హోరు గాలి.. జోరు వాన | Sakshi
Sakshi News home page

హోరు గాలి.. జోరు వాన

Published Mon, May 16 2016 9:34 AM

Heavy rain in medak district, damaged

జిల్లాలో గాలివాన బీభత్సం
పలుచోట్ల కూలిన భారీ వృక్షాలు
నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు
ఎగిరిపోయిన ఇళ్ల పైకప్పులు
అంధకారంలో గ్రామాలు

 
పటాన్‌చెరు/చేగుంట/భెల్/ శివ్వంపేట: జిల్లాలో శనివారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. భారీగా వీచిన గాలికి వృక్షాలు నేలకొరిగాయి. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. విద్యుత్ తీగలు తెగిపడటంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పటాన్‌చెరు పట్టణం వెంకటేశ్వర కాలనీ,ఆల్విన్ కాలనీల్లో భారీ వృక్షాలు నేలకూలాయి. విద్యుత్ తీగలు తెగిపడటంతో సరఫరా నిలిచిపోయింది. రోడ్లకు అడ్డంగా చెట్లు పడిపోవడంతో రాకపోకలు స్తంభించాయి. అమీన్‌పూర్, కిష్టారెడ్డిపేట, పటేల్‌గూడ ప్రాంతాల్లోని 50 కాలనీలు అంధకారంలో ఉండిపోయాయి.

చేగుంట మండలం చిట్టోజిపల్లి గ్రామంలో మామిడిచెట్టు ఈదురుగాలులకు కూలిపోయింది. దీంతో పాడిగేదె చె ట్టుకింద పడి మృతి చెందింది. అదే గ్రామానికి చెందిన జంగం కృష్ణ, జంగం స్వామిలకు చెందిన ఇళ్ల పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. బీహెచ్‌ఈఎల్ టౌన్‌షిప్‌లో సుమారు వంద చెట్లు నేలకూలాయి.
 
 అనేక విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి.  24 గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. శివ్వంపేట మండలం పోతారంలో పౌల్ట్రీఫాం కూలిపోయింది. సుమారు 500 కోళ్లు మృతి చెందాయి. రూ. 6లక్షల వరకు నష్టం వాటిల్లినట్టు బాధితుడు తెలిపారు. దొంతి, మగ్దుంపూర్, ఉసిరికపల్లిలో రేకుల ఇళ్ల పైకప్పులు కూలాయి. దీంతో భయభ్రాంతులకు గరైన కుటుంబ సభ్యులు బయటకు పరుగులు తీశారు. తూప్రాన్-నర్సాపూర్ ప్రధాన రహధారి పక్కన చెట్లు కూలిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది.

Advertisement
Advertisement