♦ అట్టహాసంగా గడప గడపకు వైఎస్ఆర్సీపీ కార్యక్రమం ప్రారంభం
♦ ఇడుపులపాయలో ఇంటింటికి తిరిగిన వైఎస్ జగన్మోహన్రెడ్డి
♦ చంద్రబాబు చేసిన మోసాలపై వివరించిన ప్రతిపక్ష నేత
సాక్షి కడప : టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వైఎస్ఆర్ సీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘గడపగడపకు వైఎస్ఆర్ సీపీ’ కార్యక్రమం శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకొని ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ కార్యక్రమాన్ని ఇడుపులపాయలో లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా వైఎస్ఆర్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి ప్రార్థనలు చేశారు. అనంతరం ఇడుపులపాయ గ్రామానికి వెళ్లి అక్కడే ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎంపీ అవినాష్రెడ్డితో కలిసి ఎగురవేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
బొట్టు పెట్టి.. హారతి పట్టి..: ప్రతిపక్షనేత హోదాలో తొలిసారిగా ఇడుపులపాయ గ్రామంలో అడుగు పెడుతున్న సందర్భంగా వైఎస్ జగన్మోహన్రెడ్డికి మహిళలు ప్రత్యేకత చాటుకున్నారు. గ్రామంలోని దాదాపు 90ఇళ్లకు వెళ్లి చంద్రబాబు చేస్తున్న మోసాలను వివరించాలని నిర్ణయించుకున్న ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి మహిళలు వెన్నంటి ఉండి ప్రొత్సహించారు. అంతేకాకుండా ప్రతి ఇంటి వద్ద మహిళలు ఇంట్లో నుంచి కుంకుమతోపాటు హారతి తీసుకొచ్చి దిష్టి తీస్తూ కార్యక్రమాన్ని స్వాగతించారు. వేంపల్లె ఎంపీపీ రవికుమార్రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు షబ్బీర్, మండల కన్వీనర్ చంద్ర ఓబుళరెడ్డి, ఇడుపులపాయ సర్పంచ్ కృష్ణకుమారి, వైఎస్ఆర్సీపీ నాయకులు చలపతి, విజయ్కుమార్ వెంట రాగా వైఎస్ జగన్ అందరితో మాట్లాడుతూ గడపగడప తిరిగారు.
రామాలయంలో ప్రత్యేక పూజలు చేసిన వైఎస్ జగన్ : ఇడుపులపాయ గ్రామంలో ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. గడప గడపకు వైఎస్ఆర్సీపీ కార్యక్రమంలో భాగంగా గ్రామ మధ్యలో ఉన్న రామాలయంలోకి వెళ్లి పూజలు నిర్వహించారు. అర్చకులు వైఎస్ జగన్రెడ్డిని ఆశీర్వదించారు.
ఇడుపులపాయ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు: దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకొని కుటుంబ సభ్యులు ఇడుపులపాయలోని సమాధి ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రతిపక్షనేత వైఎస్ జగన్తోపాటు తల్లి వైఎస్ విజయమ్మ, పెద్దమ్మ వైఎస్ భారతమ్మ, సతీమణి వైఎస్ భారతిరెడ్డి ప్రార్థనలు చేశారు. అలాగే షర్మిలమ్మ, అనిల్రెడ్డిలతోపాటు వైఎస్ వివేకానందరెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి తదితరులు ప్రత్యేక ప్రార్థనలలో పాలు పంచుకున్నారు. వైఎస్ జయంతిని పురస్కరించుకొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం వైఎస్ఆర్ విగ్రహానికి వైఎస్ జగన్తోపాటు ఇతర నేతలంతా పూలమాలలు వేసి నివాళులర్పించారు.
90ఇళ్లు.. 4గంటల సమయం..
ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇడుపులపాయలో ఇంటింటికి తిరిగారు. ఒకటి, రెండు ఇళ్లు కాదు.. గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి చంద్రబాబు చేస్తున్న మోసాలను వివరించారు. ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులతో ప్రజా బ్యాలెట్లో ఉన్న వంద ప్రశ్నలను సంధిస్తూ సమాధానాలు రాబట్టారు. శుక్రవారం ఉదయం 10గంటలకు కార్యక్రమం ప్రారంభమైతే మధ్యాహ్నం 2.30గంటల వరకు ఇంటింటికి తిరుగుతూ గడప గడపకు వైఎస్ఆర్ సీపీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. గ్రామంలో తిరుగుతూ ఇంటింటి వద్ద తాను చెప్పేదే కాకుండా.. కుటుంబ సభ్యులు చెప్పే సమస్యలు ఆలకిస్తూ వైఎస్ జగన్ పర్యటన సాగించారు.
వైఎస్ జగన్ను కలిసిన పలువురు నేతలు..
వైఎస్ఆర్కాంగ్రెస్పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని పలువురు నేతలు కలిసి చర్చించారు. ప్రధానంగా వైఎస్ఆర్సీపీ సీజీసీ సభ్యులు వైఎస్ వివేకానందరెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి, జెడ్పీ చైర్మన్ గూడూరు రవి, కడప, రాయచోటి ఎమ్మెల్యేలు అంజాద్ బాషా, శ్రీకాంత్రెడ్డి, రైతువిభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్రెడ్డి, జిల్లా కార్యదర్శి వీరప్రతాప్రెడ్డి, వేముల మండల నాయకులు సాంబశివారెడ్డి, వేల్పుల రాము, చక్రాయపేట జెడ్పీటీసీ సభ్యుడు బెల్లం ప్రవీణ్కుమార్రెడ్డి, తొండూరు మండల నాయకులు రవీంద్రనాథరెడ్డి, రామమునిరెడ్డి, భాస్కర్రెడ్డి, సింహాద్రిపురం పరమేశ్వరరెడ్డి, పులివెందుల మండల కన్వీనర్ కొమ్మా శివప్రసాద్రెడ్డి, ప్రొద్దుటూరు నాయకులు కొమ్మా శివచంద్రారెడ్డిలతోపాటు పలువురు నేతలు కలిసి పలు అంశాలపై చర్చించారు.