మృతదేహాన్ని చూసేందుకు కూడా ఇష్టపడలేదు.. | Sakshi
Sakshi News home page

హరీందర్‌ ఆత్మహత్య

Published Thu, Jul 26 2018 8:45 AM

Prisoner Commits Suicide In Hyderabad - Sakshi

బడంగ్‌పేట్‌: కట్టుకున్న భార్యను, ఇద్దరు పిల్లలను దారుణంగా హతమార్చిన కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి బుధవారం గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సుమిత్ర ఎన్‌క్లేవ్‌లో ఉంటున్న హరీందర్‌గౌడ్‌ గతంలో డెంటల్‌ టెక్నిషియన్‌గా పనిచేసేవాడు .ఉద్యోగం మానేసి ఇంట్లో ఖాళీగా ఉంటున్న అతను మానసిక సమస్యతో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో గత ఫిబ్రవరి 5న అర్థరాత్రి  తన భార్య జ్యోతి  తల పగులగొట్టి దారుణంగా హతమార్చడమేగాక, కుమారుడు అభి(6), కుమార్తె సహస్ర(2) దిండుతో అదిమి హత్య చేశాడు

జైలుకు వెళ్లి వచ్చినా అదే పంథా...
 ఈ కేసులో అరెస్ట్‌ జైలుకు వెళ్లిన హరీందర్‌ రెండు నెలల క్రితం బెయిల్‌పై బయటికి వచ్చాడు. అయినా తన పంథా మార్చుకోని అతను  కాలనీవాసులను భయభ్రాంతులకు గురి చేస్తుండటంతో మీర్‌పేట పోలీసులు రౌడీషీట్‌ ఓపెన్‌ చేశారు. ఇందులో భాగంగా స్టేషన్‌లో సంతకం చేసేందుకు వారానికి ఓసారి కుల్కచర్ల నుంచి జిల్లెలగూడకు వచ్చి పోతున్నాడు.  రెండు రోజుల క్రితం తండ్రి నారాయణగౌడ్‌తో జిల్లెలగూడకు వచ్చిన అతను ఇంటిని శుభ్రం చేసుకున్నాడు. తండ్రికి వేరే పని ఉండటంతో స్వగ్రామానికి తిరిగి వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న హరీందర్‌గౌడ్‌ మంగళవారం రాత్రి  కత్తితో గొంతుకోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తండ్రి ఫోన్‌ చేసినా స్పందించకపోవడంతో ఆయన హస్తినాపురంలో ఉంటున్న మరో కుమారుడికి ఫోన్‌ చేసి చెప్పడంతో అతను బుధవారం  జిల్లెలగూడకు  వచ్చి చూడగా   బెడ్‌పై హరీందర్‌గౌడ్‌ విగత జీవిగా పడి ఉన్నాడు.  పోలీసులకు సమాచారం అందించడం తో వనస్థలిపురం ఏసీపీ గాంధీనారాయణ, మీర్‌ పేట ఎస్‌ఐలు మైబెల్లి, రాఘవేందర్, క్లూస్‌ టీం, డ్వాగ్‌ స్కాడ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు.

మృతదేహాన్ని చూసేందుకు విముఖత..
భార్య, ఇద్దరు పిల్లలను దారుణంగా హత్య చేసిన హరీందర్‌ మృతదేహాన్ని చూసేందుకు కూడా కాలనీవాసులు, బంధువులు ముందుకు రాలేదు.  తానే ఆత్మహత్య చేసుకున్నాడా? లేక ఎవరైనా హత్య చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ  తెలిపారు.

Advertisement
Advertisement