నాగోలు: ఓ రౌడీ షీటర్ దారుణ హత్యకు గురైన సంఘటన ఎల్బీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. భరత్నగర్కు చెందిన తంగడపల్లి రాములు(50)కు ఇద్దరు భార్యలు. మొదటి భార్య విజయలక్ష్మీ ప్రస్తుతం కువైట్లో ఉండగా, రెండో భార్య జ్యోతి రాజేంద్రనగర్లో నివాసముంటోంది. రాములుపై ఎల్బీనగర్ పోలీస్స్టేషన్లో 5 కేసులు నమోదు కావడంతో పోలీసులు అతడిపై రౌడీషీట్ ఓపెన్ చేశారు.
సాయినగర్కు చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం విషయమై జరిగిన గొడవలో జైలుకు వెళ్లిన రాములు ఏప్రిల్ 24న బయటికి వచ్చాడు. మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు అతడికి ఫోన్ చేయడంతో బయటికి వెళ్లాడు. బుధవారం ఉదయం ఫతుల్లాగూడ, ఆప్కోకాలనీ సమీపంలో అతడి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించగా, అతడిని కత్తులతో పొడిచి హత్య చేసినట్లు గుర్తించారు. వివాహేతర సంబంధం కారణంగానే హత్య జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎల్బీనగర్ ఇన్చార్జి డీసీపీ ప్రకాశ్రెడ్డి, ఏసీపీ పృధ్వీదర్రావు, సీఐ కాశిరెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు క్లూస్టీం, డాగ్స్క్వాడ్ ఆధారాలు సేకరించాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.