కృష్ణా పుష్కరాల మొదటిరోజు విషాదం చోటుచేసుకుంది. విజయవాడ సమీపంలో ఇన్నోవా కారు ఢీకొని ఓ కానిస్టేబుల్ మరణించారు. చిత్తూరు జిల్లాకు చెందిన వెంకట్రావు అనే కానిస్టేబుల్ కృష్ణా పుష్కరాల్లో విధులు నిర్వర్తించేందుకు విజయవాడ వచ్చారు. అలా వచ్చినవారందరికీ గూడవల్లి వద్ద ఓ కాలేజిలో వసతి కల్పించారు.
శుక్రవారం ఉదయం విధులకు హాజరయ్యేందుకు వెంకట్రావు బయల్దేరి జాతీయ రహదారి దాటుతుండగా.. వేగంగా వచ్చిన ఇన్నోవా కారు ఆయనను ఢీకొంది. దాంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... ఆయనను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం 108 వాహనంలో విజయవాడకు కూడా తరలించారు. కానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వెంకట్రావు మరణించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.