-
డీఎస్సీ–2024 నిర్వహణపై ‘ఈసీ’కి లేఖ
సాక్షి, అమరావతి: ఫిబ్రవరి 27 నుంచి మార్చి 5 వరకు నిర్వహించిన ‘టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్’ (టెట్) ఫలితాల ప్రకటన, డీఎస్సీ–2024ను హైకోర్టు ఆదేశాల మేరకు నిర్వహించాలని అనుకుంటున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున దీనిపై ఎన్నికల కమిషన్ అనుమతి కోరినట్లు చెప్పారు. తొలుత టెట్ ఫలితాలను ఈ నెల 20న ప్రకటించాలని నిర్ణయించుకున్నా.. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో సెట్ ఫలితాలు ప్రకటన, డీఎస్సీ నిర్వహణకు అనుమతి కోరుతూ ప్రభుత్వం ఎన్నికల కమిషన్ కు లేఖ రాసినట్లు వివరించారు. దీనిపై ఈసీ నుంచి అనుమతి రాగానే టెట్ ఫలితాలు ప్రకటనతో పాటు డీఎస్సీ నిర్వహణకు పరీక్షా కేంద్రాల ఎంపిక, హాల్ టికెట్ డౌన్లోడ్ సదుపాయం అందుబాటులోకి తెస్తామని చెప్పారు. కానీ ఈ విషయం తెలిసీ కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు పేర్కొన్నారు. వాస్తవాలను చెప్పకుండా ప్రభుత్వం టెట్, డీఎస్సీని వాయిదా వేయాలని చూస్తుందంటూ దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు బీఈడీ చేసిన 51 వేల మంది ఎస్టీజీ పరీక్షలకు అనర్హులయ్యారని, వీరికి త్వరలోనే ఫీజు తిరిగి చెల్లిస్తామన్నారు. ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోలేకపోయిన అభ్యర్థులకు కూడా ఫీజు వాపసు చేస్తామన్నారు. -
మే 20 నుంచి టెట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ను మే 20 నుంచి జూన్ 3 వరకూ నిర్వహిస్తున్నట్టు పాఠశాల విద్య కమిషనర్ దేవసేన గురువారం ప్రకటించారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్, సమాచార బులెటిన్ను ఈ నెల 20న స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో వెల్లడిస్తామని తెలిపారు. కంప్యూటర్ బేస్డ్గా జరిగే ఈ పరీక్షకు ఈ నెల 27 నుంచి ఏప్రిల్ 10 వరకు దరఖాస్తులు పంపుకోవచ్చని తెలిపారు. రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ను గత నెల 29న విడుదల చేసిన సంగతి తెలిసిందే. డీఎస్సీ దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే మొదలు కాగా, ఈ గడువు ఏప్రిల్ 3తో ముగుస్తుంది. టెట్లో అర్హత సాధిస్తే తప్ప డీఎస్సీ రాసేందుకు అర్హత ఉండదు. దీనివల్ల టెట్ అర్హత లేని బీఈడీ, డీఎడ్ అభ్యర్థులు డీఎస్సీ రాసే వీలు ఉండదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని టెట్ను డీఎస్సీకి ముందే నిర్వహించాలని, ఇందులో అర్హత సాధించిన వారికి డీఎస్సీ రాసేందుకు అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో డీఎస్సీ దరఖాస్తు తేదీలను కూడా పొడిగించారు. జూన్ 6 వరకూ డీఎస్సీ దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు దేవసేన తెలిపారు. డీఎస్సీ పరీక్షను ఆన్లైన్ మోడ్లో జూలై 17 నుంచి 31 వరకు నిర్వహిస్తు న్నట్టు కమిషనరేట్ పేర్కొంది. ప్రస్తుతం ప్రభుత్వ స్కూళ్లలో పని చేస్తున్న ఉపాధ్యాయులకూ ఇదే టెట్లో పాల్గొనేందుకు చాన్స్ ఇవ్వాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలు వెల్లడవ్వాల్సి ఉంది. టీచర్ల పదోన్నతులకు టెట్ తప్పనిసరి చేయడంతో 80 వేల మంది ఉపాధ్యాయులు టెట్ రాయాల్సి ఉంటుంది. -
పదో తరగతి హాల్టికెట్లు సిద్ధం
సాక్షి, అమరావతి: పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు పాఠశాల విద్యాశాఖ పరీక్షల విభాగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 18 నుంచి 30 వరకు జరిగే పరీక్షలకు విద్యార్థుల హాల్టికెట్లను సిద్ధం చేసినట్లు పదో తరగతి పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానందరెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. పాఠశాలల యాజమాన్యాలు స్కూల్ కోడ్ నంబర్తోను, విద్యార్థులు తమ పుట్టిన తేదీని నమోదు చేసి సోమవారం మధ్యాహ్నం నుంచి www.bse.ap.gov.in నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. 2023–24 విద్యా సంవత్సరంలో 6,23,092 మంది రెగ్యులర్ విద్యార్థులు టెన్త్ పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో 3,17,939 మంది బాలురు, 3,05,153 మంది బాలికలున్నారు. గతేడాది పదో తరగతి తప్పి తిరిగి ప్రవేశం పొందినవారు మరో 1,02,528 మంది కూడా రెగ్యులర్గా పరీక్షలు రాయనున్నారు. ఈ ఏడాది మొత్తంగా 7,25,620 మంది పరీక్షలకు హాజరుకానున్నారు. వీరికోసం రాష్ట్ర వ్యాప్తంగా 3,473 సెంటర్లను సిద్ధం చేశారు. ప్రధాన పరీక్షలు మార్చి 28వ తేదీతో ముగుస్తుండగా, మరో రెండు రోజులు ఓరియంటల్, ఒకేషనల్ పరీక్షలుంటాయి. విద్యాశాఖ 156 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 682 సిట్టింగ్ స్వాడ్స్ను సిద్ధం చేసింది. 130కి పైగా కేంద్రాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. -
నేడు కొత్త డీఎస్సీ నోటిఫికేషన్!
సాక్షి, హైదరాబాద్: గతంలో ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్ను రద్దు చేస్తున్నట్టు పాఠశాల విద్య కమిషనర్ దేవసేన బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కొత్త నోటిఫికేషన్ గురువారం వెలువడే అవకాశం ఉందని విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి. గత ఏడాది సెప్టెంబర్ 6వ తేదీన 5,089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడింది. ఈ పోస్టులకు దాదాపు 1.75 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే పరీక్షను నిర్వహించాలనుకున్న తేదీల్లోనే అసెంబ్లీ ఎన్నికల తేదీలు రావడంతో డీఎస్సీ పరీక్షను వాయిదా వేశారు. కాగా కొత్త ప్రభుత్వం 11,062 పోస్టుల భర్తీ చేపట్టాలని నిర్ణయించింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని పాత నోటిఫికేషన్ను రద్దు చేస్తున్నట్టు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. గత డీఎస్సీ కోసం దరఖాస్తు చేసిన అభ్యర్థులు తిరిగి దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని బుధవారం నాటి ప్రకటనలో స్పష్టం చేసింది. -
టెట్, టీఆర్టీ నోటిఫికేషన్ల నిలుపుదలకు ‘నో’
సాక్షి, అమరావతి: ఏపీ ఉపాధ్యాయ భర్తీ పరీక్ష (టీఆర్టీ), ఏపీ టీచర్ అర్హత పరీక్ష (టెట్)ల నోటిఫికేషన్ల అమలును నిలుపుదల చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. అలాగే, పరీక్షల వాయిదాకు సైతం తిరస్కరించింది. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీచేయడం సాధ్యం కాదంది. ఈ వ్యవహారంపై తుది విచారణ జరుపుతామని తెలిపింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పాఠశాల విద్యాశాఖను ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. టీఆర్టీ, టెట్ పరీక్షల నోటిఫికేషన్లను సవాలు చేస్తూ శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎం.పెద్దిరాజు మరో నలుగురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. టెట్, టీఆర్టీ నోటిఫికేషన్లను రద్దుచేయాలని కోరారు. రెండు పరీక్షల మధ్య తగినంత సమయంలేదని, పరీక్షలకు సిద్ధమయ్యేందుకు ఆ సమయం సరిపోదని వారు వివరించారు. టీఆర్టీ నిర్వహణ కోసం ఈ నెల 12న, టెట్ పరీక్ష నిర్వహణకు 8న నోటిఫికేషన్లు జారీచేశారని తెలిపారు. టెట్లో అర్హత సాధించిన వారు టీఆర్టీకి హాజరయ్యేందుకు అర్హులన్నారు. టెట్ ఫలితాలను మార్చి 14న విడుదల చేస్తారని, ఆ మరుసటి రోజే అంటే మార్చి 15న టీఆర్టీ పరీక్ష నిర్వహిస్తారని వివరించారు. టెట్ పరీక్ష సిలబస్ చాలా ఎక్కువని, ఆ పరీక్షకు హాజరయ్యేందుకు ఉన్న గడువు కేవలం 19 రోజులు మాత్రమేనన్నారు. ఇది ఎంతమాత్రం సరిపోదన్నారు. టీఆర్టీ పరీక్షకు సైతం తక్కువ సమయమే ఉందన్నారు. అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని పిటిషనర్లు కోరారు. నోటిఫికేషన్ల అమలును నిలుపుదల చేయడంతో పాటు పరీక్షలను వాయిదా వేసి తిరిగి షెడ్యూల్ను ఖరారు చేసేలా ఉత్తర్వులివ్వాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి శుక్రవారం తన నిర్ణయాన్ని వెలువరించారు. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు సాధ్యంకాదని, అలా ఇస్తే తుది ఉత్తర్వులు ఇచ్చినట్లేనన్నారు. ఈ వ్యవహారంపై అత్యవసర విచారణ అవసరమని పిటిషనర్లు చెబుతున్న నేపథ్యంలో ఈనెల 28న తుది విచారణ జరుపుతామని న్యాయమూర్తి స్పష్టంచేశారు. -
27 నుంచి ఏపీటెట్–2024
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (ఏపీటెట్)–2024 నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. శుక్రవారం టెట్ హాల్టికెట్లను https://aptet.apchss.in వెబ్సైట్లో ఉంచింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షకు 2,67,559 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, వారందరికీ పరీక్ష సెంటర్లను సైతం కేటాయించి, ఆయా వివరాలను ఆన్లైన్లో ఉంచింది. కాగా బీఈడీ చేసిన అభ్యర్థులు ఎస్జీటీ పోస్టులకు అనర్హులని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ తీర్పు నేపథ్యంలో ఎస్జీటీ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న బీఈడీ అభ్యర్థుల ఫీజును తిరిగి చెల్లించేందుకు విద్యాశాఖ చర్యలు తీసుకుంది. ఆయా అభ్యర్థుల ఆధార్ కార్డుతో అనుసంధానమై ఉన్న బ్యాంకు అకౌంట్కు ఫీజులు మొత్తాన్ని తిరిగి జమ చేయనున్నట్టు పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్ ప్రకటించింది. నిర్వహణ ఇలా.. పేపర్ 1ఏ : ఈనెల 27 నుంచి మార్చి 1 వరకు పేపర్ 2ఏ : మార్చి 2, 3, 4, 6 తేదీలు పేపర్ 1బి : మార్చి 5 (ఉదయం) పేపర్ 2బి : మార్చి 5 (మధ్యాహ్నం) 120 కేంద్రాల్లో ఏపీటెట్ ఈనెల 27 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 120 కేంద్రాల్లో ఏపీ టెట్ నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అభ్యర్థులు ఎంపిక చేసుకున్న పరీక్షా కేంద్రాన్ని మాత్రమే కేటాయించినట్టు కమిషనరేట్ తెలిపింది. సెకండరీ గ్రేడ్ టీచర్ అభ్యర్థుల్లో 76.5 శాతం మందికి వారు ఎంపిక చేసుకున్న మొదటి ప్రాధాన్యత కేంద్రాన్నే కేటాయించారు. పరీక్ష కేంద్రాలపై అభ్యర్థులకు సందేహాలుంటే ఆయా జిల్లా విద్యాశాఖాధికారులను సంప్రదించాలని కమిషనర్ సూచించారు. దీంతోపాటు ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉండేలా కమిషనరేట్లో ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఫోన్ నంబర్లు 95056 19127, 97056 55349, 81219 47387, 81250 46997లో సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. -
నిబంధనల ప్రకారమే డీఎస్సీ
సాక్షి, అమరావతి: డీఎస్సీ–2024లో ప్రతి అంశంలోను పూర్తి జాగ్రత్తలు తీసుకున్నామని, అభ్యర్థులకు ఎటువంటి గందరగోళం లేదని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్ తెలిపారు. అభ్యర్థులకు నష్టం జరగకుండా జీవో నం.77 ప్రకారం రోస్టర్ పాయింట్లు చూపించామని చెప్పారు. ప్రస్తుత డీఎస్సీని 2018 డీఎస్సీ నిబంధనల ప్రకారమే నిర్వహిస్తున్నామన్నారు. దరఖాస్తు నుంచి పరీక్ష వరకు అప్పటి నిబంధనలే ఉంటాయని స్పష్టం చేశారు. అయినప్పటికీ ‘ఈనాడు’ పత్రిక డీఎస్సీ అభ్యర్థులను గందరగోళంలోకి నెట్టేలా కథనం ప్రచురించిందన్నారు. రోస్టర్ విధానం తెలియకుండా ఆ పత్రిక ప్రచురించిన కథనం డీఎస్సీ అభ్యర్థులను ఆందోళనకు గురిచేసేలా ఉందని బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గత ఏడాది ఆగస్టులో ఇచ్చిన జీవో 77 ప్రకారం అన్ని రోస్టర్లను చూపించామని, కానీ, బ్యాక్లాగ్ పోస్టుల విషయంలో ఆ సంవత్సరం రిక్రూట్మెంట్ రోస్టర్లను అలాగే కొనసాగించాలని అన్నారు. జీవో ప్రకారం పాయింట్లు ప్రోస్పెక్టివ్గానే ఉంటాయిగానీ, రెట్రోస్పెక్టివ్గా ఉండదని చెప్పారు. ఆయన చెప్పిన వివరాలివీ.. ♦ మొదటి దరఖాస్తుదారులకు ఈడబ్లు్యఎస్ కోటా కనిపించలేదనడంలోనూ వాస్తవం లేదు. దరఖాస్తులు ప్రారంభమైన తేదీ నుంచే ఆప్షన్లో ఈడబ్లు్యఎస్ కోటా ఉంది. ఈనాడులో రాసింది తప్పు. ♦ పరీక్ష ఫీజుపైనా తప్పుగా రాశారు. వాస్తవానికి అభ్యర్థి అప్లికేషన్లో తప్పుడు సమాచారం ఇచ్చినప్పుడు మాత్రమే వారు కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కూడా 2018 డీఎస్సీ నిబంధనే. ♦ స్థానికేతర అభ్యర్థులు పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసుకున్న సమయంలో స్థానికేతర ఆప్షన్ (ఓపెన్) ఇవ్వవచ్చు. ఒకసారి ఈ ఆప్షన్ ఎంచుకుని దరఖాస్తు చేసుకుంటే అభ్యర్థి నియామకం కూడా ఎంచుకున్న జిల్లాకే పరిమితం అవుతుంది. ఇదే విధానం జోనల్ పోస్టులకూ వర్తిస్తుంది. అలాగే దరఖాస్తు చేసుకోవాలి. ♦ డీఎస్సీ వెబ్సైట్కు సర్వర్ సమస్య ఎప్పుడూ లేదు. ఇప్పటివరకు టెట్ – 2024కు 3,17,950 దరఖాస్తులు అందాయి. డీఎస్సీకి 3,19,176 మంది నమోదు చేసుకున్నారు. సర్వర్ సమస్య ఉంటే ఇంత మంది దరఖాస్తు చేసుకోలేరు. అభ్యర్థులు కొందరికి ఫీజు చెల్లించే సమయంలో ఇంటర్నెట్ సమస్య ఉత్పన్నమై ఉంటుంది. దరఖాస్తు అనంతరం అభ్యర్థులు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం కూడా కల్పించాం. ఎవరైనా ఫీజు చెల్లించి ‘జర్నల్ నంబర్’ రాకుంటే చెల్లించిన ఫీజు మొత్తం వారి బ్యాంకు ఖాతాలో ఐదు రోజుల్లో తిరిగి జమ అవుతుంది. ♦ డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన ఫిబ్రవరి 12 నుంచే దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. బుధవారం వరకు మొత్తం 2,40,119 మంది ఫీజు చెల్లించారు. ♦సెంటర్ టెట్ (సీటెట్) విషయంలో కొందరికి అవగాహన లేదు. వాస్తవానికి ఏపీ విద్యా శాఖ వద్ద సీటెట్ డేటాబేస్ ఉండదు. సీటెట్ అభ్యర్థులు మొత్తం మార్కులు, గరిష్ట మార్కులను వారే స్వయంగా నమోదు చేయాలి. ఏపీ టెట్ అభ్యర్థులు మాత్రం హాల్ టికెట్ నంబరు నమోదు చేస్తే సరిపోతుంది. అభ్యర్థులకు ఎడిట్ అవకాశం దరఖాస్తులకు ఎడిట్ ఆప్షన్ లేకండా 30 వేల మంది అవస్థలు పడుతున్నారని అనడం కూడా సరికాదు. దరఖాస్తు సమయంలోనే జాగ్రత్తలు తీసుకోవాలని, తప్పులు జరిగితే సవరించే అవకాశం లేదని బులెటిన్లోనే పేర్కొన్నాం. కానీ అభ్యర్థుల సమస్యను దృష్టిలో ఉంచుకుని అప్లికేషన్ను ఎడిట్ చేసుకొనే అవకాశం కల్పించాం. అభ్యర్థులు మొదట వెబ్సైట్లో డిలీట్ ఆప్షన్ ఎంచుకోవాలి. పాత జర్నల్ నంబర్, మొబైల్కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేసి డిలీట్ ఆప్షన్ పొందవచ్చు. దీనిద్వారా ఎలాంటి రుసుం చెల్లించకుండా తప్పులు సరిదిద్దుకుని తిరిగి అప్లై చేసుకోవచ్చు. ఇందులో అభ్యర్థి పేరు, ఎంచుకున్న పోస్టు, జిల్లా తప్ప మిగిలిన అన్ని అంశాలూ ఎడిట్ చేసుకోవచ్చు. ఒకవేళ అభ్యర్థి తన పేరులో స్పెల్లింగ్ తప్పుగా ఉంటే పరీక్ష కేంద్రంలో నామినల్ రోల్స్లో సంతకం చేసే సమయంలో తప్పును సవరించుకునే అవకాశం ఉందని సురేష్ కుమార్ తెలిపారు. 25 వరకు ఫీజు చెల్లింపు గడువు డీఎస్సీ అభ్యర్థులు ఫీజు చెల్లించే గడువును పెంచినట్టు పాఠశాల కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు. ఈనెల 25వ తేదీ రాత్రి 12 గంటల వరకు ఫీజు చెల్లించవచ్చని, ఈ ఆవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పారు. అలాగే, హెల్ప్ డెస్క్ సమయాన్ని ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పొడిగించామని తెలిపారు. -
ఇంటర్ హాల్టికెట్ల విడుదల
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మార్చి 1 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షల హాల్టికెట్లను పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ విడుదల చేశారు. బుధవారం విజయవాడలోని ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో హాల్టికెట్లను ఆయన విద్యార్థులకు అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది బోర్డు పరీక్షలకు ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులు 10,52,221 మంది హాజరవుతున్నారన్నారు. ప్రభుత్వం అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నాడు–నేడు కార్యక్రమం కింద మౌలిక సదుపాయాలను పునరుద్ధరిస్తోందని, ఇప్పటికే పనులు పూర్తయిన ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోని పరీక్ష కేంద్రాలను చూసి ప్రైవేట్ యాజమాన్యాలు ఆశ్చర్యపోతాయన్నారు. ప్రభుత్వ యాప్లపై అవగాహన పెంచాలి భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న ‘భాషిణి, డిజీ లాకర్’ వంటి యాప్స్ ప్రత్యేకతను విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు తెలియజేసి వారికి వాటిపై అవగాహన పెంపొందించాలని ప్రవీణ్ ప్రకాశ్ అధికారులను ఆదేశించారు. సమగ్ర శిక్ష, ఎస్సీఈఆర్టీ, ఎఫ్ఎల్ఎన్, సాల్ట్, ప్రథమ్, ఎల్ఎఫ్ఈ, శామో, టోఫెల్ నిర్వహణ తదితర విభాగాల ప్రతినిధులతో బుధవారం ఆయన సమీక్ష జరిపారు. విజయవాడలోని ఐబీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ప్రవీణ్ ప్రకాశ్ మాట్లాడుతూ..‘భాషిణి’ యాప్ ద్వారా ఇతర భాషల నుంచి వాయిస్, టెక్ట్స్ మెసేజ్గా అనువాదం చేసుకోవచ్చన్నారు. ఫార్మెటివ్ సమ్మేటివ్ పరీక్షల మార్కులను డిజీ లాకర్ యాప్ ద్వారా తల్లిదండ్రులు తెలుసుకునేలా ఏర్పాటు చేయాలని సూచించారు. ఏపీలోని 40 యాజమాన్య పాఠశాలలను ఎస్సీఈఆర్టీ, ఐబీ బృందాలు పరిశీలిస్తాయని చెప్పారు. ఈ నెల 27 నుంచి మార్చి 6 వరకు జరిగే ఈ ప్రక్రియలో పాఠశాలల్లోని విద్యా కార్యక్రమాల తీరును అధ్యయనం చేస్తాయన్నారు. -
విశ్వవిజేతల కార్ఖానా!
