ముంబై : సెన్సెక్స్ సరికొత్త రికార్డు స్థాయిల్లో దూసుకెళ్లింది. ఆల్ టైమ్ గరిష్టంలో448 పాయింట్ల మేర లాభాల పంట పండించి, 30,750.03గా నమోదైంది. ఇటు నిఫ్టీ సైతం 149.20 పాయింట్లు లాభంలో కీలక మార్కు 9500 పైనే క్లోజైంది. ట్రేడింగ్ ముగియడానికి కొద్ది సేపటి ముందు సెన్సెక్స్ ఆల్ టైమ్ గరిష్టంలో 30,759.86గా ట్రేడైంది. ఎఫ్ఎంసీజీ, ఐటీ, రియాల్టీ, క్యాపిటల్ గూడ్స్, కన్జ్యూమర్ డ్యూరెబుల్స్, బ్యాంకింగ్, టెక్నాలజీ, ఆయిల్ అండ్ గ్యాస్, ఆటో, మెటల్ రంగాలు గురువారం ట్రేడింగ్ లో మంచి లాభాలతో దూసుకెళ్లాయి. లార్సెన్ అండ్ టర్బో, ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ, రియలన్స్ ఇంటస్ట్రీస్ లాభాల్లో దంచికొట్టడంతో, లుపిన్, డాక్టర్ రెడ్డీస్ నష్టాలు గడించాయి.
బ్యాంకు నిఫ్టీ భారీగా 3 శాతం మేర దూసుకెళ్లింది. మిడ్ క్యాప్స్ కూడా లాభాలు పండించాయి. నేటి ట్రేడింగ్ లో మార్కెట్లు దూసుకుపోవడానికి ప్రధాన కారణాలుగా ఆసియన్ ఈక్విటీ మార్కెట్లు రెండేళ్ల గరిష్టంలో నమోదుకావడం, అమెరికా ఎకనామిక్ మందగమనంపై సరియైన స్పష్టత వచ్చేంతవరకు వడ్డీరేట్ల పెంపు నిలిపివేయాలని ఫెడరల్ రిజర్వు సంకేతాలు ఇవ్వడం, మే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కాంట్రాక్ట్స్ నేటితో ముగుస్తుండటంతో షార్ట్ కవరింగ్స్, బలమైన రూపాయి విలువలు నిలిచాయి. అటు డాలర్ తో రూపాయి మారకం విలువ 16 పైసలు బలపడి 64.58గా ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా 3 రూపాయలు పడిపోయి 28,710గా ఉంది.