భార్యపై హత్యాయత్నం | Sakshi
Sakshi News home page

భార్యపై హత్యాయత్నం

Published Mon, May 8 2017 11:50 PM

Murder of a wife

  • స్థానికుల అడ్డగింపుతో తప్పిన ప్రమాదం
  • పాతగుంతకల్లు(గుంతకల్లు): భార్యపై అనుమానం వికృత రూపం దాల్చింది. తాళి కట్టిన భార్యతోపాటు కడుపున పుట్టిన పిల్లలను రోడ్డుకు ఈడ్చే దుస్సాహసం చేసింది. చివరకు భార్య ఒంటికి నిప్పంటించి హత్య చేసేందుకు పూనుకున్నాడు. ఈ దుశ్చర్యను స్థానికులు అడ్డుకున్నారు.  వివరాలు.. పాతగుంతకల్లుకు చెందిన వసికేరప్ప (దివ్యాంగుడు)కు కణేకల్లు మండలం మాల్యం గ్రామానికి చెందిన మంజులతో ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులున్నారు.

    అయితే మూడేళ్ల నుంచి ఆమెపై అనుమానం పెంచుకున్న అతడు రోజూ చితకబాదేవాడు. పెట్రోల్‌ బంకులో పని కూడా మానేసి వసికేరప్ప ఇంటి వద్దనే కాలక్షేపం చేసేవాడు. అయినా మంజుల సర్దుకుపోతూనే సంసారం సాగిస్తుండేది. ఈనేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో భార్యతో గొడవకు దిగాడు. ఇంట్లో నుంచి బయటికి వెళ్లాలంటూ చితకబాదాడు. భార్య మంజుల, పిల్లలు జీవన్‌కుమార్, దయానిధిని రోడ్డుపైకి నెట్టేశాడు. ఆమె ఇంట్లోకి వచ్చేందుకు ప్రయత్నించగా కోపోద్రిక్తుడైన అతడు కిరోసిన్‌ చల్లి నిప్పంటించే యత్నం చేశాడు. గుర్తించిన స్థానికులు అడ్డుకుని అతడిని మందలించారు.అతడు  ఇంటికి తాళాలు వేసుకుని తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయాడు. మంజుల పిల్లలతో కలిసి ఇంటి వద్దనే కూర్చుండి పోయింది. ఈ ఘటనపై స్థానికులు టూటౌన్‌ పోలీసులకు సమాచారమందించారు. సంఘటన స్థలికి చేరిన పోలీసులు విచారణ చేపట్టారు.

Advertisement
Advertisement