తెలుగు ప్రసార మాధ్యమాలు పెద్దగా పట్టించుకోని ఈ వారపు ఘటనల్లో ఎన్నదగ్గవి రెండు: పాఠశాలల్లో ఐబీ సిలబస్ను ప్రారంభించేందుకు సన్నాహంగా ఒక బృందం పాఠశాలల పరిశీలనకు బయల్దేరింది. రెండవది – ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్ లెర్నింగ్ సంస్థ ఎడెక్స్తో ఒక ఒప్పందం చేసుకున్నది. మొదటిది పాఠశాల విద్యకు సంబంధించినదైతే, రెండోది ఉన్నత విద్యకు సంబంధించిన అంశం. చంద్రబాబు యాచిస్తున్న పొత్తు కౌగిలిని బీజేపీ ప్రసాదిస్తుందా లేదా, జనసైనికులు ఆశిస్తున్న సీట్ల ప్యాకేజీని టీడీపీ అంగీకరిస్తుందా లేదా వగైరా పొలిటికల్ మిర్చి ముందు పై రెండు వార్తలను మీడియా చప్పిడి వార్తలు గానే పరిగణించి ఉండవచ్చు. యెల్లో మీడియా అయితే ఉద్దేశ పూర్వకంగానే విస్మరించింది. ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ యెల్లో మీడియాలో ఉక్కపోత ఎక్కువైంది. కడుపు ఉబ్బరం పెరిగింది. ఒత్తిడి పెరిగింది. ఫలి తంగా దాని వార్తా ప్రాథమ్యాలు మరింత అదుపు తప్పాయి. ‘రాజధాని ఫైల్స్’ పేరుతో ఓ సినిమాను విడుదల చేశారు. ‘ఫైల్స్ కాదు పైల్స్’ (మొలలు) అన్నారెవరో! పెత్తందారీ పైల్స్ అనే పేరు పెడితే బాగుండేదన్నారు. యెల్లో మీడియా ఉన్న పరిస్థితికి ఈ సినిమా బాగా కనెక్టయింది. అందుకే యెల్లో మీడియాలో ప్రముఖ వార్తగా మారింది. యెల్లో మీడియాకు తోడయిన ఇంకో కామ్రేడరీ వార్త ‘విధ్వంసం’ పేరుతో పుస్తకావిష్కరణ. ‘కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ’ అంటారు గదా! అట్లాగే పెత్తందారీ బాధ యెల్లో మీడియా ద్వారా సకల జనులకు బాధ. ఈ రెంటికీ మధ్యనున్న కామ్రేడరీ అనుబంధమే ఆ పుస్తక సారాంశం. కనుక అది కూడా వారికి పెద్ద వార్తే. స్కూళ్లలో ఐబీ సిలబస్ పెడితే మాత్రం ఏమిటి విశేషం? ఎడెక్స్ ద్వారా కళాశాలల్లో అంతర్జాతీయ సిలబస్ను ప్రవేశ పెడితే ఏం ప్రయోజనముంటుంది? ఇటువంటి సందేహాలు కలగడం సహజం. వాటిని గురించి చర్చించడానికి ముందు ప్రస్తుత ప్రపంచ పరిణామ దశ గురించిన ప్రాథమిక అవగాహన మనకు ఉండాలి. టెక్నాలజీ అభివృద్ధి కారణంగా ప్రపంచం ఏకైక గ్లోబల్ మార్కెట్గా అవతరిస్తున్నది. ఈ మార్కెట్ను ఒకే ఒక వ్యవహారిక భాష నియంత్రించనున్నది. గ్లోబల్ విలేజి గురించి తరచూ మాట్లాడుతుంటారు. మన పూర్వీకులు ఎప్పటి నుంచో ‘వసుధైక కుటుంబం’ అనే భావనను వ్యాప్తిలోకి తెచ్చారు. ఈ ఏక కుటుంబంలో ఏకైక సంధాన భాష అవసరం కూడా ఏర్పడింది. ఎలిజర్ బెన్ యెహుదా అనే భాషా శాస్త్రవేత్త ఉండేవారు. ఆయన రష్యాలో పుట్టి పెరిగిన యూదు జాతీయుడు. ప్రపంచ మంతా ఒకే భాష మాట్లాడే రోజు వస్తుందనే అభిప్రాయాన్ని వందేళ్లకు పూర్వమే ఆయన ప్రకటించారు. అయితే అది హిబ్రూ భాష కావాలనేది ఆయన కోరిక. అలాగే సంస్కృతానికి గ్లోబల్ భాషయ్యే లక్షణాలున్నాయనే భాషావేత్తలు కూడా చాలామందే ఉన్నారు. కానీ ఇప్పటికే ప్రపంచ భాషగా ఇంగ్లిషు చాలాదూరం వెళ్లిపోయింది. ప్రపంచీకరణ, సాంకేతిక పురోగతి, వలసల కార ణంగా ఏర్పడుతున్న సాంస్కృతిక మార్పులన్నీ ఆంగ్లీకరణను వేగవంతం చేస్తున్నాయి. ఉన్నతమైన జీవనాన్ని ఆకాంక్షించే ప్రతి బాలికా బాలుడు, ప్రతి యువతీ యువకుడు గ్లోబల్ మార్కెట్ లక్ష్యంగా దూసు కొనిపోవలసిన అవసరం ఉన్నది. అలా దూసుకుపోవాలంటే మొదటి అవసరం – ఇంగ్లిషు భాషలో ప్రావీణ్యం. రెండో అవసరం – వేగంగా మారుతున్న టెక్నాలజీల మీద పట్టు సాధించడం. మూడోది – గ్లోబల్ మార్కెట్ అవసరాలకు పనికివచ్చే సబ్జెక్టులను అభ్యసించడం. ఈ అవసరాలను మన పిల్లలు ఎలా సమకూర్చుకోగలరు? ఎవరో పెట్టిపుట్టినవారు, కలవారి పిల్లలు మాత్రమే నెరవేర్చుకోగలిగిన కలలుగా ఇవి కనిపిస్తున్నాయి. భారతదేశమంతా కలిపి కేవలం 210 అత్యున్నతస్థాయి ప్రైవేట్ పాఠశాలల్లో మాత్రమే ఇప్పుడు ఐబీ సిలబస్ను అమలు చేస్తున్నారు. సంపన్నులు మాత్రమే ఆ స్కూళ్ల ఫీజులను భరించగలరు. మనకు అలవాటైన ‘భట్టీయం’ పద్ధతికి భిన్నంగా ఐబీ విద్యాబోధన ఉంటుంది. మన సంప్రదాయ పద్ధతిలో ఇరవై ఎక్కాలు గడగడ చదివేవారు కూడా సాధారణ లెక్కలు చేయలేక పోవడం మనకు తెలిసిందే. భట్టీయం పద్ధతిలో వివేచన, విశ్లేషణ, ఆలోచనలకు అవకాశం తక్కువ. విమర్శనాత్మకంగా ఆలోచించడం, భిన్నంగా ఆలోచించడం, సమస్యను పరిష్కరించడం వంటి నైపుణ్యాలను ఐబీ పాఠశాలల్లో అలవాటు చేస్తారు. వీటితోపాటు వివిధ రంగాల్లో రాణించేలా ప్రపంచమంతటా ఉపాధి, ఉన్నత విద్యావకాశాలు పొందే విధంగా తర్ఫీదు ఉంటుంది. దేశంలో కేవలం 210 బడుల్లో మాత్రమే ఉన్న ఇటువంటి ఖరీదైన ఐబీ విద్యాబోధనను రాష్ట్రంలోని 40 వేల పైచిలుకు ప్రభుత్వ పాఠశాలల్లో దశలవారీగా ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. ఈ సంవత్సరం ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తారు. వచ్చే సంవత్సరం (2025–26) నుంచి ఒకటో క్లాసులో ఐబీ సిలబస్ ప్రవేశపెడతారు. ఏటా ఒక్కో క్లాసు పెంచుకుంటూ వెళ్తారు. 2037 నాటికి ప్లస్ టూ వరకు ఆంధ్ర ప్రదేశ్ పాఠశాల విద్యార్థులంతా ఐబీ సిలబస్లోనే ఉంటారు. ప్రపంచ గమనానికి అనుగుణంగా మన ఉన్నత విద్యా కోర్సులు మారలేదన్నది ఒక వాస్తవం. ప్రభుత్వాధినేతలకు ఉండవలసిన దార్శనికత (విజన్) లేకపోవడం ఒక కారణం. అసలు సంకల్పమే లేకపోవడం మరో కారణం. చంద్రబాబు వంటి పెత్తందారీ నాయకులు అసలు విద్యారంగంలో ప్రభుత్వ జోక్యమే అనవసరమనీ, దాన్ని పూర్తిగా ప్రైవేట్ రంగానికే వదిలి వేయాలనీ బహిరంగంగానే ప్రబోధించారు. అందుకు తగ్గట్టు గానే ప్రభుత్వ విద్యారంగం కుప్పకూలిపోయేవిధంగా ఉద్దేశ పూర్వకంగా వ్యవహరించారు. ఇప్పుడు జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రారంభించిన సంస్కరణల ఫలితంగా నాణ్యమైన ప్రపంచశ్రేణి విద్య పేద విద్యార్థులందరికీ ప్రభుత్వ రంగంలోనే ఉచితంగా అందుబాటులోకి వచ్చింది. కార్పొరేట్, పెత్తందారీ శక్తులు అందువల్లనే జగన్మోహన్రెడ్డిని అధికారంలోంచి దింపేయడానికి భయంకరమైన కుట్రను రచించాయి. ఇప్పుడు గ్రాడ్యుయేషన్ కోర్సులు చేస్తున్న మన విద్యా ర్థులు ప్రపంచ మార్కెట్లో పోటీపడటానికి అనువుగా వారి పాఠ్యాంశాలు, బోధనా ప్రక్రియలు లేవన్నది నిర్వివాదాంశం. వరల్డ్ క్లాస్ స్థాయికి మన కళాశాలలను తీర్చిదిద్దడానికి చాలా సమయం పట్టవచ్చు. అప్పటివరకు ఏటా బయటకొస్తున్న మన పట్టభద్రులంతా అన్యాయానికి గురికావలసిందేనా? అలా జరగ కూడదన్న లక్ష్యమే ఎడెక్స్తో రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందానికి కారణమైంది. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, హార్వర్డ్, కొలంబియా. కేంబ్రిడ్జి, ఎమ్ఐటీ వంటి ప్రతిష్ఠాత్మక గ్లోబల్ వర్సిటీలు అందించే కోర్సులను ఎడెక్స్ ద్వారా మన డిగ్రీ, పీజీ, ఇంజనీ రింగ్ విద్యార్థులకు అందుబాటులోకి తేవడం ఈ ఒప్పందంలోని ప్రధానాంశం. విద్యార్థులకు ఈ కోర్సులు ఉచితంగా అందు బాటులోకి వస్తాయి. కరిక్యులమ్లో భాగమవుతాయి. ఆర్టిఫీషి యల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా మైనింగ్, డేటా అనలిటిక్స్, వర్చ్యువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, రిస్క్ మేనేజిమెంట్, రియల్ ఎస్టేట్, లాజిస్టిక్స్, స్టాక్ ఎక్స్ఛేంజ్, వెల్త్ మేనేజిమెంట్ వంటి ఆధునిక కోర్సుల్లో మన దగ్గర ప్రామాణికత లేదు. ఎడెక్స్ ద్వారా ఇందులో వరల్డ్ క్లాస్ కోర్సులను మన విద్యార్థులకు అందుబాటులోకి తెస్తు న్నారు. ఈ వర్టికల్స్కు సంబంధించిన పరీక్షను ఎంపిక చేసు కున్న గ్లోబల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో నిర్వహిస్తారు. విద్యార్థికి ఆ కోర్సులకు సంబంధించిన క్రెడిట్స్ లభిస్తాయి. గ్లోబల్ మార్కెట్లో ఉపాధి పొందడానికి, ఉన్నతమైన విదేశీ విద్యను అభ్యసించడానికి ఈ క్రెడిట్స్ ఉపకరిస్తాయి. ఈ ప్రయత్నాలు ఇంకో పది పదిహేనేళ్లు నిర్విఘ్నంగా కొన సాగితే మన విద్యార్థులు ప్రపంచ వేదికపై జైత్రయాత్ర చేస్తారు. అత్యున్నత స్థానాలకు ఎగబాకుతారు. వారితోపాటు వారి కుటుంబాలు, గ్రామాలు, రాష్ట్రం, దేశం అభివృద్ధి ఫలాలను అందుకుంటాయి. పేదవాడు అభివృద్ధి చెందడం పెత్తందారీ శక్తులకు నచ్చదు. వారి అభివృద్ధిని ఓర్వలేరు. ఇంతటి విప్లవా త్మకమైన ప్రగతిశీలతకు విత్తనాలు చల్లుతున్న శుభఘడియలకు వారి దృష్టిలో ప్రాధాన్యం లేదు. అందుకే అవి వార్తలు కావు. పైపెచ్చు మసిపూయాలి. బురద చల్లాలి. విధ్వంసం జరుగుతున్నదని ఓండ్రపెట్టాలి. అభివృద్ధి ఎక్కడు న్నదని మొరగాలి. మూలశంక వ్యాధి వికారాన్ని సినిమాల్లో ప్రద ర్శించాలి. ఇప్పుడదే జరుగుతున్నది. పేదలకు విజ్ఞాన ఫలాలు అందకూడదు, నాణ్యమైన విద్య అందుబాటులో ఉండకూడదనే పెత్తందారుల కుట్ర కేవలం వారి స్వార్థం మాత్రమే కాదు. ఇదొక దేశద్రోహ నేరం. దేశాభివృద్ధికి గొడ్డలిపెట్టు. క్రీస్తుశకం రెండో శతాబ్దం నుంచి ఆరేడు శతాబ్దాల మధ్యకాలంలో భారతీయ మేధావులు చేసిన ఆవిష్కరణలు సామాన్యమైనవి కావు. శూన్యాంకాన్ని (జీరో) ప్రసాదించి ప్రపంచ గణితశాస్త్రాన్ని మలుపుతిప్పిన ప్రతిభాశాలి, గ్రహగతు లను, భూభ్రమణాన్ని నిర్ధారించిన మేధావి ఆర్యభట్ట, గణిత ఖగోళ శాస్త్రజ్ఞులైన భాస్కర – బ్రహ్మగుప్త – వరాహమిహిర, వైద్యశాస్త్ర పితామహుడు చరకుడు, సర్జరీ పితామహుడు సుశ్రుతుడు, ఆటమిక్ థియరీని ప్రతిపాదించిన కణాదుడు, తత్వవేత్త – రసవాద శాస్త్రవేత్త ఆచార్య నాగార్జునుడు, ప్రామా ణిక అర్థశాస్త్ర రచయిత చాణక్యుడు, యోగశాస్త్ర సృష్టికర్త పతంజలి వగైరాలంతా ఆ కాలంలో జీవించినవారే. కానీ ఆనాటి విజ్ఞాన మంతా సంస్కృత భాషకే పరిమితం కావడం, ఆ భాషను నేర్చుకునే అర్హత పిడికెడు మందికే పరిమితం కావడం జాతికి జరిగిన తీరని ద్రోహం. విశాల ప్రజానీకానికి విద్య అందుబాటులో ఉండి ఉంటే, సంస్కృతం నిషిద్ధం కాకపోయి ఉంటే ఈ మేధావుల ఆవిష్క రణలు మరింత ఊర్ధ్వగతి పొందేవి. వందలాదిమంది శాస్త్ర వేత్తలు ఉద్భవించేవారు. పారిశ్రామిక విప్లవం బ్రిటన్ కంటే రెండు మూడు శతాబ్దాల ముందే భారత్లో ప్రభవించేది. మన నెమలి సింహాసనం, మన కోహినూర్ వజ్రం మన దగ్గరే ఉండేవని చెప్పడం చాలా చిన్న విషయం. ఇంకా ఏమేమి జరిగి ఉండేవనేది ఒక అధ్యయనాంశం. ఇప్పుడు కూడా ప్రపంచ భాష ఇంగ్లిష్ నేర్చుకోవద్దనీ, నాణ్యమైన విద్యను అభ్యసించ కూడదనీ పేదవర్గాలను మన పెత్తందార్లు శాసిస్తున్నారు. ఇదే దేశద్రోహం. ఈ దేశద్రోహానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ పేద వర్గాల ప్రజలు జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో యుద్ధానికి సిద్ధ మవుతున్నారు. పెత్తందారీ – కార్పొరేట్ శక్తులు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా సకల రాజకీయ పక్షాలను ఏకం చేసి మోహ రించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ‘కుడి ఎడమల డాల్ కత్తులు మెరయగ...’ అన్నట్టు అతివాద మితవాద పార్టీలన్నీ ఎవరి దారిలో వారు ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నారు. పెత్తందార్ల సేవలో తరిస్తున్నారు. చివరికి త్యాగాల చరిత గల పతాకాలనూ అపవిత్రం చేస్తున్నారు. పేదవర్గాలు ఈ పరిణామాలను గమనించాయి. సమరోత్సాహంతో నినదిస్తున్నాయి. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
విద్యా శాఖలోకి ‘పురపాలక’ టీచర్లు
సాక్షి, అమరావతి: ఎంతోకాలంగా నలుగుతున్న పురపాలక ఉపాధ్యాయుల సర్వీసు బదలాయింపు ఎట్టకేలకు పూర్తయింది. మున్సిపల్ ఉపాధ్యాయుల సర్వీసును ప్రభుత్వం పాఠశాల విద్యా శాఖలో విలీనం చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. మునిసిపాలిటీల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు జీవో నం.7, నగరపాలక సంస్థల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు జీవో నం.8, జీవీఎంసీ ఉపాధ్యాయులకు జీవో నం.9, విజయవాడ నగరపాలక సంస్థ ఉపాద్యాయులకు జీవో నం.10 జారీ చేశారు. దీంతో పురపాలక ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల అంశం పూర్తిగా విద్యా శాఖకు అప్పగించినట్టయింది. గతంలో నగర, పురపాలక సంఘాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు వేర్వేరు సర్వీసు నిబంధనలు ఉండేవి. దాంతో వారు ఆ సంస్థ పరిధిలోని పాఠశాలలకు మాత్రమే బదిలీ అయ్యేవారు. ఇకపై జిల్లా యూనిట్గా వారి నియామకాలు, బదిలీలు చేపడతారు. ఈ ప్రక్రియను కూడా పాఠశాల విద్యా శాఖ నిర్వహిస్తుంది. -
లీకు వీరులకు బ్రేక్!
