కుమారున్నే అమ్మబోయాడు.. | Sakshi
Sakshi News home page

కుమారున్నే అమ్మబోయాడు..

Published Tue, Oct 6 2015 9:33 PM

father try to sell his son for Liqueur in warangal district

కేసముద్రం(వరంగల్): బిడ్డను కంటికిరెప్పలా చూడాల్సిన తండ్రి మద్యానికి బానిసై కుటుంబాన్ని మరిచాడు. చివరకు మద్యం తాగేందుకు డబ్బులు లేకపోవడంతో కన్నబిడ్డను అమ్మడానికి సిద్ధపడ్డాడు. బిడ్డను అమ్మొద్దని అడ్డువచ్చిన భార్యను చితకబాదాడు. ఎలాగోలా తప్పించుకున్న ఆమె బిడ్డను కడుపున బెట్టుకుని పరారై వరంగల్ జిల్లా కేసముంద్రం రైల్వేస్టేషన్‌లో తలదాచుకుంది.

 ఎస్సై ఫణిధర్ తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడలోని కొత్తపేట కనకదుర్గ కాలనీకి చెందిన షేక్ సల్మా, అదే ప్రాంతంలోని కె.రాజు ప్రేమ వివాహం చేసుకున్నారు. తాపీ మేస్త్రీ పనిచేస్తూ రాజు కుటుంబాన్ని సాకుతున్నాడు. వారికి కుమారుడు రఫీ (3) ఉన్నాడు. పనిమానేసిన రాజు మద్యానికి బానిసయ్యాడు. ఇంట్లో ఉన్నదంతా అమ్ముకుంటూ మద్యానికి వెచ్చించాడు. డబ్బు కోసం భార్యను వేధిస్తున్నాడు. అంతటితో ఆగకుండా పుట్టిన బిడ్డను అమ్మడానికి యత్నించాడు. భార్య వాదించడంతో చితకబాదాడు. ఎలాగోలా భర్త నుంచి తప్పించుకున్న సల్మా కొడుకును తీసుకుని మూడు రోజుల క్రితం విజయవాడలోని రైలు ఎక్కి కేసముద్రం రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. భిక్షాటన చేస్తూ బిడ్డ కడుపు నింపుతోంది. గమనించిన స్థానికులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. మంగళవారం పోలీసులు రైల్వేస్టేషన్ చుట్టుపక్కల తిరుగుతున్న ఆమెను పోలీస్‌స్టేషన్.. అనంతరం తల్లీబిడ్డను వరంగల్‌లోని స్వధార్ హోంకు తరలించారు.

Advertisement
Advertisement