చలు జరిపారని, అవి త్వరలోనే కార్యరూపం దాలుస్తాయన్నారు. కాగా, ఇప్పటికే దేశంలో పెట్టుబడులు పెట్టిన అమెరికా కంపెనీలు వాటి విస్తరణ కార్యక్రమాలకు రాష్ట్రాన్ని ఎంచుకునేలా చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. (చదవండి: ఏపీలో స్విస్ కంపెనీ భారీ పెట్టుబడి!)