దశాబ్దాలుగా దాదాపు దేశవ్యాప్త జాడ్యంగా వున్న సమస్యకు సమగ్ర పరిష్కారం కోసం తొలి అడుగు పడింది. పోటీపరీక్షల్లో ప్రశ్నపత్రాన్ని లీక్ చేసేవారిపై కఠిన చర్యలు తీసుకొనే బిల్లును పార్లమెంటు ఆమోదించింది. నేరగాళ్లని తేలితే రూ. కోటి వరకూ జరిమానా, అయిదేళ్ల వరకూ శిక్ష ఉంటాయని బిల్లు చెబుతోంది. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే లీకుల్ని అరికట్టేందుకు చట్టాలున్నాయి. అయితే వాటివల్ల పెద్దగా ప్రయోజనం ఉన్నట్టులేదు. కేంద్రం తెచ్చిన చట్టం దాని పరిధిలో జరిగే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఎన్టీఏ, ఆర్ఆర్బీ, ఐబీపీఎస్,నీట్, జేఈఈ తదితర పోటీ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడేవారికి వర్తిస్తుంది. ఈ నమూనాలో రాష్ట్రాలు కూడా చట్టాలు చేయాలని కేంద్రమంత్రి జితేంద్రసింగ్ చేసిన సూచన మంచిదే. పోటీ పరీక్షల చుట్టూ వేలాదికోట్ల వ్యాపారం నడుస్తోంది. ఒకప్పుడు ప్రధాన నగరాలు కొన్నిటిలో తర్ఫీదిచ్చే సంస్థలు కొలువుదీరేవి. అక్కడ వేలకు వేలు ఖర్చుపెట్టిన లక్షలాదిమంది విద్యార్థులు దర్శనమిచ్చేవారు. ఈమధ్య ఇది చిన్న నగరాలకూ, పట్టణాలకూ కూడా పాకింది. సివిల్ సర్వీసులు మొదలుకొని రాష్ట్రాల్లోని సర్వీసు కమిషన్లు, ప్రభుత్వరంగ సంస్థలు, ఆర్మీ, పోలీసు విభాగాలు నిర్వహించే పరీక్షల కోసం పల్లెసీమల నుంచి సైతం వేలమంది తరలివస్తున్నారు. ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగాలు సాధిస్తే జీవితాంతం చీకూ చింతా లేకుండా బతికేయొచ్చని నిరుద్యోగులు కలలు కంటున్నారు. కానీ ప్రశ్నపత్రాలతో వందలకోట్లు దండు కునే ముఠాలు ఈ కలల్ని కొల్లగొడుతున్నాయి. ప్రభుత్వోద్యోగాల భర్తీని ప్రహసన ప్రాయం చేస్తున్నాయి. విజేతలవుతున్నవారిలో ఎవరు సచ్ఛీలురో, ఎవరు కాదో తెలియని అయోమయ స్థితి ఏర్పడుతోంది. పోటీ పరీక్షల్లో అక్రమాలను అరికట్టే అంశంపై 90వ దశకంనుంచి ప్రభుత్వాలు ఎక్కువగా దృష్టి పెట్టడం మొదలెట్టాయి. కానీ అవి ఆగిన జాడ లేదు. ఐఐటీ జేఈఈ ప్రశ్నపత్రాలు లీకయినట్టు తొలిసారి 1997లో మీడియాలో కథనాలొచ్చాయి. లక్నోలోని ఒక సంస్థ ఆ ఏడాది ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ పరీక్షలకు 12 గంటల ముందు తమ విద్యార్థులకు ఆ ప్రశ్నలు అందించినట్టు ఆ కథనాలు తెలిపాయి. ‘ఆఖరి నిమిషం టిప్స్’ ప్రోగ్రాం మాటున తమ దగ్గరున్న 700 మందిలో వందమంది విద్యార్థుల దగ్గర అదనంగా సొమ్ము వసూలు చేసి వారిచేత బట్టీపట్టించిన వైనం అప్పట్లో సంచలనం కలిగించింది. మొదటిరోజున ఒక విద్యార్థి తండ్రి జేఈఈ చైర్మన్కు ఈ సంగతి ఫిర్యాదుచేసినా కుమారుడి వైఫల్యంపై వేదనతో ఆధారం లేని ఆరోపణ చేశారని ఆయన కొట్టిపారేశారు. తమ నిర్వాకంపై ఆయనకు అంత నమ్మకం మరి! కానీ మరుసటి రోజు మ్యాథ్స్ పేపర్ను ఫాక్స్ చేశాక ఆయనకు తత్వం బోధపడింది. కావాలని అక్కడక్కడ చేసిన కొద్దిపాటి మార్పులు మినహా అది తమ ప్రశ్నపత్రాన్నే పోలివుందని గ్రహించి చివరి నిమిషంలో ఆ పరీక్షను రద్దుచేశారు. ఆ లీకేజీకి అప్పటి కాన్పూర్ ఐఐటీ డైరెక్టర్కు వున్న పుత్రప్రేమే కారణమని కథనాలొచ్చాయి. ఆ ఏడాది రూర్కీ ఇంజనీరింగ్ కళాశాల ప్రవేశపరీక్షపై సైతం ఇలాంటి కథనాలే వెలువడినా అది రద్దు కాలేదు. ప్రశ్నపత్రాలు కైంకర్యం చేసి కోట్లాది రూపాయలు వెనకేస్తున్న మాఫియాతోపాటు కొన్ని సందర్భాల్లో ఉన్నతస్థాయి వ్యక్తులకుండే స్వప్రయోజనాలు, అవతలివారిని రాజకీయంగా దెబ్బతీసే ఉద్దేశాలు కూడా ఈ లీకులకు కారణమైన ఉదంతాలు లేకపోలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ కేబినెట్లో పాఠశాల విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన గాలి ముద్దు కృష్ణమనాయుడు అప్పట్లో పదో తరగతి ప్రశ్నపత్రాల లీకుకు నైతిక బాధ్యతవహిస్తూ తప్పుకున్నారు. చిత్తూరు జిల్లాలో తనను రాజకీయంగా దెబ్బతీసేందుకు పార్టీ ప్రముఖ నాయకుడే ఈ లీకేజ్కి ఒడిగట్టారని ఆయన ఆరోపించటం ఎవరూ మరిచిపోరు. ప్రశ్నపత్రాలు సంపాదించే ఉద్యోగార్థుల్లో కొందరు గప్చిప్గా ఉండక సొమ్ము చేసుకోవాలని కక్కుర్తిపడిన సందర్భాల్లో లేదా తమ సన్నిహితులకు అందజేసినప్పుడు మీడియాకు వెల్లడై చాలాసార్లు చౌర్యం బయటపడుతుంటుంది. ఇలాంటివేమీ లేనప్పుడు అంతా సజావుగా సాగిపోతుంది. నిజాయితీపరులైన ఉద్యోగార్థులను లీకేజీ దెబ్బతీస్తుంది. ప్రపంచ దేశాల్లో మనం నవ్వుల పాలవుతాం. గత అయిదేళ్లలో 15 రాష్ట్రాల్లో లక్షా నాలుగువేల ఉద్యోగాల భర్తీకోసం నిర్వహించిన ప్రవేశ పరీక్షల ప్రశ్నపత్రాలు లీకయ్యాయనీ, ఇందువల్ల కోటి 40 లక్షలమంది ఉద్యోగార్థుల భవి ష్యత్తు దెబ్బతిందనీ ఒక ఆంగ్ల దినపత్రిక కథనం. ఈ లీకుల పర్యవసానంగా పరీక్ష రద్దు చేసినా, నిరవధిక వాయిదా వేసినా, పట్టించుకోకుండా వదిలేసినా దెబ్బతినేది నిరుద్యోగులే. నిరుడు తెలంగాణ, రాజస్థాన్లలో ప్రశ్నపత్రాల లీకు నిరుద్యోగ ప్రపంచాన్ని ఎంత కలవరపరిచిందో ఎవరూ మరిచిపోరు. అయితే లీకులకు కొన్ని సంస్థలు, వ్యకులను మాత్రమే బాధ్యులుగా చేయడంతో సరి పెట్టక రాజకీయ నాయకులు, ఏజెంట్లు, పోటీ పరీక్షల విభాగాల్లోవుండే అవినీతి అధికారులు వగైరాలతో కూడిన మాఫియా ముఠాలున్నాయని గుర్తిస్తే తాజా చట్టం మరింత కఠినతరం చేయ టానికి అవకాశం వుంటుంది. లీకు సంగతి వెల్లడికాగానే రంగప్రవేశం చేసేలా ఈడీ, సీబీఐ తరహాలో ప్రత్యేక దర్యాప్తు సంస్థలను ఏర్పరచటంవల్ల బాధ్యులను గుర్తించటం వేగవంతమవుతుంది. ఈ కేసుల్లో నిందితుల విచారణకు ఫాస్ట్ట్రాక్ కోర్టుల ఏర్పాటు కూడా అవసరమే. ఇక లీకులవల్ల లబ్ధి పొందే ఉద్యోగార్థులను ఈ చట్టం పరిధినుంచి తప్పించటం ఎంతవరకూ సబబో ఆలోచించాలి. ఈ లీకుల లబ్ధిదారుల్లో సైతం భయభక్తులుంటేనే సమస్యను అరికట్టడం సాధ్యమవుతుంది. -
AP DSC Notification: 6,100 పోస్టులతో డీఎస్సీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బీఈడీ, డీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మొత్తం 6,100 పోస్టుల భర్తీకి డీఎస్సీ షెడ్యూల్ను విడుదల చేసింది. ఈ పోస్టుల్లో 2,280 సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్జీటీ), 2,299 స్కూల్ అసిస్టెంట్లు (ఎస్ఏ), 1,264 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు (టీజీటీ), 215 పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లు (పీజీటీ), 42 ప్రిన్సిపాల్ పోస్టులు ఉన్నాయి. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్)తో పాటు డీఎస్సీ–2024 నోటిఫికేషన్లకు ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించింది. ఈ మేరకు గురువారం టెట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. డీఎస్సీ నోటిఫికేషన్ను ఈనెల 12న ఇవ్వనుంది. టెట్, డీఎస్సీకి పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్ https://cse.ap.gov.in ద్వారా చేసుకోవాలి. ఈ మేరకు బుధవారం సచివాలయంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్ వివరాలు వెల్లడించారు. నోటిఫికేషన్ ఇచ్చిన రోజు నుంచే ఆయా పరీక్షలకు ఆన్లైన్ దరఖాస్తులు కూడా స్వీకరిస్తారు. మొత్తం ప్రక్రియను పూర్తిచేసి, ఏప్రిల్ చివరి నాటికి అభ్యర్థులకు పోస్టింగ్ ఇస్తామని, వారు వచ్చే విద్యా సంవత్సరంలో బోధన కూడా చేపడతారని మంత్రి బొత్స తెలిపారు. అందుకు అనుగుణంగా షెడ్యూల్ ఖరారు చేశామన్నారు. రాష్ట్రంలో చివరిసారిగా 2022 ఆగస్టులో టెట్ నోటిఫికేషన్ ఇచ్చి పరీక్ష నిర్వహించామని తెలిపారు. ఈ నేపథ్యంలో బీఈడీ, డీఈడీ పూర్తిచేసినవారికి, గతంలో టెట్ అర్హత సాధించలేని వారికి అవకాశం కల్పించేందుకు టెట్ కూడా నిర్వహిస్తున్నట్టు చెప్పారు. గతంలో తలెత్తిన ఇబ్బందుల దృష్ట్యా పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్లో ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ను సైతం ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. వివిధ విద్యా సంస్థల పరిధిలో 6,100 పోస్టులు.. ఈ ఏడాది ఏప్రిల్ 30 నాటికి ఖాళీ అయ్యే పోస్టులతో కలిపి మొత్తం 6,100 పోస్టులను భర్తీ చేసేందుకు డీఎస్సీ నిర్వహిస్తున్నట్టు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. జిల్లా, మండల పరిషత్, మున్సిపల్, మున్సిపల్ కార్పొరేషన్, ఏపీ మోడల్ స్కూళ్లు, ఏపీ గురుకుల విద్యాలయాల సంస్థ, ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ, ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (ఆశ్రం), ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ, మహాత్మా జ్యోతిబా పూలే బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థల్లో మొత్తం అన్ని ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పారు. తమ ప్రభుత్వం వచ్చాక ఇప్పటివరకు 14,219 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిందన్నారు. విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చిందని గుర్తు చేశారు. ఈ ఐదేళ్లల్లో విద్యపై రూ.73 వేల కోట్లు ఖర్చు చేసినట్టు వివరించారు. రాష్ట్రంలో పేదింటి పిల్లలకు ఎలాంటి విద్యను అందిస్తే వారు ఉజ్వల భవిష్యత్ను అందుకుంటారో సీఎం వైఎస్ జగన్కు బాగా తెలుసని చెప్పారు. అందుకే ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్ఈ, టోఫెల్ను అందుబాటులోకి తెచ్చారన్నారు. కొద్దిరోజుల క్రితం ఇంటర్నేషనల్ బాకలారియెట్ (ఐబీ) సంస్థతో ఒప్పందం కూడా చేసుకున్నామని గుర్తు చేశారు. విద్యార్థుల మేలు కోసం కొత్త నిర్ణయం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మేలు చేసే మరో మంచి నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. పాఠశాలల్లో ఉపాధ్యాయులు విద్యా సంవత్సరం మధ్యలో రిటైర్ అయితే విద్యార్థులకు బోధన సమస్య తలెత్తుతోందన్నారు. కొత్తవారిని నియమించినా విద్యార్థులు అలవాటు పడేందుకు సమయం పడుతోందని వివరించారు. ఈ ప్రభావం విద్యార్థుల ఫలితాలపై పడుతున్నట్టు గుర్తించామన్నారు. దీన్ని అధిగమించేందుకు విద్యా సంవత్సరం మధ్యలో ఉపాధ్యాయులు రిటైర్ అయితే, ఆ విద్యా సంవత్సరం మొత్తం వారినే కొనసాగించే యోచన చేస్తున్నామన్నారు. దీనివల్ల విద్యార్థులకు ఆ విద్యా సంవత్సరం మొత్తం ఒకే టీచర్ బోధన అందుతుందని చెప్పారు. ఇప్పటికే ఈ విధానం కేరళలో అమల్లో ఉందని, త్వరలో దీనిపై విధివిధానాలు ప్రకటిస్తామన్నారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో టెట్, డీఎస్సీ.. పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ మాట్లాడుతూ.. ఏపీ టెట్, డీఎస్సీ పరీక్షలు రెండింటినీ ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ)గా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. రోజుకు రెండు సెషన్లలో నిర్వహిస్తామన్నారు. మొదటి సెషన్ ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు ఉంటుందని చెప్పారు. పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 185 కేంద్రాలను ఎంపిక చేశామని తెలిపారు. రాష్ట్రం బయట ఉన్నవారి కోసం మరో 22 సెంటర్లను హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, బరంపురంల్లో ఏర్పాటు చేస్తామన్నారు. డీఎస్సీ రాయాలనుకునే జనరల్ అభ్యర్థులకు 44 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 49 ఏళ్ల వయోపరిమితి ఉంటుందని చెప్పారు. ఈసారి డీఎస్సీలో ఎంపికైన ఉపాధ్యాయులకు నాలుగు దశల్లో ఇంటర్నేషనల్ బాకలారియెట్ (ఐబీ), టెక్నాలజీ ట్రైనింగ్, టోఫెల్, బోధన సామర్థ్యంపై శిక్షణ ఉంటుందని తెలిపారు. ఇందులో సర్టిఫికెట్లు సైతం ప్రదానం చేస్తామన్నారు. కమిషనర్ సురేష్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మొత్తం 7 లక్షల మంది పరీక్ష రాసేలా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఈ సమావేశంలో ఉన్నత విద్యాశాఖ కమిషనర్ పి.భాస్కర్, విద్యాశాఖ జేడీలు మేరీ చంద్రిక, మొవ్వా రామలింగం, డాక్టర్ ప్రతాపరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
టీచర్లు సిటీకి.. చదువులు గాలికి!
