త్రినేత్రం | Sakshi
Sakshi News home page

త్రినేత్రం

Published Sun, Jul 31 2016 12:10 AM

త్రినేత్రం - Sakshi

– రూ.2కోట్లతో పుష్కరఘాట్ల వద్ద 500 సీసీ కెమెరాల ఏర్పాటు
– 11వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు
– జాతీయ రహదారిపై ప్రత్యేక నిఘా
 
కృష్ణా పుష్కరాలలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. జాతీయ రహదారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడంతో పాటు 32పుష్కరఘాట్ల వద్ద 500 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనుంది. 11వేల మంది సిబ్బందితో బందోబస్తు నిర్వహించనుంది.  
 
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారిగా జరగనున్న కృష్ణా పుష్కరాలకు జిల్లా పోలీస్‌శాఖ ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలో మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలోనే కృష్ణా పరివాహక ప్రాంతం ఉండటంతో జిల్లాలో పుష్కరఘాట్లకు దాదాపు మూడు కోట్ల మంది వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎక్కడా అవాంచనీయ సంఘటనలు జరగకుండా దాదాపు 40నుంచి 45వేల మందికి ఒక సీసీ కెమెరాతో పర్యవేక్షణ చేసేలా ప్రణాళిక రూపొందించారు. ఇప్పటికే జిల్లాలో 32 ఘాట్లను గుర్తించిన అధికారులు, అందులో అత్యంత ముఖ్యమైన 9 ఘాట్లను గుర్తించారు. బందోబస్తుపరంగా ఎక్కడ తగ్గకుండా చూస్తున్నారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని క్షేత్రస్థాయి సిబ్బందికి ఇప్పటికే ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. పుష్కరాలను పూర్తిగా నిఘా నేత్రంతో పహారా చేయాలని భావిస్తున్న పోలీసులు అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. 
 
 32ఘాట్లలో 500సీసీ కెమెరాలు..
గుర్తించిన 32ఘాట్లలో రూ.2కోట్లతో 500సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని జిల్లా పోలీసు అధికారులు ప్రాథమికంగా అంచనాకొచ్చి పుష్కరాలకు కావాల్సిన కెమెరాలు, పోలీస్‌ బలగాలు, భారీ గ్రేడ్స్‌ ఇతర వాటికి కోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వనికి జిల్లా పోలీస్‌ శాఖ నుంచి ప్రతిపాదన వెళ్లింది. పుష్కరాల కోసం ఏర్పాటు చేసే కెమెరాలు 360డిగ్రీల కోణంలో తిరిగే వాటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దాదాపు రూ.70నుంచి 80వేలను ఒక్కో కెమెరాకు ఖర్చు చేసి అత్యంత టెక్నాలజీతో కూడిన నిఘా పెట్టాలని భావిస్తున్నారు. ఎక్కడ కూడా ఏ చిన్న సంఘటన జరిగిన సకాలంలో స్పందించడానికి ఈ కెమెరాలను ఉపయోగించుకోనున్నారు. మొత్తం 500కెమెరాలకు కలిపి రెండు కంట్రోల్‌ రూంలు ఏర్పాటు చేసి అక్కడ నుంచి ఏ ప్రదేశంలో ఎలాంటి సంఘటన చొటుచేసుకున్న స్థానిక విధులు నిర్వహిస్తున్న పోలీసులకు సమాచారం చేరవేయనున్నారు.
 
జాతీయ రహదారిపై ప్రత్యేక దృష్టి
రానున్న పుష్కరాల సందర్భంగా జిల్లాలో దాదాపు 185కిలోమీటర్ల పొడవు ఉన్న జాతీయరహదారిపై పోలీసులు ప్రత్యేక దృష్టిసారించారు. హైవేపై అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు ట్రాఫిక్‌ సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. దీనిపై పూర్తిస్థాయిలో కసరత్తు చేస్తున్నారు. బీచుపల్లి సమీపంలో ఉన్న జాతీయ రహదారిపై ఎలాంటి ఇబ్బంది రాకుండా పోలీసులు ముందు నుంచే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నెల రోజుల ముందే నుంచి పుష్కరఘాట్ల పరిసర ప్రాంతాలను పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. ఘాట్ల సమీపంలో సరికొత్త బారీకేడ్లను వాడుతున్నట్లు తెలుస్తోంది.
 
11వేల మంది బందోబస్తు
పుష్కరాల సమయంలో జిల్లాలో బందోబస్తు నిర్వహించడానికి పోలీస్‌ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. స్థానికంగా ప్రభుత్వం ఎక్కువ సంఖ్యలో ఘాట్లు ఏర్పాటు చేయడంతో బందోబస్తు భారీస్థాయిలో ఉండాలని పోలీసులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో మూడు వేల పోలీస్‌ సిబ్బంది ఉండటంతో అదనంగా మరో 8వేల మందిని ఇతర జిల్లాల నుంచి రప్పిస్తున్నారు. సివిల్‌ పోలీసులతో పాటు పారా మిలిటరీ, ట్రాఫిక్‌ ఇతర విభాగాలు వారు ఉండనున్నారు. ముఖ్యంగా పుష్కరాల కోసం వచ్చే భక్తుల వాహనాలను పార్కింగ్‌ స్థలాలను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. బందోబస్తులో 10మంచి అదనపు ఎస్పీలు, 25మంది డీఎస్పీలు, 150మంది సీఐలు, 750మంది ఎస్‌ఐలు ఉంటారు.  
 

Advertisement
Advertisement