సాక్షి, హైదరాబాద్ : నగరంలోని ఓ అపార్ట్మెంట్లో భారీ పేలుడు సంభవించిన ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ పేలుడు దాటికి ప్లాట్ పూర్తిగా ధ్వంసంమైంది. ఈ సంఘటన హైదరాబాద్లోని చందానగర్ శంకర్ నగర్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. శంకర్ నగర్లోని ఓ అపార్ట్మెంట్లో ఉండే గణేష్ అనే వ్యక్తికి చెందిన ప్లాట్లో పేలుడు సంభవించింది. ఈ పేలుడు దాటికి ప్లాట్ పూర్తిగా ధ్వంసం అయిపోగా గణేష్కు, అతని కుమార్తె శ్రీ ప్రియకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే అదే ఇంట్లో ఉన్న మరో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. గాయపడ్డవారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు.
పేలుడు జరిగిన సమయంలో ఇంట్లో మూడు సిలిండర్లు ఉన్నాయి. ఒక సిలిండర్లో గ్యాస్ అయిపోవటంతో దాన్ని పక్కన పెట్టారు. అదే ప్రాంతంలో పేలుడు జరిగింది. అయితే సిలిండర్ క్యాప్ పెట్టినట్లే ఉంది. గ్యాస్ లీకైన దాఖలాలు లేకపోయినా పేలుడు జరిగింది. గ్యాస్ లీకవటం వల్లే పేలుడు జరిగిందా? లేదా మరేదైనా పేలుడు జరిగిందా? అన్న అనుమానంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధిత కుటుంబం సైతం అది గ్యాస్ పేలుడు కాదని చెప్పటం పలు అనుమానాలకు తావిస్తూంది.