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్, శివారు ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో కొన్నిరోజులుగా కొత్త టీచర్లు కొలువుదీరుతున్నారు. ఉపాధ్యాయుల బదిలీలేమీ లేకున్నా.. కొత్త నియామకాలేవీ జరగకున్నా.. కొత్త టీచర్లు వస్తుండటంపై తోటి టీచర్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ కొత్త టీచర్లంతా రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి తదితర జిల్లాల్లోని గ్రామీణ ప్రాంత పాఠశాలల్లో పనిచేయాల్సిన వారు. కానీ డిçప్యుటేషన్లపై పట్టణ ప్రాంతాల్లోని పాఠశాలలకు వచ్చి తిష్టవేస్తున్నారు. తమకు పోస్టింగ్ ఇచ్చిన గ్రామీణ పాఠశాలలో పనిచేయడం ఇష్టం లేకనో, మరేదైనా కారణాలతోనో.. జిల్లా విద్యాశాఖ అధికారులు (డీఈఓలు), పాఠశాల విద్యాశాఖ కార్యాలయంలోని అధికారులు, రాజకీయ నేతల సహకారంతో ఇలా పట్టణ ప్రాంత బడుల్లోకి మారుతున్నారు. ఈ జిల్లాల పరిధిలో వంద మందికిపైగా టీచర్లు ఇలా డిçప్యుటేషన్లపై ఇతర చోట్లకు వెళ్లినట్టు అంచనా. దీంతో ఇప్పటికే ఉపాధ్యాయుల కొరతతో సతమతం అవుతున్న గ్రామీణ ప్రాంత పాఠశాలల్లో బోధనకు మరింతగా ఇబ్బంది ఎదురవుతోంది. రూ.3 లక్షల దాకా ముట్టజెప్పి.. కోరిన చోటికి డిప్యూటేషన్పై వెళ్లేందుకు కొందరు టీచర్లు.. స్థానిక ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలతో పైరవీలు చేయించుకుంటున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. మరికొందరు విద్యాశాఖ అధికారులను ఆశ్రయించి డిప్యుటేషన్ పొందుతున్నారు. ఈ క్రమంలో ఒక్కో టీచర్ రూ.3 లక్షల వరకు ముట్టజెప్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు డీఈఓలు అందినకాడికి వసూలు చేసి, ఇలా డిప్యుటేషన్లు ఇస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ లోపల, శివార్లలోని దగ్గరి ప్రాంతాల స్కూళ్లకు వెళ్లేందుకు అంతకంటే ఎక్కువే చేతులు మారుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నెల 2న యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సంగెం జెడ్పీ హైస్కూల్కు చెందిన ఓ టీచర్ను ఏకంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నాగోల్ జెడ్పీ హైసూ్కల్కు డిప్యూటేషన్పై పంపుతూ యాదాద్రి జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవానికి అంతర్ జిల్లా డిప్యూటేషన్ ఇచ్చే అధికారం డీఈఓలకు ఉండదు. అయినా ఇలాంటి ఆదేశాలు రావడం గమనార్హం. అయితే రాష్ట్రంలో ఎక్కడా డిప్యూటేషన్లు ఇవ్వలేదని, పాఠశాల విద్య కమిషనరేట్ నుంచి అలాంటి ఉత్తర్వులేవీ జారీ చేయలేదని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ చెప్తుండటం గమనార్హం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొన్ని డిప్యూటేషన్లు ఇలా.. ► రంగారెడ్డి జిల్లా మంచాల మండలం రంగాపూర్ జెడ్పీ హైసూ్కల్ నుంచి ఓ ఉపాధ్యాయుడు అబ్దుల్లాపూర్మెట్ మండలం రాగన్నగూడ జెడ్పీహెచ్ఎస్కు డిప్యూటేషన్పై వెళ్లారు. ► మాడ్గుల మండలం అవురుపల్లి జెడ్పీహెచ్ఎస్లో పనిచేయాల్సిన ఓ టీచర్.. చంపాపేట్ జెడ్పీహెచ్ఎస్లో డిప్యూటేషన్పైన విధులు నిర్వహిస్తున్నారు. ► మాడ్గుల మండలం పుట్టగడ్డతండా ప్రాథమిక పాఠశాలకు చెందిన ఓ ఉపాధ్యాయురాలు.. అబ్దుల్లాపూర్మెట్ మండలం కవాడిపల్లి ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నారు. ఇదే మండలం అన్నబోయినపల్లి పాఠశాలకు చెందిన టీచర్.. శేరిలింగంపల్లి మండలం కొండాపూర్ పాఠశాలకు డిప్యూటేషన్పై వెళ్లారు. ► ఇలా మాడ్గుల మండలానికి చెందిన సుమారు ఇరవై మంది టీచర్లు డిప్యూటేషన్లపైన ఇతర మండలాల్లో పనిచేస్తున్నట్టు సమాచారం. ► షాద్నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని దాదాపు 60 మంది టీచర్లు.. గ్రేటర్ హైదరాబాద్ శివారు ప్రాంతాలైన రాజేంద్రనగర్, శంషాబాద్, శేరిలింగంపల్లి మండలాల్లో డిప్యూటేషన్పై పనిచేస్తున్నారు. ఈ సెగ్మెంట్ పరిధిలో దాదాపు 12 పాఠశాలల్లో టీచర్లెవరూ లేరని సమాచారం. మానవతా దృక్పథంతో చేస్తున్నాం.. పక్షవాతం, కేన్సర్ తదితర వ్యాధుల బాధితులు, అఖిల భారత సర్వీసు ఉద్యోగుల జీవిత భాగస్వాములు వంటి వారి డిప్యూటేషన్లను అనుమతిస్తున్నాం. అలాంటి వారు ఎవరున్నా దరఖాస్తు చేసుకోవాలని కూడా చెప్తున్నాం. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం.. ఇలాంటి దరఖాస్తులను మానవతా దృక్పథంతో ఆమోదించి పోస్టింగ్లు ఇస్తున్నాం. విద్యాశాఖ కమిషనర్ నుంచి వస్తున్న ప్రతిపాదనలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నాం. – బుర్రా వెంకటేశం, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఒక్క డిప్యూటేషన్ కూడా ఇవ్వలేదు డిప్యూటేషన్లు, బదిలీలకు సంబంధించి నేను ఎక్కడా సంతకాలు చేయలేదు. నాకు ఎలాంటి సంబంధం లేదు. గత మూడున్నరేళ్లలో నేను ఒక్క ఆర్డర్పై కూడా సంతకం చేయలేదు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే అమలు చేస్తా. – దేవసేన, విద్యాశాఖ కమిషనర్ -
ఇతర రాష్ట్రాలకు నమూనాగా ఏపీ విద్య
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొన్న జనవరి 30న ఒకటవ తరగతి నుంచే ఐబీ సిలబస్తో పాఠశాల విద్యను ప్రారంభించడానికి ఒక అంతర్జాతీయ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇంగ్లిష్ మీడియంలో ప్రభుత్వ పాఠశాల విద్యను ప్రపంచ ప్రమాణాలకు అనుసంధానం చేయడంలో ఇది మరో ప్రధాన అడుగు. విద్యార్థులు దీంతో ఉమ్మడి సర్టిఫికెట్ పొందుతారు. విజ్ఞాన భారత్ను నిర్మించడంలో భాగంగా, ఏపీ ప్రభుత్వం అసాధారణ రీతిలో పాఠశాల విద్యపై దృష్టి సారించిందన్న విషయం, గణతంత్ర దినోత్సవం నాడు ప్రదర్శించిన రాష్ట్ర శకటంలో ప్రతిఫలించింది. గ్రామీణ పాఠశాల విద్య నుండి ప్రపంచ స్థాయి తత్వవేత్తలు, శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, వైద్యులను సృష్టిస్తుందని ప్రపంచానికి చాటడానికి ప్రదర్శించిన అత్యంత గొప్ప భవిష్యత్ శకటం ఇది. న్యూఢిల్లీలోని కర్తవ్య పథ్లో జరిగిన 2024 గణతంత్ర దినోత్సవ పరేడ్లో, ‘పాఠశాల విద్య పరివర్తన’ థీమ్తో ఒక శకటాన్ని ప్రపంచ, జాతీయ నాయకత్వం ముందు ప్రదర్శించడం ద్వారా భవిష్యత్తుకు సంబంధించి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఓ కొత్త దృక్పథాన్ని చూపించింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు పాడుతూ, నృత్యాలు చేస్తూ శకటం వెంట కదిలారు. అధికారులు సృజనాత్మకంగా నిర్మించిన ఆ శకటాన్ని పరేడ్లో ఉంచడానికి ఏపీ ముఖ్యమంత్రికి ధైర్యం, విశ్వాసం అవసరం. దాన్ని వీక్షించిన అంతర్జాతీయ, జాతీయ వీక్షకులు చాలా ఉత్సా హంగా చప్పట్లు కొట్టారు. ఎందుకంటే ఇది ఇతర రాష్ట్ర శకటాల కంటే ఒక ప్రధాన వ్యత్యాసాన్ని కనబర్చింది. ‘సకల విద్యలకు మేమే సాటి / విశ్వ విద్యకు మేమే పోటీ’ అంటూ పిల్లలు పాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పేద పిల్లల కోసం అందిస్తున్న ఇంగ్లిష్ మీడియం విద్యా నాణ్యత గురించి ఈ పాట చెబుతుంది. తమ పాఠశాల యూనిఫారంలో నిల బడి ఉన్న విద్యార్థులు వారి టాబ్లెట్లు, ద్విభాషా పుస్తకాలను చూపు తున్నారు. ఉపాధ్యాయులు నైపుణ్యాలను, జ్ఞానాన్ని నేర్చుకోవడంలో వారికి సహాయం చేస్తున్నారు. భారతదేశం తన గ్రామీణ పాఠశాల విద్య నుండి ప్రపంచ స్థాయి తత్వవేత్తలు, శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, వైద్యులను సృష్టిస్తుందని ప్రపంచానికి చాటడానికి ప్రదర్శించిన అత్యంత గొప్ప భవిష్యత్ శకటం ఇది. గణతంత్ర దినోత్సవ అతిథిగా వచ్చిన ఫ్రా¯Œ ్స అధ్యక్షుడు మెక్రాన్ దానిని ఆసక్తితో చూశారు. పాఠశాల విద్యకు సంబంధించిన పరివర్తన సందేశం గురించి ఒక అనువాద కుడు ఆయనకు వివరించడం కనిపించింది. గత 74 సంవత్సరాల్లో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా రిపబ్లిక్ డే పరేడ్లలో ఇలాంటి వినూత్న పాఠశాల విద్యా నమూనాను ప్రదర్శించలేదు. నాణ్యమైన విద్య కాకపోయినా, అక్షరాస్యత రేటును చూపించడానికి ధైర్యం చేయగల ఏకైక రాష్ట్రం కేరళ కూడా ఇన్నేళ్లుగా తమ పాఠశాల విద్యా విజయాన్ని ఏపీ ప్రభుత్వం రీతిలో జరుపుకోవాలని అనుకోలేదు. వాస్తవానికి, ప్రతి అధికార రాజకీయ పార్టీ తన పనితీరు, విధాన కార్యక్రమం ఆధారంగా ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నిస్తుంది. కానీ పాఠశాల మౌలిక సదుపాయాల మెరుగుదలతో పాటు వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన కొత్త ఇంగ్లిష్ మీడియం పాఠశాల విద్య, గ్లోబల్ పవర్ హౌజ్గా మారాలని భావిస్తున్న ప్రజాస్వామ్యంలో హృదయాన్ని కదిలించే విషయం. నాణ్యమైన పాఠశాల విద్య అనే ఆలోచనను జగన్ ప్రైవేట్ నుంచి పబ్లిక్గా మార్చారు. మారుమూల గ్రామాల్లోని పేద పిల్లలు తమ సొంత గ్రామంలోని పాఠశాలల్లో ఆధునిక ప్రపంచ నైపుణ్యాలను నేర్చుకుంటూ ఆత్మవిశ్వాసంతో, గౌరవంగా జాతీయ, ప్రపంచ మార్కెట్లలోకి రావాలని ఆశపడుతున్నారు. జగన్ తన ముందున్న అభివృద్ధి నమూనాకు విరుద్ధంగా ఈ అభివృద్ధి నమూనాను ఎంచుకున్నట్లు కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు సింగపూర్ వంటి రాజధాని నగరం నిర్మించడానికి 30,000 ఎకరాల భూమిని సమీకరించడంలో రాష్ట్ర వనరులను పెట్టుబడిగా పెట్టారు. ప్రభుత్వ రంగాన్ని ఏమాత్రం పట్టించుకోని ప్రైవేట్ రంగ పెట్టుబడి నమూనాయే ఆయన నమూనా. విద్యా రంగంలో కూడా ప్రైవేట్ పెట్టుబడిదారులను ఆయన ప్రోత్సహించారు. ఏపీ శకటం ఇతర రాష్ట్ర శకటాలతో పోలిస్తే భిన్నంగా ఉంది. గత వైభవం, స్వాతంత్య్ర పోరాట చిహ్నాలు, మతపరమైన చిహ్నాలు లేదా వారి గిరిజన, సాదాసీదా జీవన స్త్రీలను మిగతా రాష్ట్రాలు ప్రదర్శించాయి. ఈ ఏడాది రిపబ్లిక్ పరేడ్ కవాతును దేశంలో మహిళా సాధి కారతను ప్రత్యేకంగా ప్రదర్శించడానికి ఉద్దేశించారు. సైన్యంలోని అన్ని విభాగాల్లో, ఇస్రో వంటి వైజ్ఞానిక కార్యకలాపాలలో, ప్రతి రంగంలో దేశం మహిళలను ఎలా ప్రోత్సహిస్తోందో ప్రపంచానికి చూపించడానికి దీన్ని రూపొందించారు. అంతరిక్ష శాస్త్రంలో తన సొంత మహిళా శక్తిని ‘ఇస్రో’ తన శకటంలో ఉంచింది. ఆ రకంగా అది దాని సొంత భవిష్యత్తు యోగ్యతను కలిగి ఉంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ (రామ్ లల్లాపై తన శకటాన్ని రూపొందించింది) వంటివి తమ సాంప్రదాయ నృత్యం చేసే మహిళలతో తమ శకటాలను రూపొందించాయి. కానీ ప్రపంచీకరణ యుగంలో ఆధునికమైన, చక్కగా అమర్చిన ఇంగ్లిష్ మీడియం విద్యతో, పాఠశాల విద్యను ఈ దేశ భవిష్యత్తుగా చూపిన ఏకైక రాష్ట్రం ఏపీయే. ఇప్పటికీ అర్ధ–మధ్యయుగ జీవన వ్యవస్థలతో వేలాడుతున్న గిరిజన (ఈశాన్య రాష్ట్రాలు, ఛత్తీస్ గఢ్, జార్ఖండ్ మొదలైనవి) లేదా గిరిజనేతర మహి ళల భవిష్యత్తు సవాళ్లు ఏమిటో ఆ యా రాష్ట్రాలు చూపలేదు. ముస్లిం మహిళల స్థితిగతులు ఏమిటో ఏ శకటమూ చెప్పలేదు. కశ్మీర్ నుంచి కనీసం అలాంటి ఒక్క శకటాన్నయినా తేవాల్సింది.రాష్ట్ర చరిత్రను చూపించడం ఒక విషయం; పిల్లలకు చక్కగా, ప్రణాళికాబద్ధమైన విద్యనుఅందించడం ద్వారా దేశ భవిష్యత్తును చూపించడం మరొక విషయం. ఆంధ్రప్రదేశ్ దీనిని స్పష్టమైన విజన్ తో చేసింది. ఏపీ శకటం కదులుతుండగా ప్రధాని నరేంద్ర మోదీ దాన్ని జాగ్రత్తగా గమనించారు. ఆయన సొంత గుజరాత్ మోడల్ కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియం విద్యను అంత బాగా అందించలేకపోయింది. గుజరాత్ కూడా ఇప్పుడు నాణ్యమైన ఇంగ్లిష్ మీడియం విద్య కోసం ప్రైవేట్ పాఠ శాలలపై ఆధారపడుతోంది. అది కూడా ధనవంతులకు మాత్రమే అందుబాటులో ఉంది. భారతదేశం పాశ్చాత్య దేశాలతో, చైనాతో పోటీ పడాలని ఆకాంక్షిస్తున్నప్పుడు, తమ సొంత ప్రాంతీయ భాషలో చక్కటి పునాది కలిగివుండి, ఆంగ్ల మాధ్యమంలో నాణ్యమైన విద్యను అందించడమే ఏకైక మార్గం. జగన్ మోహన్ రెడ్డి చైతన్యపూర్వకమైన ప్రయత్నంతో నాణ్యమైన ఇంగ్లిష్ మీడియం విద్యపై ఆంధ్రా విద్యార్థులకు విశ్వాసం ఏర్పడింది. ఇప్పుడు దాన్నే వైఎస్ జగన్ తన ఎన్నికల ఆయుధంగా మలుచుకున్నారు. ఆ ఆలోచనతోనే ఢిల్లీలో రిపబ్లిక్ డే పరేడ్లో పాఠ శాల విద్యా శకటాన్ని ప్రదర్శింపజేశారు. పాఠశాల విద్యలో కేంద్రం లేదా రాష్ట్రం ఏదైనా పెద్ద సానుకూల అడుగు వేసిందంటే తప్పనిసరిగా అభినందించాలి. దేశ భవిష్యత్తు అక్కడే ఉంది. సైద్ధాంతిక విభేదాలు ఏ విషయంలోనైనా ఉండవచ్చు, కానీ ప్రైవేట్ పాఠశాలలతో సమానంగా నాణ్యమైన పాఠశాల విద్యను ప్రభుత్వ పాఠశాలల్లో అందించడంలో కచ్చితంగా విభేదాలు ఉండ కూడదు. అప్పుడు మాత్రమే పిల్లల భవిష్యత్తుకు ఎదురుదెబ్బ తగ లదు. ఏ పిల్లవాడు అయినా రెండు భాషలను చాలా సులభంగా నేర్చు కోగలడు. మన విషయంలో అది ఇంగ్లిష్, పిల్లల ప్రాంతీయ భాష అయి ఉండాలి. కేంద్ర ప్రభుత్వం కూడా ఆంధ్రా విద్యా నమూనాను అర్థం చేసుకుంటుందని, అభినందిస్తుందని ఎవరైనా ఆశిస్తారు. - వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త - ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ -
ప్రభుత్వ బడుల్లో ‘ఐబీ’ విద్య అమలుకు ఒప్పందం
