ఒక్క హామీ నిలబెట్టుకున్నావా? | Sakshi
Sakshi News home page

ఒక్క హామీ నిలబెట్టుకున్నావా?

Published Tue, May 19 2015 2:28 AM

సోమవారం అనంతపురం జిల్లా కాదలూరులో డ్వాక్రా మహిళలు, రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో ప్రసంగిస్తున్న వైఎస్ జగన్ - Sakshi

- రైతు భరోసా యాత్రలో బాబుపై మండిపడ్డ జగన్
- నిన్ను నమ్మిన అన్ని వర్గాలనూ నిలువునా ముంచావు
- ధైర్యముంటే సెక్యూరిటీ లేకుండా కన్పించు.. ప్రజలు నిన్ను రాళ్లతో కొట్టినా ఆశ్చర్యంలేదు

 
(రైతుభరోసా యాత్ర నుంచి సాక్షిప్రతినిధి): ‘‘అధికారంలోకి రాగానే బేషరతుగా రైతు రుణాలు మాఫీ చేస్తామన్నావు. డ్వాక్రా రుణాలనూ పూర్తిగా మాఫీ చేసే బాధ్యతను తీసుకుంటామన్నావు. ప్రతి ఇంటికీ ఓ ఉద్యోగం... ఉద్యోగం లేనివారికి రూ.2వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్నావు. గుడిసెలు లేకుండా ప్రతి ఒక్కరికీ పక్కా ఇళ్లు కట్టిస్తామన్నావు. ఎన్నికల తర్వాత హామీలన్నీ విస్మరించావు. ఒక్కటంటే ఒక్క హామీనీ నెరవేర్చలేదు. మీ వైఖరిపై రైతులు, డ్వాక్రా మహిళలు మండిపడుతున్నారు. ధైర్యముంటే ఇప్పుడు సెక్యూరిటీని పక్కనపెట్టి వీధుల్లో తిరగగలవా? అలా కనపడితే ప్రజలు రాళ్లతో కొట్టినా ఆశ్చర్యం లేదు’’ అని విపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు.

అనంతపురం జిల్లాలో జగన్ చేపట్టిన రెండోవిడత రైతు భరోసా యాత్ర సోమవారం ముగిసింది. చివరిరోజు ఆయన అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని డీ.హీరేహాళ్ మండలం కాదలూరులో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు బోయ ఆంజనేయులు కుటుంబాన్ని పరామర్శించారు. తర్వాత అదే గ్రామంలో డ్వాక్రా మహిళలు, రైతులతో ముఖాముఖి నిర్వహించారు. వ్యవసాయ, డ్వాక్రా రుణాలను పూర్తిగా మాఫీ చేస్తానని ఎన్నికలముందు చంద్రబాబు ఇచ్చిన హామీ యూట్యూబ్‌లో భద్రంగా ఉందని జగన్ చెప్పారు.

మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సెల్‌ఫోన్ తీసుకుని యూట్యూబ్ ఓపెన్‌చేసి చంద్రబాబు ప్రసంగాన్ని మైక్‌లో అందరికీ వినిపించారు. ఆ ప్రసంగం విన్న ప్రజలు... చంద్రబాబు మోసగాడని, మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకుని తమను ముంచేశాడని తీవ్రంగా విమర్శించారు. చంద్రబాబు హామీలు నెరవేర్చేవరకూ తమ పోరాటం ఆగదని ఈ సందర్భంగా జగన్ స్పష్టంచేశారు. ముఖాముఖిలో జగన్ ప్రసంగం ఆయన మాటల్లోనే...
 
'ఎన్నికలకు ముందు రైతురుణాలు 87 వేల కోట్ల రూపాయలున్నాయి. గతంలో ఏడు శాతం వడ్డీ చెల్లించేవారు. ఇప్పుడు 14 శాతం అపరాధ వడ్డీతో కలిపి కేవలం వడ్డీ రూపంలోనే 14 వేల కోట్ల రూపాయల భారం పడింది. అయితే.. చంద్రబాబు రుణమాఫీకి కేటాయించింది 4,600 కోట్లు మాత్రమే. మూడోవంతు మాఫీకి కూడా ఆ మొత్తం సరిపోదు.
 
డ్వాక్రా మహిళలదీ ఇదే పరిస్థితి. మహిళలకు తెలీకుండా పొదుపుసొమ్మును బ్యాంకర్లు అప్పుల్లో జమ చేసుకుంటున్నారు. బాబు మాత్రం రైతులు, డ్వాక్రా మహిళలు ఆనందంగా ఉన్నారని, తనకు శాలువాలు కూడా కప్పుతున్నారని బీరాలు పలుకుతున్నారు.
 
