ఎస్పీ ఆకే రవికృష్ణ
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : గొలుసు దొంగల ఆటకట్టించేందుకు ప్రత్యేక మఫ్టీ పోలీసు బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ పేర్కొన్నారు. సీబీజెడ్, హంక్, పల్సర్ లాంటి హైస్పీడు బైక్లతో కూడా నగరంలో నిఘా ఉంచేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు చెప్పారు. ఆదివారం బిర్లాగేటు సమీపంలో జరిగిన చైన్ స్నాచింగ్ సంఘటన స్థలాన్ని ఎస్పీ సందర్శించి బాధితురాలి ఇంటికెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గొలుసు దొంగల బారిన పడకుండా మహిళలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
చిరునామా అడుగుతూ మాటల్లో పెట్టి సులువుగా గొలుసులు లాక్కెళ్లుతున్నారని అలాంటి వారిపట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆభరణాలు ధరించిన మహిళలు అవి బయటకు కనిపించకుండా చీర కొంగు లేదా చున్నీ కప్పుకోవాలని సూచించారు. కాలనీల్లో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే 100 డయల్ చేయాలని, లేదంటే స్థానిక పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు. ఆయన వెంటనే మూడో పట్టణ సీఐ మధుసూదన్రావు ఉన్నారు.