భావి తరాలకు నాణ్యమైన విద్య అందించడం ఎంతో ముఖ్యం. భవిష్యత్తు తరాలు మంచి ఉద్యోగాలు సాధించాలన్నా, ప్రపంచంలో నంబర్వన్గా నిలవాలన్నా నాణ్యమైన విద్యే కీలకం. – ఐబీతో ఒప్పందంలో సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో అంతర్జాతీయ విద్యా బోధన దిశగా కీలక ఘట్టం పూర్తి అయ్యింది. రాష్ట్రంలో ఇంటర్నేషనల్ బాకలారియెట్ (ఐబీ) సిలబస్ అమలు చేసేందుకు విద్యాశాఖతో ఐబీ అధికారులు ఒప్పందం చేసుకున్నారు. బుధవారం సాయంత్రం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, ఐబీ చీఫ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్నోవేషన్) డాక్టర్ అంటోన్ బెగుయిన్ ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. ఐబీ డైరెక్టర్ జనరల్ ఓలి పెక్కా హీనోనెన్ ఈ కార్యక్రమంలో జెనీవా నుంచి వర్చువల్గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ప్రభుత్వ విద్యారంగంలో ఐబీని భాగస్వామ్యం చేయడం గొప్ప సంతృప్తినిస్తోందన్నారు. ఐబీతో భాగస్వామ్యం అత్యంత ముఖ్యమైందని, ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు ప్రభుత్వ స్కూళ్లను ఐబీతో ఏకీకృతం చేయడం గొప్ప సంతృప్తినిచ్చే కార్యక్రమంగా అభివర్ణించారు. ఐబీ డైరెక్టర్ జనరల్ ఓలీ పెక్కా, ఐబీ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. ఆ పరిస్థితి ఇక మారుతుంది: సీఎం జగన్ భారత్ లాంటి దేశాల్లో నాణ్యమైన విద్య అత్యవసరమని, ఇప్పుడున్న విధానాలను అప్గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఉందని సీఎం జగన్ చెప్పారు. సాంకేతికత, పాఠ్య ప్రణాళిక తదితర అంశాలను అప్గ్రేడ్ చేయాలన్నారు. సమస్యా పూరణ సామర్థ్యం, ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ మోడల్లో ఎడ్యుకేషన్ నాలెడ్జ్ వినియోగం లాంటివి చాలా కీలకమని, ఐబీ ద్వారా ఇది సాధ్యమన్నారు. ఐబీతో భాగస్వామ్యం ద్వారా ఒక ప్రయాణం ప్రారంభమైందని, రానున్న విద్యా సంవత్సరంలో టీచర్లకు, సిబ్బందికి ఐబీ విధానాలపై శిక్షణ కార్యక్రమాలు అమలు చేస్తామని తెలిపారు. ఐబీ విద్య సంపన్నులకు మాత్రమే అనే పరిస్థితి ఇప్పుడు మారుతుందని వ్యాఖ్యానించారు. పేదలకు, అణగారిన వర్గాలకూ ఇకపై ఐబీ బోధన అందుతుందన్నారు. ప్రతి సంవత్సరం ఒక్కో తరగతిలో ఐబీ బోధన మొదలై 2035 నాటికి పదో తరగతి, 2037 నాటికి పన్నెండో తరగతుల్లో ఐబీ బోధన ప్రారంభమవుతుందని తెలిపారు. ఎస్సీఈఆర్టీ, ఐబీ భాగస్వామ్యంతో విద్యా బోధన కొత్త ప్రమాణాలను నెలకొల్పుతుందన్నారు. ఇతర దేశాలకు ఈ ఒప్పందం స్ఫూర్తి: ఓలి పెక్కా తమది లాభాపేక్ష లేని సంస్థ అని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందంపై చాలా నిబద్ధతతో ఉన్నామని ఐబీ డైరెక్టర్ జనరల్ ఓలి పెక్కా హీనోనెన్ చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందని పేర్కొంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు ధన్యవాదాలు తెలిపారు. విద్య ద్వారా ఉత్తమ ప్రపంచాన్ని, శాంతియుత సమాజాన్ని నిర్మించాలన్నది తమ లక్ష్యమన్నారు. ఇంత పెద్దస్థాయిలో తమ సంస్థ భాగస్వామ్యం కావడం ఇదే ప్రథమమని, ఇతర దేశాలకు, ప్రాంతాలకు ఈ ఒప్పందం ఒక స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. దీనిద్వారా భారత్తో విద్యారంగంలో తమ సంబంధాలు మరింత మెరుగుపడతాయని, నాణ్యమైన విద్యకోసం ఉపాధ్యాయులు, సిబ్బంది మధ్య మంచి వాతావరణాన్ని కల్పించి సామర్థ్యాలను పెంచుతామన్నారు. పిల్లలు, స్కూళ్లు, తల్లిదండ్రులు, యూనివర్శిటీలతోనూ తమ సంబంధాలు మెరుగుపడతాయన్నారు. ఏపీలో కొత్త తరహా విద్యా విధానంలో తొలుత ప్లే బేస్డ్ లెర్నింగ్ విధానంతో పిల్లల్లో ఆసక్తిని కలిగించేందుకు ఆర్ట్స్, సైన్స్, మ్యాథ్స్తో పాటు మాతృ భాషల్లోనే కాకుండా పిల్లలు విదేశీ భాషలను నేర్చుకోవడంపైనా దృష్టి సారించినట్లు ఆయన వివరించారు. దీనివల్ల పిల్లల్లో కొత్త సామర్థ్యాలు అలవడతాయన్నారు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, జర్మనీ, సింగపూర్, ఎస్తోనియా, ఫిన్లాండ్, కెనడా దేశాల్లోని విద్యామంత్రులతో ఇటీవల నాణ్యమైన బోధన, అభ్యాసాలపై చర్చించినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్.జవహర్రెడ్డి, విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ సౌరవ్ గౌర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ (ఇన్ఫ్రా) కాటమనేని భాస్కర్, సర్వశిక్ష అభియాన్ ఎస్పీడీ బి.శ్రీనివాసరావు, పాఠశాల విద్యాశాఖ(మిడ్ డే మీల్స్) డైరెక్టర్ ఎస్.ఎస్.శోభిక, ఐబీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఐబీ భాగస్వామ్యంపై జీవో పాఠశాల విద్యలో ఇంటర్నేషనల్ బాకలారియెట్ సిలబస్ అమలుకు అనుగుణంగా ఎస్సీఈఆర్టీలో ఐబీ భాగస్వామ్యంపై పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుధవారం జీవో నంబర్ 5 జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలల్లో భవిష్యత్ సాంకేతికత, సిలబస్, బోధన, సదుపాయాలు తదితర అంశాలపై ఐబీ ప్రతినిధులు అధ్యయనం చేయనున్నారు. 21 మంది ఐబీ ప్రతినిధుల బృందం వచ్చే నెల రోజుల్లో 40 పాఠశాలలు, విద్యాశాఖ కార్యాలయాలను పరిశీలించి అధ్యయనం నిర్వహిస్తుంది. ఎగ్జామినేషన్ విధానాలను సైతం పరిశీలించి మార్పుచేర్పులపై సూచనలు చేస్తారు. విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులకు శిక్షణ, సిలబస్పై సూచనలు ఇచ్చేందుకు ఎస్సీఈఆర్టీలోని 19 మంది నిపుణులతో పాటు ఐబీకి చెందిన 26 మంది నిపుణులు చర్చించనున్నారు. మొత్తం ప్రక్రియను 2025 మే నాటికి పూర్తి చేసి వచ్చే ఏడాది జూన్ నుంచి ఒకటో తరగతిలో ఐబీ సిలబస్ బోధనను ప్రవేశపెట్టనున్నారు. -
ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్లో సీఎం జగన్
తిరుపతిలో జరిగిన ఇండియాటూడే ఎడ్యుకేషన్ సమ్మిట్లో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. రెండో సారి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావడం ఖాయమని ప్రకటించారు. తమ ప్రభుత్వం వల్ల మేలు జరిగిందని భావిస్తేనే ఓటు వేయమని ప్రజలను ధైర్యంగా అడుగుతున్నానని సీఎం జగన్ చెప్పారు. తప్పనిసరిగా మేం తిరిగి అధికారంలోకి వస్తామన్న సీఎం జగన్.. విద్య, వైద్యం, పరిపాలనా రంగాల్లో పెను మార్పులు తీసుకు వచ్చామని చెప్పారు. వివక్ష లేకుండా, అవినీతి లేకుండా పారదర్శకంగా అర్హత ఉన్న వారికి అన్నీ అందించామని, మేని ఫెస్టోలో 99.5 శాతం హామీలను నెరవేర్చామని తెలిపారు. మా ప్రభుత్వానికున్న విశ్వసనీయతకు ఇది నిదర్శనమని చెప్పిన సీఎం జగన్... కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా డర్టీ గేమ్ ఆడుతుందని, విభజించి రాష్ట్రాన్ని పాలించాలనుకున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించినట్టే.. తమ కుటుంబాన్ని కూడా విభజించారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్ చెప్పినదాంట్లో ముఖ్యాంశాలు పిల్లలు ఓటర్లు కాదు కాబట్టి.. వారిపైన పెద్దగా శ్రద్ధ పెట్టరు అయితే విద్య అలాంటి అంశాలపై దృష్టి పెట్టకపోతే పేదరికాన్ని నిర్మూలించలేం నేను ఏ హామీ ఇచ్చాను, ఏం చేశాను అన్నది చూడాలి మానిఫెస్టోలో ఇచ్చిన హామీలను 99.4 శాతం అమలు చేశాను అమలు చేయడమే కాదు, వాటిని ప్రజల వద్దకు తీసుకెళ్లగలిగాను ఇది మా ప్రభుత్వానికున్న విశ్వసనీయత ప్రతి 2వేల జనాభాకు గ్రామ సచివాలయాన్ని, వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చాం వివక్ష లేకుండా, అవినీతి లేకుండా అర్హత ఉన్నవారికి డీబీటీ ద్వారా పథకాలు అందించాం డీబీటీ అన్నది ఒక విజయవంతమైన అంశం అయితే విద్య, వైద్యం, మహిళా సాధికారితల్లో గణనీయమైన మార్పులు తీసుకు వచ్చాం అన్నిటికంటే మించి వివక్ష లేకుండా పారదర్శకతతో ప్రత్యక్ష నగదు బదిలీ అమలు చేశాం కచ్చితంగా మేం తిరిగి అధికారంలోకి వస్తాం ప్రతిపక్షాలు ఏవీ కూడా పథకాలు గురించి మాట్లాడవు, వాటి అమలు గురించీ కూడా విపక్షాలు మాట్లాడలేవు ఇదే బడ్జెట్ గతంలోనూ ఉంది..ఇప్పుడూ ఉంది కాని మార్పు ఏంటంటే.. కేవలం ముఖ్యమంత్రి మాత్రమే మారారు కాని ఈ ప్రభుత్వం మాత్రమే ఇవన్నీ చేయగలిగింది చంద్రబాబు విషయంలో ప్రతీకారం అన్నది నాకు లేనే లేదు చంద్రబాబుపై అవినీతి ఆరోపణల విషయం కోర్టుకు చేరింది ఆ ఆరోపణలు, ఆధారాలను చూసి కోర్టు నిర్ణయం తీసుకుని రిమాండ్ విధించింది అలాంటప్పుడు ప్రతీకారం ఎలా అవుతుంది.? సీఐడీ కేసులు పెట్టినా, కోర్టులు ఆధారాలను చూస్తాయి కదా? వాటిని చూసి కన్విన్స్ అయితేనే కోర్టులు నిర్ణయాలు తీసుకుంటాయి రాష్ట్రంలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీల ఉనికి పెద్దగా లేదు పోటీ మా పార్టీకి, టీడీపీ- జనసేన కూటమికి మధ్యే ఉంటుంది ప్రతి పార్టీ కూడా సర్వేలు చేస్తుంది వాటి ఫలితాల ఆధారంగా మార్పులు, చేర్పులు చేస్తుంది ప్రభుత్వం పట్ల ప్రజలు చాలా సానుకూలంగా ఉన్నారు కాని కొందరు స్థానిక నాయకుల విషయంలో ప్రజలకు కొంత అసంతృప్తి ఉంది అంతేకాకుండా సామాజిక సమీకరణాల దృష్ట్యా కూడా కొన్ని మార్పులు చేశాం చివరిదశలో మార్పులు చేసి అయోమయం సృష్టించే కన్నా, ముందుగానే నిర్ణయిస్తున్నాం జాతీయ రాజకీయాలు విషయంలో మా విధానం స్పష్టం: రాష్ట్ర ప్రయోజనాల విషయంలో మేం రాజీపడబోం ప్రజల ప్రయోజనాల విషయంలోనే కేంద్ర ప్రభుత్వం సహకారంతో ముందుకు వెళ్తున్నాం: కాంగ్రెస్ ఎప్పుడూ కూడా డర్టీ గేమ్ ఆడుతూ ఉంటుంది అది ఆ పార్టీ సంప్రదాయంగా గమనిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారు విభజించి రాష్ట్రాన్ని కాంగ్రెస్ పాలించాలనుకుంది అలాగే మా కుటుంబాన్ని కూడా విభజించారు నేను కాంగ్రెస్నుంచి విడిపోయినప్పుడు గతంలో మా చిన్నాన్నకు మంత్రిపదవి ఇచ్చి మాపై పోటీకి పెట్టారు వారు పాఠాలు నేర్వలేదు కాంగ్రెస్ పార్టీ ఏపీ సారథ్య బాధ్యతలు మా సోదరికి ఇచ్చారు కాని అధికారం అనేది దేవుడు ఇచ్చేది దేవుడ్ని నేను బలంగా నమ్మతాను ఆయనే అన్నీ చూస్తాడు ఇండియాటుడే తరపున రాజ్దీప్ ప్రశ్నలు, ముఖ్యమంత్రి జగన్ సమాధానాలు సవివరంగా.. రాజ్దీప్ : తిరుపతి లాంటి ఆధ్యాత్మిక నగరంలో విద్యపై సదస్సు నిర్వహించడం సంతోషకరం, చదువుతో వచ్చే మార్పు ఏంటన్నది కొత్తగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు, ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఆ మార్పే చోటు చేసుకోబోతుంది. ఏపీలోని అత్యంత సామాన్య విద్యార్థులు అమెరికాలోని వాషింగ్టన్ డీసీని పర్యటించడం గొప్ప విషయం సీఎం జగన్ : ఇండియా టుడే జర్నలిస్టులు తిరుపతిలోని ప్రభుత్వ పాఠశాలలు చూడడం గొప్ప విషయం పేదరికం తొలగించేందుకు చదువుపై పెట్టుబడి పెట్టడం మినహా మరో మార్గం లేదన్నది నా బలమైన నమ్మకం నాణ్యమైన విద్య అందుకోవడం ప్రతీ ఒక్కరి హక్కు కావాలి పేదలు చదివేది ఒకటయితే, ధనిక పిల్లలు చదివేది మరొకటి పేదలకు తెలుగు మీడియంలో బోధన జరిగేది, ధనిక పిల్లలు ఇంగ్లీషులో చదివేవారు రాజ్దీప్ : మూడో తరగతి నుంచే గ్లోబల్ ఎగ్జామ్ టోఫెల్ లాంటిపై అవగాహన కల్పించేలా చేసిన మార్పులపై విమర్శలొచ్చాయి. తెలుగు మీడియంలోనే బోధించాలని విమర్శలు చేశారు కదా.? సీఎం జగన్ : ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం బోధించేలా చేయరాదని విమర్శించే వాళ్ల పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారు? నన్ను, ప్రభుత్వ విధానాలను విమర్శించే ముందు మీ విధానాలను ప్రశ్నించుకోండి రాజ్దీప్ : అకస్మాత్తుగా ఇంగ్లీషు మీడియం ప్రవేశపెడితే విద్యార్థులు పాఠశాల మానేసే ప్రమాదం లేదా? సీఎం జగన్ : ఇలా జరక్కుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. పాఠ్యపుస్తకాల్లో ఒక పేజీలో తెలుగు, మరో పేజీలో ఇంగ్లీష్ పెట్టాం. మా బోధనకు అదనంగా అంతర్జాతీయ ఖ్యాతి గడించిన బైజూస్ అంశాలను చేర్చాం. పాఠశాలలు అన్నింటిలోనూ సౌకర్యాలు మెరుగుపరిచాం. ఒక విధంగా చెప్పాలంటే సమగ్ర ప్రణాళికతో వీటిని అమల్లోకి తెచ్చాం. నాడు-నేడు తీసుకొచ్చి పాఠశాలలో మౌలిక సదుపాయాలు మెరుగుపరిచాం. 62వేల తరగతి గదులుంటే .. 40 వేల తరగతి గదుల్లో ఇంటరాక్టివ్ టీవీలు ఏర్పాటు చేశాం. ఈ నెలాఖరుకల్లా మిగతా చోట కూడా పూర్తవుతాయి. టీచర్లకు తగిన శిక్షణ కూడా ఇవ్వడం ద్వారా ప్రణాళికకు ఒక సమగ్ర రూపం తీసుకొచ్చాం. 