కాగజ్నగర్ : కాగజ్నగర్ మున్సిపాలిటీ కాంట్రాక్టు పారిశుధ్య కార్మికులు, ఎన్ఎంఆర్ కార్మికులు బుధవారం వేతనాలు చెల్లించాలని కోరుతూ ఆందోళనకు దిగారు. మున్సిపల్ చైర్పర్సన్, కమిషనర్ చాంబర్ల ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ అనుబంధం) అధ్యక్షుడు సంజీవ్ మాట్లాడుతూ 7 నెలల నుంచి కాంట్రాక్టు పారిశుధ్య కార్మికులకు వేతనాలు అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు.
ప్రతి రోజూ పట్టణంలోని పలు వార్డుల్లో చెత్తా చెదారాన్ని తొలగిస్తూ, పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్న తమను అధికారులు జీతాలు ఇవ్వకుండా నానా ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా వేతనాలు చెల్లించి ఆదుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కార్మికులు రమేశ్, వెంకటేశ్, శంకర్, సాంబయ్య, అశోక్ తదితరులు పాల్గొన్నారు.