మల్దకల్: వ్యవసాయ పొలంలో నీటిని నిల్వ ఉంచుకునేందుకు ఏర్పాటు చేసిన ట్యాంకులో పడి ఓ చిన్నారి మృతిచెందిన విషాదకర సంఘటన సోమవారం మండలంలోని మంగంపేటలో చోటుచేసుకుంది. బాధితుల కథనం మేరకు.. అమరవాయి పంచాయతీ పరిధిలోని మంగంపేట గ్రామానికి చెందిన రామకష్ణ, సుజాత దంపతులకు కొడుకు, కుమార్తె ఉంది. వీరికి ఉన్న రెండెకరాల వ్యవసాయ పొలంలో ఈ ఏడాది సీడ్పత్తిని సాగుచేశారు.
రోజులాగే ఉదయం పొలానికి నీళ్లు పారించేందుకు వెళ్లిన తండ్రి వెంట కూతురు వైష్ణవి(4) కూడా వెళ్లింది. చిన్నారి సమీపంలో ఉన్న నీటి ట్యాంకు వద్దకు ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు అందులో పడి చనిపోయింది. తండ్రికి కూతురు కనిపించకపోవడంతో చుట్టుపక్కల వెతికాడు. నీటిట్యాంకులో విగతజీవిగా పడి ఉన్న కూతురును చూసి ఒక్కసారిగా బోరున విలపించాడు. అప్పటి దాకా ఆడుకుంటూ కనిపించిన కూతురు శవమై కనిపించడంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. విషయం తెలుసుకున్న గ్రామస్తులు సంఘటన స్థలానికి చేరుకుని చిన్నారిని చూసి కంటతడి పెట్టారు.