8వ తరగతి విద్యార్థులందరికీ ఒక ఆధునికమైన టాబ్ నేర్చుకునేందుకు అందించాం. రాజ్దీప్ : 8వ తరగతి విద్యార్థికి టాబ్ ఇచ్చారా? కోవిడ్ సమయంలో తగిన సాధన సంపత్తి (టీవీలు, మొబైళ్లు, టెక్నాలజీ) లేకపోవడం వల్ల చాలా మంది విద్యార్థులు చదువుకు దూరమయ్యారు? ఏపీ కూడా ఇందుకు మినహాయింపు కాదు కదా.? వచ్చే మూడేళ్లలో పదో తరగతి విద్యార్థులందరికీ టాబ్లు ఉంటాయని నమ్మకంగా చెప్పగలరా? సీఎం జగన్ : 8వ తరగతి, 9వ తరగతి విద్యార్థులకు ఇప్పటికే టాబ్లున్నాయి. డిసెంబర్ 21న టాబ్లు ఇచ్చాం. నా పుట్టిన రోజు నాడు నేనే తరగతి గదికి వెళ్లి పిల్లలను కలిసి వాళ్లకు టాబ్ అందజేస్తాం. రాజ్దీప్ : ప్రభుత్వాల్లో పనులు అంత వేగంగా జరగవని చెబుతారు, మీరు మీ యంత్రాంగాన్ని తగిన విధంగా ప్రోత్సహిస్తున్నారా? IB సిలబస్ కూడా ప్రవేశపెట్టారా? అది కేవలం కొన్ని నగరాల్లోనే అందుబాటులో ఉంది కదా.? అయితే ఇదంతా తొందరపడి చేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.. తల్లితండ్రులు కూడా ఆశ్చర్యపోతున్నారు ఇంత మంచి అవకాశం ఎలా వచ్చిందని.? సీఎం జగన్ : ఐబీ సిలబస్ మన రాష్ట్ర సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డుతో చేతులు కలిపింది. IB అన్నది ప్రస్తుతం ఉపాధ్యాయుల నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు మాత్రమే ఉపయోగిస్తున్నాం. జూన్ 2025 తర్వాత మొదటి తరగతిలో IB సిలబస్ ప్రవేశపెడతాం. అక్కడి నుంచి దశలవారీగా ఏడో తరగతి వరకు ప్రవేశపెడతాం. ఐదేళ్ల తర్వాత మన రాష్ట్ర విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో బ్యాక్యులరేట్ సర్టిఫెకెట్ కోసం పోటీ పడతారు. ఈ ప్రయత్నం ఎందుకంటే.. విద్యలో నాణ్యత అనేది చాలా ముఖ్యం. అదే లేకుంటే మా రాష్ట్ర విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడలేరు కదా.. ఈ పోటీలో కేవలం ధనికులు మాత్రమే గెలిచే పరిస్థితి ఉండకూడదు, అణగారిన వర్గాల వారికి కూడా అవకాశం దక్కాలి రాజ్దీప్ : అది గొప్ప దార్శనికతే. గుంటూరు జిల్లాలోని ఓ మారుమూల పల్లె నుంచి వచ్చిన విద్యార్థి పోటీ పడాలన్న ఆలోచన మంచిదే. కానీ విద్యార్థులకు మంచి బోధన అందించేందుకు నాణ్యమైన ఉపాధ్యాయులు ఉన్నారనుకుంటున్నారా? సీఎం జగన్ : ఒక మంచి ఆలోచనకు మావంతు ప్రయత్నం జోడిస్తున్నాం. IB, ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కలిసి పని చేస్తున్నాయి. IBతో చర్చలు జరిపి మాతో కలిసి పని చేసేలా వారిని ఒప్పించాం. ఇందుకు వారిని అభినందిస్తున్నాను. ఫలితంగా IB తన అధికారిక కార్యాలయాన్ని SCERTతో కలిసి ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేస్తోంది. ఇది విప్లవాత్మకమైన మార్పుకు నాంది. 2035 నాటికి IBలో చదువుకున్న విద్యార్థులు పదో తరగతిలో ప్రవేశిస్తారు. ఈ లక్ష్యంతోనే మేం పని చేస్తున్నాం. రాజ్దీప్ : ఈ పన్నెండేళ్ల ప్రాజెక్టులో IB తో కలిసి విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలన్నది మీ ఆలోచనా? దీనికి పెద్ద ఎత్తున నిధులు అవసరమవుతాయి, తగినన్ని మీ దగ్గర నిధులున్నాయా? సీఎం జగన్ : ముందు ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నాం ఏటా ఒక్కో తరగతి పెంచుకుంటూ.. చిన్న నుంచి పెద్ద తరగతుల వారికి IB బోధన ఇస్తున్నాం ఆ తర్వాత 11, 12 తరగతుల వరకు IB సిలబస్ బోధన అందుతుంది ఇది ప్రభుత్వ ప్రాజెక్టు అన్న విషయం IBకి కూడా తెలుసు. వాళ్లు కూడా ప్రభుత్వంలో భాగమైనందున.. మిగిలిన వారి వద్ద తీసుకునే స్థాయిలో రాయల్టీలాంటివి ఉండకపోవచ్చు. అట్టడుగు స్థాయి విద్యార్థులకు కూడా అంతర్జాతీయ స్థాయి విద్యను అందించవచ్చన్నది ప్రపంచానికి తెలిపేందుకు ఏపీ ప్రభుత్వం, IB కలిసి చేస్తున్న ప్రయత్నం ఇది. ఇక నిధుల విషయానికొస్తే.. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు దాదాపు రూ.14వేల కోట్ల నిధులు అవసరమవుతాయి. ఇప్పటివరకు రూ.8200 కోట్లను ఖర్చు పెట్టాం. నాడు-నేడు తొలిదశలో భాగంగా మొత్తం 44వేల పాఠశాలల్లో 15వేల పాఠశాలలు పూర్తయ్యాయి. రెండో దశలో భాగంగా 16వేల పాఠశాలల్లో పనులు జరుగుతున్నాయి. మార్చి నాటికి రెండో దశ పూర్తవుతుంది. వచ్చే ఏడాది మిగిలిన పాఠశాలల్లో పనులు చేపడుతాం. రాజ్దీప్ : 2018లో ఏపీలో పాఠశాలలో చేరుతున్న విద్యార్థుల శాతం 84.48, ఆ ఏడాది జాతీయ సగటు 99.21. ఈ పరిస్థితుల్లో డ్రాపవుట్లను అరికట్టేందుకు ఏం చేస్తున్నారు? జగనన్న అమ్మ ఒడిలా నేరుగా లబ్దిదారులకు ప్రయోజనం చేకూరుస్తారా? ఆ డబ్బును పిల్లల చదువుకు ఖర్చు పెట్టేలా చూస్తారా? సీఎం జగన్ : మేం పగ్గాలు చేపట్టేనాటికి రాష్ట్రంలో విద్యారంగం పరిస్థితి అట్టడుగున ఉంది. మౌలిక సదుపాయాల అభివృద్ధి, మధ్యాహ్నా భోజన పథకాలు, అమ్మ ఒడి లాంటి వాటి సాయంతో డ్రాప్ అవుట్లను తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం. మా రాష్ట్రంలో అమలవుతోన్న మధ్యాహ్న భోజన పథకం చాలా వినూత్నమైంది. గోరు ముద్ద పేరుతో ఇస్తోన్న ఈ పథకంలో ఒక్కో రోజు ఒక్కో మెనూతో పౌష్టికాహరం అందిస్తున్నాం. అవసరమయితే రాష్ట్రంలోని ఏ పాఠశాలకైనా మీరు వెళ్లి పరిశీలించుకోవచ్చు. రాజ్దీప్ : ఈ పథకాల అమలును ఎలా పర్యవేక్షిస్తున్నారు? గతంలో ప్రభుత్వాలు పాఠశాలలపై పెద్దగా దృష్టి పెట్టలేదు కదా.? నాకిపుడు అర్థమైంది మీరు ఢిల్లీలో ఎందుకు తక్కువ సమయం గడుపుతారన్నది అయితే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి గతంలోనూ ఒక సమస్య ఉండేది, ఈ రాష్ట్ర యువతకు నిరుద్యోగం సమస్య ఎక్కువ. ఒక దశలో 35% దాకా ఉండేది. ఈ నేపథ్యంలో వీరికి నైపుణ్యాలు అందించడం, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దడం ఒక సవాలేనా? సీఎం జగన్ : ఈ విషయాన్ని ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత అంశంగా చూస్తోంది. నేనే స్వయంగా పాఠశాలలను పర్యవేక్షిస్తున్నాను. కలెక్టర్లతో నిత్యం సమీక్ష నిర్వహిస్తున్నాను. మేం పాఠశాల విద్య మీద మాత్రమే కాదు ఉన్నత విద్యపైనా దృష్టి పెట్టాం. ఉద్యోగాలకు అవసరమైనట్టుగా బోధనాంశాల్లో మార్పులు చేశాం. మూడేళ్ల డిగ్రీ కోర్సుల్లో భాగంగా ఇంటర్న్షిప్ను తప్పనిసరి చేశాం. అన్ని డిగ్రీలను నాలుగేళ్లు చేస్తున్నాం, ఆన్లైన్ కోర్సులు ఇస్తున్నాం. ఇందులో భాగంగానే త్వరలో ఎడెక్స్తోనూ ఒప్పందం కుదుర్చుకోబోతున్నాం. పిల్లలు ఆన్లైన్లో మరిన్ని కోర్సులు నేర్చుకునేందుకు 1800 సబ్జెక్టుల్లో కోర్సులను అందించడానికి ఎడెక్స్తో ఒప్పందం చేసుకున్నాం బీకాం నేర్చుకునేవారికి అసెట్ మేనేజ్ మెంట్ తదితర అంశాలను నేర్చుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాం ఇవన్నీకూడా పాఠ్యప్రణాళికలో భాగం చేస్తున్నాం: ------------- విద్యారంగంలో ఏపీ కొత్త ఒరవడి 5.12pm, జనవరి 24, 2024 విద్యా రంగంలో ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలపై ఇంట్రో ఏపీలో విద్యారంగంలో సమూల మార్పులు, విద్యా రంగంలో ఆంధ్ర మోడల్, కొత్త ఒరవడి సృష్టించిన సీఎం జగన్ ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్కు సీఎం జగన్ 5.11pm, జనవరి 24, 2024 ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో సీనియర్ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్ చర్చ తిరుపతిలో ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్ 5.10pm, జనవరి 24, 2024 మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్న సీఎం జగన్ తిరుపతిలోని ప్రాంగణానికి చేరుకున్న సీఎం జగన్ Updates: ►ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్లో పాల్గొన్న సీఎం జగన్ ►ఏపీ విద్యారంగంలో తీసుకువచ్చిన నూతన విధానం, మన బడి నాడు - నేడు, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, టోఫెల్ శిక్షణ మొదలైన అంశాలపై చర్చ ►దేశానికే ఆదర్శంగా ఏపీ విద్యారంగంలో తీసుకువచ్చిన నూతన విధానంపై ఇండియా టుడే సమ్మిట్ ప్రతినిధులు ప్రశంస ►రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న సీఎం జగన్ ►మరి కొద్దిసేపట్లో తాజ్ హోటల్లో జరిగే ఇండియా టుడే ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్కు హాజరుకానున్న సీఎం జగన్ ►తిరుపతి బయలుదేరిన సీఎం వైఎస్ జగన్ ►కాసేపట్లో ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్లో పాల్గొననున్న సీఎం సాక్షి, గుంటూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు తిరుపతికి వెళ్లనున్నారు. అక్కడే జరిగే ఇండియా టుడే విద్యా సదస్సులో ఆయన పాల్గొంటారు. ఈ మేరకు పర్యటన వివరాలను సీఎంవో తెలియజేసింది. బుధవారం సాయంత్రం తాడేపల్లి నుంచి బయల్దేరి సీఎం జగన్ తిరుపతికి( Tirupati ) బయలుదేరతారు. రేణిగుంట విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి తాజ్ హోటల్కు వెళ్తారు. అక్కడ జరిగే ఇండియా టుడే ఎడ్యుకేషనల్ సమ్మిట్ లో పాల్గొంటారు. అనంతరం ఆయన తిరిగి తాడేపల్లికి ప్రయాణం అవుతారు. సీఎం రాక నేపథ్యంలో.. తిరుపతిలో అధికారులు భద్రత ఏర్పాట్లు చేశారు. -
ఈయన మాటలు వింటే చంద్రబాబు తల ఎక్కడ పెట్టుకుంటాడో
-
స్మార్ట్ ఫోన్లా ట్యాబ్లను వాడలేరు
గుంటూరు ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లోని 8వ తరగతి విద్యార్థులకు టెక్నాలజీ విద్యను చేరువ చేస్తూ ఉచితంగా అందించిన బైజూస్ కంటెంట్తో కూడిన ట్యాబ్ల వినియోగాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు పాఠశాల విద్యా శాఖ ఐటీ సెల్ డిజిటల్ ఇనీషియేటివ్స్ రాష్ట్ర నోడల్ అధికారి సీహెచ్వీఎస్ రమేష్కుమార్ చెప్పారు. గురువారం గుంటూరులో ట్యాబ్ల యాక్టివేషన్పై ఉపాధ్యాయులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన రమేష్కుమార్ ‘సాక్షి’తో మాట్లాడారు. ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన ట్యాబ్లను స్మార్ట్ఫోన్లా ఉపయోగించేందుకు ఆస్కారం లేదని, ప్రీ లోడెడ్ యాప్స్ను గూగుల్ సంస్థ ద్వారా బ్లాక్ చేయించినట్లు తెలిపారు. బైజూస్ కంటెంట్తో కూడిన యాప్తో పాటు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్తో కూడిన స్విఫ్ట్చాట్, ఈ–పాఠశాల, డ్యూలింగో, డిక్షనరీ యాప్లు మినహా మరే ఇతర యాప్లు ట్యాబ్లు ఉండవని స్పష్టం చేశారు. ఇంటర్నెట్తో పనిలేకుండా బైజూస్ కంటెంట్ను విద్యార్థులు చూడవచ్చని.. మిగిలిన 4 యాప్స్ను చూడాలంటే పాఠశాలల్లోని వైఫై ద్వారా కనెక్ట్ కావాలని చెప్పారు. సిమ్కార్డ్ స్లాట్ను బ్లాక్ చేశామని, 256 జీవీ సామర్ధ్యం కలిగిన ఎస్డీ కార్డు ద్వారా 4వ తరగతి నుంచి 12వ తరగతి వరకు సీబీఎస్ఈ సిలబస్లో అన్ని పాఠ్యాంశాలను లోడ్ చేశామని తెలిపారు. డ్యూలింగో యాప్ ద్వారా విద్యార్థులు విదేశీ భాషలు నేర్చుకోవచ్చన్నారు. స్విఫ్ట్ చాట్ యాప్ ద్వారా విద్యార్థి ఏ సబ్జెక్టుకు సంబంధించిన సమాచారాన్నైనా తెలుసుకోవచ్చని.. సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని చెప్పారు. ట్యాంపరింగ్ చేస్తే కఠిన చర్యలు.. ట్యాబ్లలో ఇన్బిల్ట్గా ఉన్న మొబైల్ డివైజ్ మేనేజ్మెంట్ వ్యవస్థ ద్వారా విద్యార్థుల ట్యాబ్లను ఐటీ సెల్ నుంచి నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు రమేష్కుమార్ చెప్పారు. ట్యాబ్లలో ఆధునిక భద్రతా వ్యవస్థ ఇమిడి ఉందన్నారు. ఈ ట్యాబ్లను విద్యార్థులు, ఉపాధ్యాయులు మినహా ఇతరులెవ్వరూ వినియోగించేందుకు అవకాశం లేదన్నారు. బ్లాక్ చేసిన యాప్లను అన్లాక్ చేసేందుకు సెల్ఫోన్ షాపులవాళ్లు, ప్రైవేటు వ్యక్తులు ప్రయత్నిస్తే వారిపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. దీనిపై అన్ని జిల్లాల ఎస్పీలకు ప్రభుత్వం సమాచారం చేరవేసిందని తెలిపారు. విద్యార్థులు ట్యాబ్లలో ఏ సబ్జెక్టు ఎంతసేపు చూశారనే సమాచారం కూడా నమోదవుతుందని వివరించారు. సర్వీస్ సెంటర్ల ద్వారా ఉచిత సేవలు ట్యాబ్లలో ఏదైనా సాంకేతిక సమస్య ఎదురైతే.. ఆ సంస్థ సర్వీసు సెంటర్ల ద్వారా ఉచిత సేవలు పొందవచ్చని రమేష్కుమార్ చెప్పారు. పని చేయని ట్యాబ్ను సమీపంలోని గ్రామ, వార్డు సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్కు అందిస్తే, వాళ్లు ఆన్లైన్లో నమోదు చేసి టోకెన్ ఇస్తారని పేర్కొన్నారు. అనంతరం ఆ ట్యాబ్ను సర్వీసు కేంద్రానికి పంపించి.. బాగు చేయించి మూడు రోజుల వ్యవధిలో తిరిగి అందజేస్తారని చెప్పారు. ట్యాబ్ కింద పడినా పాడవకుండా సురక్షితమైన కవర్ కేస్తో పాటు స్క్రీన్ గార్డు, చార్జర్, ఇయర్ ఫోన్ అందిస్తున్నట్లు చెప్పారు. -
7, 10 తరగతులకు ‘ఈఈఎంటీ’ ప్రతిభా పరీక్ష