చంద్రబాబు ఇటీవల ప్రాజెక్టుల వద్దకు తిరుగుతున్నారు. హంద్రీ-నీవా వద్దకు వెళ్లి తానే ప్రాజెక్టును నిర్మించానని చెబుతున్నారు. ఆయన సీఎంగా ఉన్న తొమ్మిదేళ్లలో హంద్రీ-నీవాకు ముష్టి వేసినట్లు రూ. 13 కోట్లు విదిలించారు. దివంగత వైఎస్‌తోపాటు ఆ తర్వాతి ప్రభుత్వాలు రూ.5,800 కోట్ల ఖర్చు చేశాయి. మరో రూ.1100 కోట్లు ఖర్చుచేస్తే ‘అనంత’లో మూడు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. కానీ బడ్జెట్‌లో రూ.212 కోట్ల మాత్రమే కేటాయించారు.
 
ఇటీవల నేను కూడా హంద్రీ-నీవా పనులను పరిశీలించా. మల్యాల వద్ద ఉన్న 12 పంపుల్లో నాలుగు మాత్రమే పనిచేస్తున్నాయి. తక్కిన పంపులు ఎందుకు పనిచేయడం లేదని ఆరా తీశా. 23వ ప్యాకేజీ పనులు సీఎం రమేశ్ చేస్తున్నారని, 12 పంపులు వదిలితే కాలువ తెగిపోతుందని అధికారులు చెప్పారు. దీన్నిబట్టే పనులు ఎలా చేస్తున్నారో తెలుస్తోంది. పైగా నాలుగు పంపులతో నీళ్లు ఎత్తిపోసేందుకు రూ.250 కోట్లకుపైగా కరెంటు బిల్లు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. బాబు కేటాయించిన రూ.212 కోట్లు కరెంటు బిల్లులకే సరిపోకపోతే
 
ప్రాజెక్టును ఎలా పూర్తి చేస్తారు?
హంద్రీ-నీవానే కాదు.. గాలేరు-నగరితోపాటు చాలా ప్రాజెక్టుల్లో 87 శాతం పనులను వైఎస్ పూర్తి చేశారు. ఇప్పుడు బాబు వచ్చి కుళాయి తిప్పి నీళ్లు పట్టుకుంటున్నారు. పైగా ఎవరో పూర్తి చేసిన పనులను తానే చేశానని నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నారు. చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నీతి, నిజాయితీతో నెరవేర్చాలి. అప్పటివరకూ పోరాటం ఆగదు. మరింత గట్టిగా పోరాడతాం.
 
ఆంజనేయులు కుటుంబానికి పరామర్శ
చివరి రోజు రైతు భరోసా యాత్రలో భాగంగా జగన్ ఆత్మహత్యకు పాల్పడిన బోయ ఆంజనేయులు కుటుంబాన్ని సోమవారం పరామర్శించారు. డీ.హీరేహాళ్ మండలం కాదలూరు గ్రామానికి చెందిన బోయ ఆంజనేయులు(60) భార్య గంగమ్మను ఓదార్చారు.  తనకున్న ఐదెకరాల పొలంలో పత్తిపంట వేసిన ఆంజనేయులు అప్పుల బాధతో గత ఏడాది ఆగస్టు 4న పంటచేలో పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆంజనేయులు కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు.
 
నాశనం చేశారు సార్
బ్యాంకులో 8తులాలు బంగారం తాకట్టుపెట్టి 80 వేల రూపాయల రుణం తీసుకున్నాం. దానికి 35 వేల వడ్డీ అయ్యింది. రూపాయి కూడా మాఫీ కాలేదు. పైగా రేషన్‌కార్డు నెంబర్ తీసుకురా అని బ్యాంకోళ్లు అంటాండారు. 15ఏళ్ల నుంచి ఉన్నకార్డు తీసేశారు. ఇప్పుడు కార్డు నెంబర్ కావాలంటే ఎట్టా తెచ్చేది? అసలు, వడ్డీ చెల్లించాలంటున్నారు, మమ్మల్ని నాశనం చేసిపెట్టారు.
 - అంజనమ్మ, పల్లెపల్లి
 
రూపాయి కూడా మాఫీ కాలేదు
మా సంఘంలో రూ.   80 వేలు తీసుకున్నాం. రూ. 40 వేలు వడ్డీ వేయడంతో మొత్తం రూ.లక్షా ఇరవై వేలైంది. రూపాయి మాఫీ కాలేదు సార్. వైఎస్ ఉన్నపుడు పావలావడ్డీకి రుణాలు ఇచ్చారు. ఇప్పుడు మూడు రూపాయలపైన వడ్డీ పడుతోంది. ఇదేంటని అడిగితే చంద్రబాబును అడుగుపోండని బ్యాంకోళ్లు చెబుతున్నారు. ఇళ్లు, ఆస్తులు అమ్మి అప్పు చెల్లించండంటున్నారు.    
 - పద్మజ, రాయదుర్గం

Advertisement
Advertisement