జనంతో మమేకం | Sakshi
Sakshi News home page

జనంతో మమేకం

Published Fri, Jul 10 2015 3:11 AM

జనంతో మమేకం - Sakshi

సాక్షి, కడప :  వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గురువారం పులివెందుల నియోజకవర్గంలో బిజీ బిజీగా గడిపారు. లింగాల మండలం మురారిచింతల గ్రామ మాజీ ఎంపీటీసీ సభ్యుడు ఓబుళరెడ్డి (ఇటీవల వృుతి చెందాడు) కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. అంతకు ముందు వైఎస్ జగన్ గ్రామ పొలిమేరల్లోకి రాగానే పెద్ద ఎత్తున బాణా సంచా పేల్చు తూ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో నడుస్తూ వచ్చిన ఆయన దివంగత సీఎం వైఎస్‌ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వృద్ధులు,
 
 జనంతో మమేకం
 
 మహిళలతో మాట్లాడారు. కొందరు మహిళలు వైఎస్ జగన్‌ను చూడగానే ప్రభుత్వ అన్యాయాలను వివరిస్తూ కన్నీటి పర్యంతం కావడంతో.. భయపడవద్దని వారికి భరోసా ఇచ్చారు. తర్వాత నేరుగా ఓబుళరెడ్డి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఓబుళరెడ్డి చిత్ర పటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వృుతుడి భార్య కమలమ్మతోపాటు కుమారుడు శశిధర్‌రెడ్డితో వృుతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. వృుతుడి వియ్యంకుడు చంద్ర ఓబుళరెడ్డితో చర్చించారు. అనంతరం అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ సర్పంచ్ శివారెడ్డి ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
 
 మా ఊరిని మరవద్దు..  
 ‘జగన్ సార్.. మా మురారిచింతలను మరవద్దు.. మాకు మీ అభిమానం ఉంటే చాలు.. మీరేమి చెయ్యెద్దు.. మా గ్రామమంతా వైఎస్ కుటుంబ అభిమానులే... పార్టీ పరంగా, కుటుంబ పరంగా ఎప్పుడు అండగా ఉంటాం.. మీకు ఏ సమస్య వచ్చినా.. మా సమస్యగా భావించి తల్లడిల్లిపోతాం.. మమ్ములను గుర్తు పెట్టుకుంటే చాలు’ అని గ్రామానికి చెందిన శ్రీను, రామాంజనేయులు, తదితరులు వైఎస్ జగన్‌ను కోరారు. మురారి చింతలను తాను ఎందుకు మరిచిపోతానని, రాష్ట్ర స్థాయిలో అనేక కార్యక్రమాలు, పార్టీ వ్యవహారాలలో తలమునకలై ఉన్నందున తరచూ రాలేని పరిస్థితి నెలకొందని వైఎస్ జగన్ వివరించారు. పులివెందుల నుంచి ఇటువైపుగా వెళుతున్న ప్రతిసారి మురారిచింతల గ్రామంలో ఏదో ఒక కార్యక్రమానికి హాజరవుతున్నట్లు ఆయన తెలిపారు.
 
  అనంతరం పులివెందులలోని ఎర్రగుడిపల్లెకు చెందిన వైఎస్‌ఆర్‌సీపీ ఎస్సీ సెల్ నాయకుడు సూర్యనారాయణ కుమార్తె శైలజ, వెంకటస్వామి వివాహం ఈ మధ్యనే జరిగింది. ఈ నేపథ్యంలో గురువారం పులివెందులలోని వారి ఇంటికి వెళ్లి నూతన దంపతులను కడప ఎంపీ అవినాష్‌రెడ్డితో కలిసి ఆశీర్వదించారు. నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని అకాంక్షించారు. ఎర్రగుడిపల్లెలో వృద్ధులు, పలువురు యువకులతో జగన్ మాట్లాడారు. సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగారు. వైఎస్ జగన్‌తో కరచాలనం చేసేందుకు జనం పోటీపడ్డారు.
 
 ప్రజలతో మమేకం..
 పులివెందులలోని క్యాంపు కార్యాలయంలో ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌రెడ్డి ప్రజలతో మమేకమయ్యారు. గురువారం ఉదయం 8 గంటలనుంచి దాదాపు 11గంటల వరకు ప్రజలతో మమేకమయ్యారు. అంబకపల్లె రాఘవరెడ్డి.. ఎంపీపీ సుబ్బారెడ్డి, కొండారెడ్డి ద్వారా వైఎస్ జగన్‌ను గజమాలతో సన్మానించారు. వైఎస్ జగన్‌ను కలిసేందుకు వచ్చిన ప్రజలు, నాయకులు, కార్యకర్తలతో కార్యాలయం కిటకిటలాడింది. అందరితోనే ఆప్యాయంగా మాట్లాడి కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు.
 
 వైఎస్ జగన్‌ను కలిసిన నేతలు  
 పులివెందులలో ఉన్న ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని గురువారం పలువురు నేతలు కలిశారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డితోపాటు వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ పులివెందుల నియోజకవర్గ ఇన్‌ఛార్జి వైఎస్ భాస్కర్‌రెడ్డి, జెడ్పీ చెర్మైన్ గూడూరు రవి, వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు అంబటి కృష్ణారెడ్డితోపాటు   పలువురు నేతలు కలిసి చర్చించారు.  జగన్‌మోహన్‌రెడ్డి మూడు రోజుల జిల్లా పర్యటన విజయవంతమైంది. మంగళవారం కడపలో ఇఫ్తార్ విందు, పెద్ద దర్గా సందర్శన అనంతరం ఇడుపులపాయకు వచ్చిన వైఎస్ జగన్ బుధవారం వైఎస్‌ఆర్ జయంతి సందర్భంగా ఇడుపులపాయలో ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. అనంతరం పులివెందుల నియోజకవర్గలో పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. గురువారం పులివెందుల, లింగాల మండలాల్లో పర్యటించి ప్రజలతో మమేకమయ్యారు.
 

Advertisement
Advertisement