సాక్షి, అమరావతి: విద్యార్థుల్లో ప్రతిభను పోత్సహించేందుకు ఎడ్యుకేషనల్ ఎపిఫనీ స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న ‘ఈఈఎంటీ–2024’ (ఎడ్యుకేషనల్ ఎపిఫనీ మెరిట్ టెస్ట్) పరీక్ష తోడ్పడుతుందని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు. విజయవాడలోని సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయంలో ఈఈఎంటీ షెడ్యూల్ను మంగళవారం ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 7, 10 తరగతి విద్యార్థులకు గత 11 సంవత్సరాలుగా ఆన్లైన్లో ఈ ఉచిత టెస్ట్ నిర్వహిస్తున్నారని తెలిపారు. పిల్లల్లో ప్రతిభా పాటవాలను వెలికి తీసేలా ఈ పోటీలు ఉంటాయన్నారు. జనవరి 23న ప్రిలిమనరీ, 31న మెయిన్స్ పరీక్ష ‘కోడ్ తంత్ర’ సాఫ్ట్వేర్ ద్వారా ఈ పరీక్ష నిర్వహిస్తారని తెలిపారు. ఎక్కువ మంది విద్యార్థులు పరీక్షకు రిజిస్ట్రేషన్ చేసుకునేలా జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బుధవారం నుంచి జనవరి 8వ తేదీ వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని సూచించారు. 162 మంది విజేతలకు రూ.9 లక్షల బహుమతులు 7, 10 తరగతుల్లో డిసెంబర్ వరకు పూర్తయిన సిలబస్పై 80 శాతం ప్రశ్నలు, జనరల్ నాలెడ్జిపై మరో 20 శాతం ప్రశ్నలు ఉంటాయి. కాగా, ఈ పోటీల్లో మొత్తం 162 మంది విజేతలకు దాదాపు రూ.9 లక్షల విలువైన నగదు బహుమతులు అందించనున్నారు. మరో 1,752 మందికి మెడల్స్, ప్రశంసాపత్రాలు అందజేస్తారు. రాష్ట్రస్థాయిలో పదో తరగతిలో ప్రథమ బహుమతిగా రూ.30 వేలు, ద్వితీయ బహుమతిగా రూ.25 వేలు, తృతీయ బహుమతి రూ.20 వేలు ప్రకటించారు. ఏడో తరగతిలో రాష్ట్ర స్థాయి మొదటి విజేతకు రూ.20 వేలు, రెండో విజేతకు రూ.15 వేలు, మూడో విజేతకు రూ.10 వేలు బహుమతిగా అందిస్తారు. ఈ పరీక్షకు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ డాక్టర్ బి.ప్రతాప్రెడ్డి, ఎపిఫనీ సంస్థ ప్రతినిధి డి.నభీ కోఆర్డినేటర్లుగాను, వి.ఎస్.సుబ్బారావు పరీక్షా కన్వీనర్గా వ్యవహరిస్తారు.https:// educationalepiphany.org/eemt 2024/registration.php లింక్ ద్వారా ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. పూర్తి వివరాలకు https:// educationalepiphany.org/ వెబ్సైట్లో గాని, 96667 47996 నంబర్లోగాని సంప్రదించి తెలుసుకోవచ్చు. ఈ సమావేశంలో ఎడ్యుకేషనల్ ఎపిఫనీ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ తవనం వెంకటరావు, ఉపాధ్యక్షుడు హేమచంద్ర, కన్వీనర్ పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి పాల్గొన్నారు. -
Fact Check: వాస్తవాలు దాచిపెట్టి ట్యాబ్లపై విష ప్రచారం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వం నాలుగున్నర ఏళ్లల్లో విద్యాశాఖలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ప్రభుత్వ పాఠశాలలను సమూలంగా మార్చిందని.. వాస్తవాలు తెలుసుకోకుండా కొందరు పేద విద్యార్థులకు జరుగుతున్న మేలుపై తప్పుడు ప్రచారం జరుగుతోందని పాఠశాల విద్యాశాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇటీవల ప్రభుత్వ పాఠశాలల్లోని 8వ తరగతి విద్యార్థులకు ఇచ్చిన ట్యాబ్స్ ఆన్లైన్లో తక్కువ ధర లభిస్తున్నా.. అధిక ధరకు కొనుగోలు చేశారంటూ కొందరు చేస్తున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని తెలిపింది. ట్యాబ్ కొనుగోలులో రూ.1,200 కోట్లు అవినీతి జరిగిందనడం పూర్తిగా అబద్ధమని పేర్కొంది. ట్యాబ్ స్పెసిఫికేషన్, వారంటీ తెలియకుండా ఆన్లైన్ ధర రూ.11,999 ఉందని.. బల్క్లో కొంటే రూ.9 వేలకే వస్తున్నట్టు పేర్కొంటూ.. ఈ ట్యాబ్స్ను రూ.14,250కు కొనుగోలు చేయడంలో అక్రమాలకు పాల్పడ్డారనడం పూర్తిగా అవాస్తవమని ఖండించింది. పాఠశాల విద్యాశాఖ ఇంకా ఏం తెలిపిందంటే.. ► వాస్తవానికి ఆయా కంపెనీలు పాత స్టాక్ను క్లియర్ చేసుకునేందుకు ఆన్లైన్లో తక్కువ ధరకు పెడుతుంటాయని, పైగా మనం కోరుకున్న స్పెసిఫికేషన్స్ అందులో ఉండవు. కానీ.. ప్రభుత్వం కొనుగోలు చేసిన ట్యాబ్స్కు నిర్ణీత ప్రత్యేకతలు పేర్కొని, ఆ తరహా ట్యాబ్స్ మాత్రమే తీసుకుంది. ► విద్యార్థులకు ప్రధానంగా శాంసంగ్ ఏ7 లైట్ ట్యాబ్లు ఇవ్వగా.. దాని బ్యాటరీతో సహా 3 ఏళ్ల వారంటీ, మూడేళ్ల పాటు మొబైల్ డివైజ్ మేనేజ్మెంట్ (ఎండీఎం), ఓటీజీ కేబుల్, ట్యాబ్కు రక్షణగా ఫ్లిప్ కవర్ ఉంటాయి. ► 256 జీబీ మెమరీ కార్డు గల ట్యాబ్ ధర మార్కెట్లోగాని, ఆన్లైన్లోగాని రూ.17,500 పైనే ఉంది. కానీ.. ప్రభుత్వం టెండర్ ద్వారా రూ.14,250 అంటే ఆన్లైన్ ధర కంటే చాలా తక్కువకు తీసుకుంది. ఆయా కంపెనీలు ఓటీజీ కేబుల్, డ్యూయల్ లేయర్ ట్యాబ్ ప్రొటెక్టెడ్ రగ్గడ్ కేస్, ట్యాంపర్డ్ స్క్రీన్ గార్డ్, ఫ్లాష్డ్ ఎడ్యుకేషన్ కంటెంట్తో 256 జీబీ యూ3 మెమరీ కార్డు, 3 సంవత్సరాల వారంటీతో అందించాయి. ► ఆన్లైన్లో కొనుగోలు చేసిన వస్తువులకు వారంటీగాని, సాఫ్ట్వేర్ సమస్యలకు కొనుగోలుదారే అదనంగా చెల్లించాలి. కానీ.. విద్యార్థులు ట్యాబ్లో ఏదైనా సమస్య తలెత్తితే సమీపంలోని గ్రామ/వార్డు సెక్రటేరియట్లో ఇచ్చి కంపెనీ సేవలకు ఉచితంగా పొందవచ్చు. గతేడాది ట్యాబ్స్ కొనుగోలుపైనా ఆరోపణ ► గత సంవత్సరం ఏసర్ ట్యాబ్ ధర రూ.14 వేలు ఉంటే, దాన్ని ప్రభుత్వం రూ.17,500కి కొనుగోలు చేసిందని, దాంతో రూ.2,500 కోట్ల స్కామ్ జరిగిందని ఆరోపించారు. ► వాస్తవానికి గతేడాది ప్రభుత్వం ఏసర్ ట్యాబ్లను కొనుగోలు చేయనేలేదు. ఈ ఏడాది మాత్రమే 1.35 లక్షల ఏసర్ ట్యాబ్లను కొనుగోలు చేసింది. ఒక్కో ఏసర్ ట్యాబ్ను రూ.14,200కు ఓటీజీ కేబుల్, డ్యూయల్ లేయర్ ట్యాబ్ ప్రొటెక్టెడ్ రగ్గడ్ కేస్, ట్యాంపర్డ్ స్క్రీన్ గార్డ్, ఫ్లాష్డ్ ఎడ్యుకేషన్ కంటెంట్తో గల 256 జీబీ యూ3 మెమరీ కార్డు, 3 సంవత్సరాల వారంటీ ఈ ధరలోనే ఉన్నాయి. అన్ని యాక్సెసరీస్కు మూడేళ్ల గ్యారెంటీ కూడా ఉంది. ► పైగా ట్యాబ్ కొనుగోలు టెండర్ జ్యుడీషియల్ ప్రివ్యూకు వెళ్లిన తర్వాత, ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే టెండర్లు పిలిచారు. రెండేళ్లలో ప్రభుత్వం 9,52,925 ట్యాబుల కొనుగోలుకు వెచ్చించిన మొత్తం రూ.1.305.74 కోట్లు అయితే.. రూ.2,500 కోట్ల అక్రమాలకు ఎలా ఆస్కారముంటుందని పాఠశాల విద్యాశాఖ ప్రశ్నించింది. -
శతశాతమే 'లక్ష్యం'
సాక్షి, హైదరాబాద్: టెన్త్ పరీక్షల్లో వందశాతం ఫలి తాలు సాధించాలని విద్యాశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. పాఠ శాల విద్య డైరెక్టరేట్ కార్యా లయం ఈ మేరకు జిల్లా అధికారులకు దిశానిర్దేం చేస్తూ..‘లక్ష్య’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని కార్యాచరణలోకి తెచ్చింది. ప్రతీ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులంతా ఉత్తీర్ణులయ్యేలా చూడటం దీని ఉద్దేశం. ఎన్నిక లు కూడా ముగియడంతో ఉన్నత పాఠశాలల ఉపా ధ్యాయులు టెన్త్ విద్యార్థులపై శ్రద్ధ పెట్టాలని డీఎస్ ఈ సూచించింది. వెనుకబడ్డ సబ్జెక్టులపై ప్రత్యేక బోధన చేపట్టాలని ఆదేశించింది. వీలైనంత త్వర గా సిల బస్ పూర్తి చేసి, జనవరిలో పునశ్చరణకు వెళ్లాలని పేర్కొంది. లక్ష్యం సాధించిన పాఠశాలల కు అవార్డు లిచ్చే అంశాన్ని కూడా ఉన్నతాధికారులు పరిశీలిస్తు న్నారు. టెన్త్ పరీక్షలు మార్చి, ఏప్రిల్ నెల లో జరుగుతాయి. ప్రైవేటు పాఠశాలలు ఇప్పటికే సిలబస్ పూర్తి చేసి, పరీక్షలకు సన్నద్ధమయ్యాయి. ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలపై మరింత దృష్టి పెట్టాలని అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్లపైనే..: రాష్ట్ర ప్రభుత్వ పాఠశా లలు, స్థానిక సంస్థల పాఠశాలల్లో టెన్త్ ఫలితాలు తక్కువగా నమోదవుతున్నాయి. 2023లో జెడ్పీ పా ఠశాలల నుంచి 1,39,922 మంది టెన్త్ పరీక్షకు హా జరైతే, 1,10,738 మంది మాత్రమే ఉత్తీర్ణుల య్యా రు. అంటే 79.14 శాతం రిజల్ట్ నమోదైంది. ప్రభు త్వ స్కూళ్లలో 21,495 మంది పరీక్ష రాస్తే, 15,561 (72.39 శాతం) మంది పాసయ్యారు. ప్రభుత్వ రెసి డెన్షియల్ స్కూళ్లలో 98 శాతం, గురుకు లాల్లో 95 శాతం ఫలితాలొచ్చాయి. ఇది ప్రైవేటు పాఠశాలక న్నా ఎక్కువ. అయితే ప్రభుత్వ, జెడ్పీ స్కూళ్లల్లో ఫలితాలపై ఈసారి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఆ సబ్జెక్టులపైనే దృష్టి: ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఎక్కు వగా మేథ్స్, సైన్స్, ఇంగ్లిష్ సబ్జెక్టుల్లో ఎక్కువగా ఫెయిల్ అవుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఈ సబ్జెక్టులపై ప్రత్యేక బోధనకు ప్లాన్ చేశారు. టెన్త్ విద్యార్థులకు ఉదయం గంట అదనంగా క్లాసులు తీసుకుంటారు. వారంలో 3 సబ్జెక్టులు రోజుకు ఒకటి చొప్పున చేపట్టాలని నిర్ణయించారు. ఇది కూడా సంబంధిత సబ్జెక్టులో కఠినంగా ఉండే చాప్టర్లను ఎంపిక చేసుకోవాలని పాఠశాలలకు సూచిస్తున్నారు. జనవరి ఆఖరివారం లేదా ఫిబ్రవరి నుంచి సాయంత్రం కూడా అదనంగా మరో గంట ప్రత్యేక బోధన చేపట్టాలని నిర్ణ యించారు. దీనివల్ల టెన్త్లో నూరుశాతం ఉత్తీర్ణత సాధించడం సాధ్యమనేది అధికారుల ఆలోచన. -
కేజీబీవీల్లో ‘పంచతంత్ర’ ప్రణాళిక
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల(కేజీబీవీ)లోని విద్యార్థినులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఈ విద్యా సంవత్సరంలో పదో తరగతి, ఇంటర్మిడియెట్ పబ్లిక్ పరీక్షలు రాసే విద్యార్థినులు నూరు శాతం ఉత్తీర్ణత సాధించడంపై దృష్టి సారించింది. ఈ మేరకు 100 రోజుల ‘పంచతంత్ర’ ప్రణాళికను సిద్ధం చేసింది. ఇందులో ఆయా విద్యాలయాల ప్రిన్సిపాల్స్, టీచర్లతోపాటు డీఈవోలు, ప్రాజెక్టు కో–ఆరి్డనేటర్లు, జీసీడీవోలు, ఎంఈవోలు చేపట్టాల్సిన విధివిధానాలను సమగ్ర శిక్ష ఉన్నతాధికారులు రూపొందించి కేజీబీవీలకు పంపారు. శనివారం నుంచి వచ్చే ఏడాది మార్చి 6వ తేదీ వరకు (100 రోజులు) అనుసరించాల్సిన రోజువారీ ప్రణాళికను పాటించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రతి టీచర్ 15 మంది విద్యార్థులపై శ్రద్ధ పెట్టేలా.. కేజీబీవీల్లో 2022–23 విద్యా సంవత్సరం పబ్లిక్ పరీక్షల ఫలితాల్లో రాష్ట్ర సగటు కంటే తక్కువ ఉత్తీర్ణత నమోదైంది. పదో తరగతిలో 67 శాతం, ఇంటర్మిడియెట్ మొదటి సంవత్సరం విద్యార్థులు 59.37 శాతం, రెండో సంవత్సరం విద్యార్థులు 41.84 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ ఫలితాలు పునరావృతం కాకుండా ఉండేందుకు విద్యాశాఖ వందరోజుల ప్రణాళికను అమలు చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలోని 352 కేజీబీవీల్లో పదో తరగతి విద్యార్థులు 13,217 మంది, ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు 9,654 మంది, రెండో ఏడాది విద్యార్థులు 8,093 మంది, మొత్తం 3,0964 మంది ఉన్నారు. వీరందరూ ఉత్తీర్ణులయ్యేలా పాఠ్యాంశాల వారీగా యాక్షన్ ప్లాన్ను తయారు చేశారు. ఇందులో స్టడీ ప్లానింగ్, వారాంతపు పరీక్షలు, చదువులో వెనుకబడినవారిపై ప్రత్యేక శ్రద్ధ, ఉన్నతాధికారుల పర్యవేక్షణ, ఉపాధ్యాయులు–తల్లిదండ్రుల సమావేశాలు కీలకంగా ఉన్నాయి. ప్రతి టీచర్ 15 మంది విద్యార్థినులపై వ్యక్తిగత పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఈసారి ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థినులకు రూ.5 వేలు, నూరు శాతం ఫలితాలు సాధించిన విద్యాలయాలకు రూ.50 వేల నగదు బహుమతి ఇస్తామని సమగ్ర శిక్ష ప్రకటించింది. ఉపాధ్యాయుల కొరత ఉన్న విద్యాలయాల్లో గెస్ట్ ఫ్యాకల్టీని నియమంచాలని ఇప్పటికే సమగ్ర శిక్ష ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. కాగా, వచ్చే నెలాఖరు నాటికి విద్యార్థినులకు డబుల్ బంకర్ బెడ్లు అందించనున్నారు. ఉత్తమ ఫలితాలకు పురస్కారం గత ఏడాది ఫలితాలు ఈసారి పునరావృతం కాకుండా చర్యలు తీసుకున్నాం. పది, ఇంటర్మిడియెట్ పరీక్షలు రాసే విద్యార్థినులు, ఉపాధ్యాయులపై ఈ వందరోజులు రాష్ట్ర స్థాయిలో అధికారులు పూర్తిస్థాయిలో దృష్టి పెడతారు. అన్ని సబ్జెక్టులను కవర్ చేస్తూ రోజువారీ స్టడీ ప్లాన్, టైం టేబుల్ ఇచ్చాం. వెనుకబడిన విద్యార్థినులు ఉత్తీర్ణత సాధించేందుకు ప్రత్యేక స్టడీ మెటీరియల్ను కూడా ఇస్తాం. ఇంటర్లో బాగా చదివేవారి కోసం ప్రత్యేక స్టడీ మెటీరియల్ను ఇస్తాం. వారు నీట్, జేఈఈ మెయిన్స్ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలు రాసేందుకు వీలుగా శిక్షణ ఉంటుంది. – డి.మధుసూదనరావు, కేజీబీవీ కార్యదర్శి -
చకచకా డిజిటలైజేషన్
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. విద్యార్థిపై చేసే ఖర్చు భవిష్యత్ పెట్టుబడిగా భావించి, అన్ని సదుపాయాలను అందిస్తోంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు ఇప్పటికే 30,715 ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లు (ఐఎఫ్పీ)లు అందించగా, ఈ డిసెంబర్లో ఇచ్చే 32 వేల స్క్రీన్లతో కలిపి మొత్తం 63 వేలు అందుబాటులోకి రానున్నాయి. స్మార్ట్ టీవీలు 33 వేలకు చేరడంతో పాటు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోను డిజిటలైజేషన్ పూర్తవుతుంది. మరోపక్క ట్యాబ్స్ పంపిణీ 10 లక్షలకు పైగా చేరుకుంటుంది. దీంతో దేశంలోనే ప్రభుత్వ విద్యలో పూర్తిస్థాయి డిజిటల్ టెక్నాలజీని అనుసరించే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలవనుంది. అన్ని ఉన్నత పాఠశాలల్లో ఐఎఫ్పీలు, ప్రాథమిక పాఠశాలలకు స్మార్ట్ టీవీల అమరిక డిసెంబర్ 21 నాటికి పూర్తి కానుంది. ఈమేరకు పాఠశాల విద్యాశాఖలోని నాడు–నేడు కమిషనరేట్ అధికారులు ప్రణాళికసిద్ధం చేశారు. ఈ ఏడాది ప్రారంభంలో 4,800 ఉన్నత పాఠశాలల్లో ఆరు నుంచి 10వ తరగతి వరకు సెక్షన్కు ఒకటి చొప్పున 30,715 ఐఎఫ్పీ స్క్రీన్లను అందుబాటులోకి తెచ్చి డిజిటల్ బోధన చేపట్టారు. ప్రాథమిక పాఠశాలల్లో 60 మంది విద్యార్థులకు ఒక స్మార్ట్ టీవీ చొప్పున 10,038 స్మార్ట్ టీవీలను సరఫరా చేసిన విషయం తెలిసిందే. రెండో దఫాలో 32 వేల ఐఎఫ్పీలు, 22 వేల స్మార్ట్ టీవీలను పాఠశాలలకు అందించనుంది. -
టోఫెల్ తర్ఫీదుకు కీలక అడుగు!
