గాడి తప్పిన విద్య | Sakshi
Sakshi News home page

గాడి తప్పిన విద్య

Published Thu, Aug 18 2016 12:46 AM

గాడి తప్పిన విద్య - Sakshi

  • గాంధారిలో ఒకే రోజు డిఈవో, డిప్యూటీ డిఈవో, ఎంఈవోల తనిఖీలు
  • ఒకరు సస్పెన్షన్, ఇద్దరికి మెమోలు జారీ
  • వెలుగులోకి అనేక అక్రమాలు
  • గతంలోనే వెలుగులోకి తెచ్చిన సాక్షి
  • నిజామాబాద్‌ అర్బన్‌ : పాఠశాల విద్యాబోధన అస్తవ్యస్తంగా తయారైంది.. అక్రమాలకు నిలయంగా మారింది.. పాఠాలు బోధించాల్సిన ఉపాధ్యాయులు కొందరు పక్కదారి పడుతున్నారు. అక్రమాలకు పాల్పడుతూ, విధులకు డుమ్మా కొడుతూ విద్యాబోధనను విస్మరిస్తున్నారు. గాంధారి మండలంలో విద్యావ్యవస్థ గాడి తప్పింది. కొన్నేళ్లుగా ఈ తంతు కొనసాగుతూనే ఉంది. తాజాగా మండలంలో డీఈవో తనిఖీలతో అక్రమాలు బయటపడ్డాయి. గాంధారి మండలంలో విద్యాబోధన, వసూళ్ల పర్వంపై ‘సాక్షి’ జనవరిలోనే వెలుగులోకి తెచ్చింది. దీంతో ఫిబ్రవరి 13న డీఈవో లింగయ్య ఒకే రోజు 15 పాఠశాలలను తనిఖీ చేశారు. అక్రమాలు వెలుగులోకి రావడంతో కొందరు టీచర్లపై చర్యలు కూడా తీసుకున్నారు. ఆ తర్వాత అదే పరిస్థితి పునరావృతమైంది. ఆగస్టు 15న స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా జెండా ఎగురవేసిన టీచర్లు.. ఉదయం 10 గంటలకే జెండాను దింపేశారు. కనీసం జాతీయ పతాకాన్ని జెండా కర్ర నుంచి వేరు చేయకుండా ఓ గదిలో పడేసి వెళ్లిపోయారు. ఉపాధ్యాయుల నిర్లక్ష్యంపై పత్రికలో రావడంతో డీఈవో మంగళవారం మళ్లీ తనిఖీలు చేశారు.
    ఎన్నో అక్రమాలు వెలుగులోకి..
    గుర్జల్‌ తండా పాఠశాలను డీఈవో లింగయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిజిస్టర్‌ పట్టుకొని ఇంటింటికీ తిరిగి విద్యార్థులను ఆరా తీశారు. ప్రైవేట్‌ పాఠశాలలో చదువుతున్న యోగేశ్, జైల్‌సింగ్‌ పేర్లు ప్రభుత్వ పాఠశాల రిజిస్టర్‌లో నమోదు చేయడం చూసి అవాక్కయ్యారు. అంతేకాక, ఆ పాఠశాలలో కేవలం 12 మంది విద్యార్థులే ఉంటే, 22 మంది ఉన్నట్లు నమోదు చేసినట్లు గుర్తించారు. దీంతో టీచర్‌ రవీందర్‌ను సస్పెండ్‌ చేశారు. అలాగే, తాత్కాలిక హెచ్‌ఎం వెంకట్‌కు చార్జిమెమో జారీ చేశారు. హెచ్‌ఎం భూమేశ్‌ మూడు నెలలుగా స్కూలుకు రాకున్నా వేతనం తీసుకున్నట్లు గుర్తించారు. దీనిపై విచారణ చేసి, నివేదిక ఇవ్వాలని ఎంఈవోను ఆదేశించారు. మరోవైపు, టీచర్ల అటెండెన్స్‌ రిజిస్టర్లు మాయం కావడం వెలుగులోకి వచ్చింది. అక్రమాలు చోటు చేసుకోవడం వల్లే రిజిస్టర్లు మాయమైనట్లు అధికారులు గుర్తించారు. దీనిపైనా విచారణ చేపట్టనున్నారు.
    దారి తప్పిన టీచర్లు..
    • గాంధారిలో ఓ అధికారితో పాటు ముగ్గురు ఉపాధ్యాయ సంఘం నేతలు వసూళ్ల పర్వానికి పాల్పడుతున్నట్లు తెలిసింది. ఓ ప్రధాన సంఘానికి చెందిన ముగ్గురు ముఖ్య నేతలు ఆ అధికారి వెంటే ఉండి విధులకు డుమ్మా కొడుతున్నారు. పైగా ఇతర టీచర్లపై పెత్తనం చెలాయిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇటీవల పీఆర్‌ ఫిక్సేషన్‌ సందర్భంగా ఒక్కొక్కరి నుంచి రూ.300 చొప్పున వసూలు చేశారు. అలాగే, రూ.40 వేల స్కూల్‌ గ్రాంట్‌ను స్వాహా చేసినట్లు తెలిసింది.
