కాటేసిన కట్న రక్కసి | Sakshi
Sakshi News home page

కాటేసిన కట్న రక్కసి

Published Mon, Sep 19 2016 12:58 AM

husband murdered wife

ఏలూరు అర్బన్‌: కట్న దాహానికి ఓ అబల బలైపోయింది. ఆమెను కిరాతకంగా కొట్టి చంపిన భర్త ఆత్మహత్య చేసుకున్నట్టు చిత్రీకరించే ప్రయత్నం చేసి పరారయ్యాడు. ఏలూరు మండలం శనివారపుపేట పం చాయతీలోని శ్రీరామ్‌నగర్‌ 3వ రోడ్డులో ఆదివారం జరిగిన దారుణానికి సంబంధించి మృతురాలి తల్లి తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. సత్తుపల్లికి చెందిన షేక్‌ మస్తాన్, నాగూర్‌బీ దంపతులకు ముగ్గురు కుమార్తెలు. వీరి పెద్ద కుమార్తె, మృతురాలు సాయిబీ(33)ని ఏలూరుకు చెందిన షేక్‌  అబ్డుల్‌ సలీంకు ఇచ్చి 2011లో వివాహం చేశారు. పెళ్లయినప్పటి నుంచి సలీమ్‌ అదనపు కట్నం కోసం సాయిబీని వేధిస్తున్నాడు. అయితే తల్లి ఆర్థిక పరిస్థితి తెలిసిన సాయి బీ భర్త వేధింపులు భరిస్తూ స్థానికంగా ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తూ వచ్చిన జీతాన్ని భర్తకు ఇస్తూ కాపురం నెట్టుకొస్తుంది. ఈ నేపథ్యంలో ఆదివారం అదనపు కట్నం విషయంగా గొడవపడిన సలీమ్‌ సాయిబీని తీవ్రంగా కొట్టాడు. సాయిబీ విషయాన్ని తల్లికి ఫోన్‌ చేసి చెప్పింది. ఇది జరిగిన కొద్దిసేపటికి సలీమ్‌ అత్త నాగూర్‌బీకి ఫోన్‌ చేసి సాయిబీ ఆరోగ్యం సరిగా లేదని అర్జంటుగా ఏలూరు రావాలని చెప్పాడు. దీంతో కంగారుపడిన నాగూర్‌బీ ఏలూరు వచ్చి అల్లుడి ఇంటికి రాగా సాయిబీ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. తన కుమార్తెను అల్లుడే హత్యచేసి పారిపోయాడని త్రీటౌన్‌ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు అందుకున్న ఇన్‌చార్జి ఎస్సై ఎన్‌.రాంబాబు సంఘటనా స్థలానికి చేరుకుని మృతురాలి బంధువులను విచారించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని, నిందితుడు పరారీలో ఉన్నాడని ఎస్సై రాంబాబు చెప్పారు. 
 

Advertisement
Advertisement