- 18 మందికి రక్తగాయాలు
- నలుగురి పరిస్థితి విషమం
ఆదోని టౌన్: జీవనోపాధి కోసం ఇతర ప్రాంతానికి పనులకు వెళ్తున్న కూలీలు రోడ్డు ప్రమాదం బారిన పడ్డారు. వారు వెళ్తున్న ఆటోలను లారీ ఢీకొట్టడంతో 18 మంది గాయపడిన ఘటన శుక్రవారం ఆలూరు మండలం మరకట్టు గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. ఎస్ఐ ధనుంజయ, ,క్షతగాత్రుల వివరాల మేరకు.. ఆదోని వాల్మీకినగర్, బోయగేరికి చెందిన కూలీలు హాలహర్వి పొలాల్లో చిన్నకాకరకాయల కోతకు వెళ్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం ఆటోల్లో వెళ్తుండగా మరకట్టు వద్ద ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు.
వీరిని ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎమ్మెల్యే తనయుడు మనోజ్కుమార్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు, పార్టీ నాయకులు ఆసుపత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. కృష్ణవేణి, వీరేష్, ఉసేనమ్మ, ఉరుకుందమ్మ, జయమ్మ, బి.కృష్ణవేణి, అంపమ్మ, ఈరన్న, వీరేశమ్మ, శంకరమ్మ, లక్ష్మి, ఈరమ్మ, సోమేశ్వరి, శ్రీనివాస్, తిక్కన్న గాయపడిన వారిలో ఉన్నారు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.