    • ‘గడ్డ’ స్కూల్‌కు చెందిన ఓ టీచర్‌ ఉండేది మెదక్‌ జిల్లాలో. ఆ టీచర్‌ స్థానంలో, మరో టీచర్‌ అనాధికారికంగా విద్యాబోధన చేస్తున్నారు.  సదరు టీచర్‌ ఓ అధికారికి రూ.లక్ష బాకీ ఇవ్వడం, అతడు ఆ టీచర్‌కు వత్తాసు పలకడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
    • ఇన్ఫోసిస్‌ సంస్థ మండలంలోని 9 స్కూళ్లకు ఉచితంగా కంప్యూటర్లను అందజేసింది. ఈ నేపథ్యంలో ఓ సంఘం నాయకుడు ఒక్కో పాఠశాల నుంచి రూ.2 వేలు వసూలు చేసి, ఓ అధికారితో పాటు మరో ఇద్దరు టీచర్లు కలిసి డబ్బు పంచుకున్నట్లు తెలిసింది.
    • మండలంలోని ఓ మహిళ టీచర్‌ సమ్మర్‌లో పాఠశాలకు వెళ్లకున్నా ఆమె స్థానంలో మరో ‘నాయక్‌’ పాఠశాలకు వెళ్లాడు. ఈ వ్యవహరంలో అధికారి ప్రధాన పాత్ర పోషించినట్లు తెలిసింది.
    • అలాగే, తన కార్యాలయంలో జనరేటర్‌ కోసం ఓ అధికారి మండలంలోని 300 టీచర్ల నుంచి రూ.200 చొప్పున వసూలు చేశాడు. కానీ, ఇంతవరకు జనరేటర్‌ కొనుగోలు చేయకపోవడంతో ఉపాధ్యాయులు నోరెళ్లబెట్టారు.
    • ఇద్దరు టీచర్లు బాన్సువాడలో ప్రైవేట్‌ విద్యాసంస్థలను నిర్వహిస్తున్నారు. వీరి స్థానంలో అనాధికారికంగా విద్యావాలంటీర్లు కొనసాగుతున్నారు. ఈ వ్యవహరంలో అధికారి స్పందించకపోవడం గమనార్హం. ఒకసారి గ్రామస్తులు టీచర్లు రావడం లేదని నిలదీస్తే వారం పాటు వచ్చిన టీచర్లు, మళ్లీ ముఖం చాటేశారు.
    • మండలంలో తండాలు ఎక్కువగా ఉండడం, రవాణా సౌకర్యాలు లేకపోవడంతో కొందరు టీచర్లు డుమ్మాలు కొడుతున్నారు. మరికొందరేమో వంతుల వారీగా విధులకు వస్తున్నారు. ఇక రిజిస్టర్లను మాయం చేయడం, సంతకాలను ఫోర్జరీ చేయడం వంటి తంతు కొనసాగుతోంది.
    గాంధారిపై ప్రత్యేక దృష్టి..
    విద్యావ్యవస్థలో అనేక అక్రమాలు వెలుగు చూస్తున్న గాంధారి మండలంపై జిల్లా విద్యాశాఖ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. డీఈవో లింగయ్య ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా అనేక లోటుపాట్లు వెలుగులోకి రావడంతో ఆయన విస్మయానికి గురయ్యారు. దీంతో మండలంలో విస్తృతంగా తనిఖీలు చేసి, విద్యావ్యవస్థను సరిదిద్దాలని డిప్యూటీ డీఈవోను ఆదేశించారు. ప్రతి వారం డీఈవో, డిప్యూటీ డీఈవో ఆకస్మిక తనిఖీలు చేయనున్నురు. ఇందుకోసం ఇప్పటికే పలు పాఠశాలలను గుర్తించారు. విద్యాబోధన సరిగా లేని పాఠశాలలు, ఆరోపణలు ఎదుర్కొంటున్న టీచర్లు, డుమ్మా కొడుతున్న ఉపాధ్యాయ సంఘం నాయకులు విధులు నిర్వహిస్తున్న స్కూళ్లలో సోదాలు చేయనున్నారు.
    కఠిన చర్యలు తప్పవు..
    – లింగయ్య, డీఈవో
    ‘మెరుగైన విద్యనించాలని మేము కృషి చేస్తున్నాం. గాంధారి మండలంలో కొన్ని పాఠశాలలు సక్రమంగా లేవు. ఆయా స్కూళ్లను తనిఖీ చేసి, విద్యావ్యవస్థను మెరుగుపరుస్తాం. తప్పు చేసిన ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తప్పవు. ఇప్పటికే కొన్ని అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఆయా రిజిస్టర్లు, నివేదికలు మా దగ్గర ఉన్నాయి. వీటి ఆధారంగా కఠిన చర్యలు తీసుకుంటాం.’ 

Advertisement
Advertisement