- మృతదేహంతో భర్త ఇంటి ముందు బంధువుల
- ఆందోళన ఇరువర్గాల ఘర్షణ
- వావిలేరులో ఉద్రిక్తత
చేజర్ల : తమ కుమార్తెను అల్లుడు దారుణంగా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని మృతురాలి బంధువులు శనివారం మృతదేహంతో భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగిన సంఘటన చేజర్ల మండలం వావిలేరులో చోటు చేసుకుంది. మృతురాలి బంధువుల కథనం మేరకు.. కలువాయి మండలం తోపుగుంటకు చెందిన రసూల్సాహెబ్, షాదాబీ కుమార్తె మస్తానమ్మ(23)ను బాగా కట్నకానుకలు ఇచ్చి చేజర్ల మండలం వావిలేరుకు చెందిన ఖాదర్బాషా, మస్తానమ్మ కుమారుడు ఎస్కే సుభానికి ఇచ్చి మూడున్నరేళ్ల క్రితం వివాహం చేశారు. సుభాని రెండేళ్ల నుంచి ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం కె.బిట్రగుంటలో ప్రముఖ కన్స్ట్రక్షన్ సంస్థ బీసీపీఎల్లో డ్రైవర్గా పని చేస్తున్నాడు. సుభాని అదే ప్రాంతంలో మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని మస్తానమ్మకు పిల్లలు పుట్టలేదని తరచూ గొడవ చేసేవాడని తెలిపారు. ఏదో విధంగా ఆమెను అడ్డు తొలగించుకోవాలని పక్కా ప్రణాళికతో 27వ తేదీ బుధవారం రాత్రి 11 గంటలకు హత్య చేశాడని, హత్యను ఆత్మహత్యలా చిత్రీకరించడానికి తమకు మరుసటి రోజు మధ్యాహ్నం ఫోన్ చేసుకుని మస్తానమ్మ ఉరేసుకుందని సమాచారం ఇచ్చారని తెలిపారు. విషయం తెలుసుకుని అక్కడకు చేరుకున్న తాము మృతదేహాన్ని పరిశీలించగా హత్యగా ఉందని అనుమానం రావడంతో ప్రకాశం జిల్లా జరుగుమల్లి పోలీస్స్టేçÙన్లో ఫిర్యాదు చేశామన్నారు.
వావిలేరులో ఉద్రిక్తత : పోస్టుమాస్టరం అనంతరం మస్తానమ్మ మృతదేహాన్ని తీసుకుని బంధువులు భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగాడు. మాటా మాటా పెరిగి ఇరువర్గాలు ఘర్షణకు దిగడంతో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఒకరిపై ఒకరు పరస్పరం దాడులకు దిగడంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. గాయపడిన వారిని చేజర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.