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులను ‘టోఫెల్ సర్టిఫికేషన్’కు సన్నద్ధం చేయడంలో భాగంగా ‘లిక్విడ్ ఇంగ్లిష్ ఎడ్జ్ ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ విద్యా సంవత్సరానికి టోఫెల్ శిక్షణకు అవసరమైన సాఫ్ట్వేర్, ఈ–కంటెంట్ను ఉచితంగా అందించడంతో పాటు, ఉపాధ్యాయులు, అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ప్రకాశ్ శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. ఇప్పటికే మూడో తరగతి నుంచి తొమ్మిది వరకు ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు రోజుకు గంట పాటు టోఫెల్ శిక్షణ ప్రారంభించినట్టు తెలిపారు. విద్యార్థుల్లో లిజనింగ్, స్పీకింగ్ నైపుణ్యాల పెంపు, వివిధ దేశాల్లో ఇంగ్లిషు మాట్లాడే తీరును అర్థం చేసుకుని.. తిరిగి జవాబు ఇచ్చేలా తర్ఫీదు ఇస్తున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగానే ఎస్సీఈఆర్టీ ద్వారా మెటీరియల్ తయారు చేశామన్నారు. అయితే అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రొఫెషనల్ ఏజెన్సీ మెటీరియల్ అవసరాన్ని గుర్తించి లిక్విడ్ ఇంగ్లిష్ ఎడ్జ్తో ఒప్పందం చేసుకున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులే ఎక్కువగా ఉండటంతో వారిని దృష్టిలో పెట్టుకుని లిక్విడ్ సంస్థ ఉచితంగా మెటీరియల్ ఇచ్చేందుకు ముందుకొచ్చిందన్నారు. ఈ ప్రాజెక్టుకు సమగ్ర శిక్ష పీడీ నోడల్ అధికారిగా వ్యవహరిస్తారని తెలిపారు. వాస్తవానికి టోఫెల్ సర్టిఫికేషన్ కోసం ఎడ్యుకేషన్ టెస్టింగ్ సర్విసెస్(ఈటీఎస్)తో ప్రభుత్వం ఒప్పందం చేసుకోగా.. విద్యార్థులను టోఫెల్ పరీక్ష కోసం సిద్ధం చేస్తున్నామన్నారు. అయితే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సంస్థల నుంచి టెండర్లు పిలిచినా.. శిక్షణ ప్రక్రియ ప్రారంభించేందుకు సమయం లేదన్నారు. అందుకే ప్రస్తుత విద్యా సంవత్సరానికి మాత్రమే లిక్విడ్ ఇచ్చే కంటెంట్ వినియోగించుకునేలా ఒప్పందం చేసుకున్నట్టు వివరించారు. వచ్చే ఏడాది టెండర్లు పిలిచి కంటెంట్ ఖరారు చేస్తామని వివరించారు. తరగతి గదుల డిజిటలైజేషన్ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చిందని ప్రవీణ్ప్రకాశ్ చెప్పారు. ఇందులో భాగంగానే 45 వేల ప్రభుత్వ పాఠశాలల్లో 41 లక్షల మంది ఆంగ్ల మాధ్యమం అభ్యసిస్తున్నట్టు చెప్పారు. దేశంలో తొలిసారిగా సైన్స్, సోషల్ సైన్స్, గణితం సబ్జెక్టుల్లో ద్విభాషా పాఠ్యపుస్తకాలను తీసుకొచ్చినట్టు తెలిపారు. విద్యార్థుల్లో అభ్యాసన సామర్థ్యం పెంపొందించడంలో భాగంగా బైజూస్ ద్వారా ఉత్తమ కంటెంట్ అందిస్తోందన్నారు. ఎనిమిదో తరగతి విద్యార్థులు, ఉపాధ్యాయులకు బైజూస్ కంటెంట్ను ఇన్స్టాల్ చేసి 5.18 లక్షల ట్యాబ్లను పంపిణీ చేసిందని వెల్లడించారు. నాడు–నేడులో భాగంగా పాఠశాలల్లో 30,213 ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్(ఐఎఫ్పీ), ప్రాథమిక పాఠశాలల్లో 10,038 స్మార్ట్ టీవీలతో తరగతి గదులను డిజిటలైజ్ చేసిందని చెప్పారు. డిసెంబర్ నాటికి మొత్తం తరగతి గదుల్లో హైస్పీడ్ ఇంటర్నెట్తో డిజిటల్ బోధనలు ప్రవేశపెడతామని వివరించారు. అంతర్జాతీయంగా గుర్తింపు నోయిడాకు చెందిన లిక్విడ్ ఇంగ్లిష్ ఎడ్జ్.. కామన్ యూరోపియన్ ఫ్రేమ్ వర్క్ ఆఫ్ రిఫరెన్స్(సీఇఎఫ్ఆర్)తో పాటు బ్రిటీష్ కౌన్సిల్, పియర్సన్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రెస్, మాక్మిలన్, ఆదిత్య బిర్లా ఫౌండేషన్, పబ్లిషింగ్ కంపెనీలకు విశ్వసనీయ సేవలందిస్తోంది. విద్యార్థుల తరగతి, వయస్సును బట్టి ఈ కంటెంట్ను తయారు చేసి అందిస్తోంది. కెయిర్న్ ఇండియా, అలహాబాద్ యూనివర్సిటీ, ఫెయిర్ అండ్ లవ్లీ ఫౌండేషన్, ఫ్రాంక్ఫిన్, గ్లోబల్ లాజిక్, ఇండియన్ మిలిటరీ అకాడమీ, జెట్కింగ్, ఒడిశా మోడల్ ట్రైబల్ ఎడ్యుకేషనల్ సొసైటీ వంటి అనేక మందికి సేవలందిస్తోంది. -
మరిన్ని స్కూళ్లు ‘డిజిటల్’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రతి విద్యార్థికీ అత్యున్నత స్థాయి విద్య అందించాలని, వారు అంతర్జాతీయ స్థాయికి ఎదిగేలా తీర్చిదిద్దాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకాంక్ష. అందుకు అనుగుణంగా సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రాష్ట్రంలో విద్యా రంగంలో పలు సంస్కరణలు తెచ్చారు. పేద విద్యార్థులకు కూడా కార్పొరేట్ స్కూళ్లలో మాదిరిగా అత్యాధునిక పద్ధతుల్లో బోధన, వసతులు ఉండాలనే సంకల్పంతో ప్రభుత్వ పాఠశాలల్లో సమూల మార్పులు తెస్తున్నారు. ఇందుకోసం గత నాలుగున్నరేళ్లలో రూ. 66 వేల కోట్లకు పైగా ఖర్చు చేశారు. ‘నాడు – నేడు’ కార్యక్రమం ద్వారా పాఠశాలలకు నూతన భవనాల నిర్మాణంతోపాటు అత్యాధునిక బోధన పద్ధతులను ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో పాఠశాల విద్యను పూర్తిగా డిజిటలైజేషన్ చేస్తున్నారు. ఇందుకోసం ప్రాథమిక పాఠశాలల్లో స్మార్ట్ టీవీలు, ఉన్నత పాఠశాలల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లు (ఐఎఫ్పీలు) ఏర్పాటు చేస్తున్నారు. డిసెంబర్ నాటికి అన్ని ఉన్నత పాఠశాలల్లో మరో 32 వేల ఐఎఫ్పీ స్క్రీన్లు, ప్రాథమిక పాఠశాలల్లో 23 వేల స్మార్ట్ టీవీలు అందించనున్నారు. సామాన్యుల పిల్లలు చదువుకునే ప్రభుత్వ బడుల్లో అత్యాధునిక సాంకేతికతతో కూడిన బోధనను ఈ (2023–24) విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్రంలో పాఠశాల విద్యను దేశంలోనే అతి పెద్ద డిజిటల్ ప్లాట్ఫారంగా మారుస్తోంది. తొలివిడత నాడు–నేడులో ఆధునీకరించిన పాఠశాలల్లో నూతన తరగతి గదులు, డబుల్ డెస్క్ బెంచీలు, ద్విభాషా పాఠ్య పుస్తకాలతో పాటు కార్పొరేట్ పిల్లలకు మాత్రమే సాధ్యమైన బైజూస్ కంటెంట్ ఉన్న ట్యాబ్లను వైఎస్ జగన్ ప్రభుత్వం ఉచితంగా అందించింది. అనంతరం అమెరికా వంటి అగ్ర దేశాల్లో మాత్రమే విద్యా బోధనకు వినియోగించే అత్యాధునిక టెక్నాలజీ గల ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్ల ను, స్మార్ట్ టీవీలను 11,315 పాఠశాలల్లో ఈ ఏడాది జూన్ నెలలోనే అందుబాటులోకి తెచ్చింది. 4,800 ఉన్నత పాఠశాలల్లో 30,715 ఐఎఫ్పీ స్క్రీన్లను ఏర్పాటు చేయగా, 6,515 ప్రాథమిక పాఠశాలల్లో 10,038 స్మార్ట్ టీవీలను ఏర్పాటు చేసింది. ఈ డిసెంబరు మొదటి వారానికి మరో 32 వేల ఐఎఫ్పీలను హైస్కూళ్లకు అందించనుంది. గతంలో పాఠశాలలకు సరఫరా చేసిన ఐఎఫ్పీలనే ఇప్పుడూ తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఈమేరకు అధికారులు టెండర్ ప్రక్రియ ప్రారంభించారు. ప్రాథమిక పాఠశాలల్లో ఏర్పాటు చేసే 23 వేల స్మార్ట్ టీవీల టెండర్ల జ్యుడిíÙయల్ ప్రివ్యూ పూర్తయింది. ఈ టెండర్లను ఖరారు చేసి వచ్చే నెలలోనే స్మార్ట్ టీవీల పంపిణీ ప్రారంభించనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయితే దేశంలో పాఠశాల విద్యను పూర్తిస్థాయిలో డిజిటలైజేషన్ చేసిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలవనుంది. ఈ ఏడాది టోఫెల్ కూడా ప్రవేశపెట్టడం, స్మార్ట్ టీవీలు, ఐఎఫ్పీల ద్వారా బోధన వల్ల కలిగే మంచి ఫలితాలు ఇటీవల ముగిసిన ఫార్మాటివ్ అసెస్మెంట్ 1, 2 పరీక్షల్లో కనపడటంతో అన్ని పాఠశాలల్లో కొత్త ఐఎఫ్పీలు, స్మార్ట్ టీవీలు ఏర్పాటు చేస్తున్నారు. ఐఎఫ్పీలతో అత్యాధునిక పద్ధతిలో బోధన ఐఎఫ్పీలు అత్యాధునిక బోధనకు ప్రతీకగా నిలుస్తాయి. 165 సెంటీమీటర్ల వైశాల్యం ఉండే ఈ స్క్రీన్లపై ఓ పక్క వీడియోలో బోధన చేస్తూనే.., మరోపక్క విద్యారి్థకి అర్థం కాని అంశాలను ఉపాధ్యాయులు బోర్డు మీద రాసి చూపించవచ్చు. అవసరమనుకుంటే అదే అంశాన్ని ప్రింట్ తీసుకోవచ్చు. మొత్తం పాఠాన్ని లింక్ రూపంలో ఆన్లైన్లో పెట్టొచ్చు. అంటే ఒకే బోర్డుపై అనేక విధాలుగా బోధన (మల్టీ టాస్కింగ్) చేయొచ్చు. ఈ ఐఎఫ్పీ ప్యానెళ్లలో పాఠ్యాంశాలు, బైజూస్ కంటెంట్ను తెలుగు, ఇంగ్లిష్, హిందీతో పాటు మొత్తం ఏడు భాషల్లో అందిస్తారు. గూగుల్ అసిస్టెంట్తో వచ్చే ఈ ఇంటరాక్టివ్ స్మార్ట్ ప్యానెళ్లు 6 నుంచి 10వ తరగతి వరకు సెక్షన్కు ఒకటి చొప్పున ఏర్పాటు చేస్తున్నారు. తొలివిడత ఐఎఫ్పీ స్క్రీన్లు ఏర్పాటుచేసిన పాఠశాలల్లో విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించినట్టు గుర్తించారు.
Pagination
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
బరితెగించిన టీడీపీ నేతలు
పేదల ఊసు పెద్దలకు పట్టదా?
Lok Sabha Election 2024: ప్రజలే నా వారసులు
జనస్వామ్యమా! జయీభవ!!
వరుసగా ఐదోసారి ‘అమ్మఒడి’
ఢిల్లీలో మళ్లీ బాంబు బెదిరింపు కలకలం
పీఓకేలో తీవ్ర ఘర్షణలు
Lok Sabha Election 2024: ఆమ్ ఆద్మీకి 10 గ్యారంటీలు
రెండ్రోజులు వానలు
అవినీతి సొమ్ముకు హెరిటేజ్ ముసుగు
తప్పక చదవండి
- బడుగు, బలహీనవర్గాల అధికారులపైనే పచ్చకుట్ర
- బడుగు, బలహీనవర్గాల అధికారులపైనే పచ్చకుట్ర
- ఈసీ ద్వంద్వ వైఖరి
- Lok Sabha Election 2024: ప్రజలే నా వారసులు
- మంత్రి బొత్సపై చంద్రబాబు కొత్త కుట్ర
- వైఎస్ విజయమ్మ పేరుతో టీడీపీ తప్పుడు లేఖ
- ఐరాస కాంక్షించే అభివృద్ధికి ఏపీయే వేదిక
- పేదింటి పిల్లలకు వర్సిటీ చదువులు ఉచితం
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
- జగన్ ఒక నిజం... ఒక భావోద్వేగం
Advertisement