దేహదారుఢ్య పరీక్షలో కుప్పకూలిన అభ్యర్థి
చికిత్స అనంతరం స్వగ్రామంలో మృతి
ఏలూరు అర్బన్ :
ఎస్సై ఉద్యోగాలకు నిర్వహించిన దేహదారుఢ్య పరీక్షలో భాగంగా పరుగు తీస్తూ కుప్పకూలిపోయిన అభ్యర్థి చికిత్స అనంతరం మృత్యువాత పడిన ఘటన ఇది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో చోటుచేసుకున్న ఈ విషాదకర ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. ఎస్సై ఉద్యోగార్థులకు ఏలూరు అమీనా పేటలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో సోమవారం 1,600 మీటర పరుగు పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలో పాల్గొన్న తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ మండలం కోరుకొండ గ్రామ పరిధిలోని హరిపురానికి చెందిన ఎల్వీసీ శేఖర విశ్వనాథం పరుగు మధ్యలో కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని 108 వాహనంలో నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అతడి ఆరోగ్యం కుదుటపడిందని నిర్ధారించిన వైద్యులు సోమవారం సాయంత్రం అతడిని డిశ్చార్జి చేయగా.. స్వగ్రామానికి వెళ్లిపోయాడు. మంగళవారం అతడి పరిస్థితి విషమించడంతో ఇంటివద్ద మృతి చెందాడు.