భారత్-అమెరికా బంధం మరింత పటిష్టం | Sakshi
Sakshi News home page

భారత్-అమెరికా బంధం మరింత పటిష్టం

Published Fri, Apr 17 2015 2:06 AM

భారత్-అమెరికా బంధం మరింత పటిష్టం - Sakshi

ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ
వాషింగ్టన్: భారత్- అమెరికా సంబంధాలు గతంకన్నా ఇప్పుడు మరింత బలోపేతం అయినట్లు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. పలు రంగాల్లో రెండు దేశాలూ సన్నిహిత సహకారాన్ని ఇచ్చిపుచ్చుకుంటున్నాయన్నారు.  కేవలం ప్రభుత్వం-ప్రభుత్వ స్థాయి సంబంధాలతోనే ఆగిపోకుండా... ప్రజలు సైతం ఈ బంధం పట్ల హర్షం, ఆమోదం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) సంస్థ  వార్షిక సమావేశాల్లో పాల్గొనడానికి ఆర్థికమంత్రి ఇక్కడకు విచ్చేశారు.

ఈ సందర్భంగా భారత దౌత్య కార్యాలయంలో ఆయన గౌరవార్థం ఏర్పాటు చేసిన ఒక విందు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒబామా ప్రభుత్వంలోని మంత్రులు, ఉన్నతస్థాయి అధికారులతోపాటు, ఇరు దేశాలకు చెందిన పలువురు సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ప్రసంగంలో ముఖ్యాంశాలు...
* ఇక్కడకు వచ్చిన అమెరికా ప్రభుత్వ సీనియర్లను చూస్తుంటే... రెండు దేశాల సంబంధాలు ఏ స్థాయిలో బలపడ్డాయో అర్థం అవుతుంది.
* పలు రంగాల్లో పురోభివృద్ధి ఉంది. దేశం ఒక గణనీయమైన మార్పు దిశగా అడుగులు వేస్తోంది.
* భారీ సంస్కరణల అమలుతో పలు ప్రాజెక్టుల్లో పురోగతికి కేంద్రం చొరవలు తీసుకుంటోంది. ముఖ్యంగా మౌలిక రంగం వృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.
* భారత్‌కు 10 శాతం వృద్ధి సాధించే సత్తా ఉంది. దేశంలో పెరుగుతున్న అవసరాలను నెరవేర్చుకోడానికి కూడా ఈ స్థాయి వృద్ధి సాధన అవసరం.
* వాషింగ్టన్‌లో పర్యటన సందర్భంగా భారత్-అమెరికా సంబంధాలపై జరిగిన ఒక ప్రత్యేక సుదీర్ఘ సదస్సులో కూడా జైట్లీ పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement