అమెజాన్ తన గ్రేట్ ఇండియన్ సేల్ ఆగస్టు 9 నుంచి ఆగస్టు 12 వరకు నిర్వహించనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సేల్ సందర్భంగా అమెజాన్ ఆఫర్ చేయనున్న డిస్కౌంట్లు రివీల్ అయ్యాయి. పలు బ్రాండ్లపై డిస్కౌంట్లతో పాటు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా డెబిట్, క్రెడిట్ కార్డు హోల్డర్స్కు అదనపు క్యాష్బ్యాక్లను అందించనున్నట్టు అమెజాన్ చెప్పింది. మొబైల్ ఫోన్లు, యాక్ససరీస్పై 40 శాతం వరకు, ఎలక్ట్రానిక్స్పై 50 శాతం వరకు డిస్కౌంట్లను ఆఫర్ చేయనున్నట్టు తెలిపింది. అమెజాన్ ఎక్స్క్లూజివ్ బ్రాండ్లపైనా గ్రేట్ ఇండియన్ సేల్లో డిస్కౌంట్లను ఆఫర్ చేయనుంది ఈ కంపెనీ.
ఉదాహరణకు వన్ ప్లస్ స్మార్ట్ఫోన్లపై 2000 రూపాయల వరకు, ఎంపికచేసిన మోటోరోలా మొబైల్ ఫోన్లపై 5000 రూపాయల వరకు, ఆపిల్ స్మార్ట్ఫోన్లపై 35 శాతం వరకు డిస్కౌంట్లను అమెజాన్ ఆఫర్ చేయనుంది. ఎల్జీ జీ6 స్మార్ట్ఫోన్పై 31 శాతం వరకు డిస్కౌంట్ను ఆఫర్ చేస్తుంది. అంతేకాక ఈ ఫోన్పై ఎక్స్చేంజ్ ఆఫర్ కింద 19,470 రూపాయల వరకు తగ్గింపు ఇవ్వనుంది. అసలు ఈ ఫోన్ ధర రూ.55వేలు. అదేవిధంగా వన్ ప్లస్ 3టీ స్మార్ట్ఫోన్ను రూ.2000 డిస్కౌంట్తో రూ.27,999కి విక్రయానికి ఉంచనుందట. పాత డివైజ్తో ఎక్స్చేంజ్ చేసుకునే వారికి ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉందని తెలిసింది. ఐఫోన్ ఎస్ఈ 64జీబీ స్టోరేజ్ వేరియంట్పై ఏకంగా 43 శాతం డిస్కౌంట్ను అమెజాన్ ఆఫర్ చేస్తుంది. 49,999 రూపాయలు గల ఈ ఫోన్ను 27,999 రూపాయలకే విక్రయిస్తుంది. ఎక్స్చేంజ్లో మరో 19,470 రూపాయల వరకు తగ్గింపు వస్తుంది.