గోల్‌ కొట్టారు | Sakshi
Sakshi News home page

గోల్‌ కొట్టారు

Published Tue, Sep 5 2017 8:19 AM

గోల్‌ కొట్టారు - Sakshi

క్రమశిక్షణ.. శ్రమ ఫలం
ఎస్సైలుగా ఎంపికైన పేదింటి బిడ్డలు
ఆనందంలో తల్లిదండ్రులు  


విద్యార్థి దశలోనే లక్ష్యాన్ని ఎంచుకున్నారు.  లక్ష్యం గట్టిదైతే అందుకు తగ్గ శ్రమ అలా ఉండాల్సిందే. ‘నీ లక్ష్యం ఏంటో చెప్పు నీవెలా కష్టపడాలో చెబుతా’అన్న నానుడితో ముందడుగు వేశారు. ఒకే దృష్టి.. ఒకే ధ్వాసతో అనుకున్న లక్ష్యాన్ని సాధించారు.. ఎన్ని అడ్డంకులు ఎదురైనా లక్ష్యా న్ని సైతం మరవలేదు. వారు ఎస్సైలుగా ఎంపికై అటు తల్లిదండ్రులు, స్నేహితులకు పుట్టెడు ఆనందాన్ని తెచ్చిపెట్టారు.

నిలువ నీడలేని కుటుంబం నుంచి..
తల్లిదండ్రుల కష్టాలు తీరుస్తా : సురేష్‌  
ధరూరు: నిరుపేద కుటుంబానికి చెందిన సురేష్‌ ఎస్‌ఐగా ఎంపికయ్యాడు. మండలంలోని అల్వాలపాడుకు చెందిన రైతు కుటుంబానికి చెందిన సవారప్ప, మాణిక్యమ్మ దంపతుల కుమారుడు సురేష్‌ నాలుగు నెలల క్రితం సివిల్‌ కానిస్టేబుల్‌గా ఎంపికై హైదరాబాద్‌లోని అంబర్‌పేట పోలీస్‌ ట్రైనింగ్‌ కేంద్రంలో శిక్షణ పొందుతున్నారు. మరో ఐదునెలలు గడిస్తే పోలీస్‌స్టేషన్‌లో విధులు చేపట్టాల్సిన సమయంలోనే ఎస్‌ఐ ఫలితాలు రావడంతో అందులో ఉత్తీర్ణత సాధించాడు.

సురేష్‌కు అన్నయ్య అమరేష్‌తో పాటు ఒక చెల్లి ఉన్నారు. నాలుగెకరాల వ్యవసాయ పొలం ఉంది. సీడ్‌పత్తి, మరో రెండెకరాల్లో వరిపంటను సాగు చేస్తూ తల్లిదండ్రులు, అన్నయ్యలు సురేష్‌ను చదివిస్తూ వచ్చారు. ప్రాథమిక స్థాయి నుంచి విద్యాభ్యాసం అంతా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లోనే సాగింది. డిగ్రీని పూర్తి చేసి హైదరాబాద్‌లో ఎంసీఏ చేస్తూనే పోటీ పరీక్షలకు హాజరయ్యాడు. క్రిందిస్థాయిలో ఉద్యోగాలు చేపడితే అక్కడితోనే ఆగిపోతామని, ఉన్నత స్థాయిలో ఉండి నలుగురికి ఉపయోగపడతానన్నారు.

చికన్‌ సెంటర్‌ ఆధారంతో..
ఎస్‌ఐగా ఎంపికైన  అబ్దుల్‌ ఖాదర్‌

దేవరకద్ర: పట్టణంలో చికెన్‌ సెంటర్‌ను నడుపుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్న ఎమ్‌డి. హాసన్‌ పెద్ద కుమారుడు ఎమ్‌డి.అబ్దుల్‌ ఖాదర్‌ ఎస్‌ఐ ఎస్‌ఐగా ఎంపికయ్యాడు. మండలంలోని మీనుగోనిపల్లి గ్రామానికి చెందిన హసన్‌ ఆయన భార్య అమినాబేగంలో దేవరకద్రలో నివాసం ఉంటున్నారు. వారికి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. తాను కష్టపడుతూ కొడుకులను ఉన్నత స్థాయికి తీసుకురావడానికి చేసిన కృషి ఫలితంగానే పెద్దకొడుకు ఎస్‌ఐగా ఎంపిక కావడంతో ఆ ఇంట్లో ఆనందాలు మిన్నంటాయి.   

దేవరకద్ర నుంచే చదువుకు శ్రీకారం...
అబ్దుల్‌ ఖాదర్‌ దేవరకద్రలోని శ్రీవాణీ శిశుమందిర్‌ పాఠశాలలో 1 నుంచి 5 వ తరగతి వరకు చదివాడు. తరువాత 6, 7 తరగతులు కాకతీయ ఉన్నత పాఠశాల, 8 నుంచి 10 వరకు జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర ఉన్నత పాఠశాలలో చదివాడు. తరువాత శ్రీచైతన్య కళాశాల హైదరాబాద్‌లో ఇంటర్‌లో ఎంపీసీ చేసిన తరువాత మహబూబ్‌నగర్‌ సమీపంలోని జేపీఎన్‌సీలో 2013లో ఈసీఈ ఇంజనీరింగ్‌ పూర్తి చేశాడు. తరువాత ఏడాదిన్నర పాటు ప్రైవేట్‌లో ఉద్యోగం చేసిన దాన్ని వదిలి వేసి ప్రభుత్వ ఉద్యోగం కోసం చేసిన ప్రయత్నంలో ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాల కోసం పరీక్షలు రాశాడు.   

రైతు నుంచి..
నాగర్‌కర్నూల్‌ క్రైం: నాగర్‌కర్నూల్‌ మండల పరిధిలోని తూడుకుర్తి గ్రామానికి చెందిన చింతలపల్లి కృష్ణయ్య, పార్వతమ్మలకు ఇద్దరు సంతానం. శ్రీకాంత్‌ రెండో కుమారుడు. వీరికున్న నాలుగెకరాల్లో సాగుచేస్తూ ఇద్దరు కుమారులను చదివించారు. మొదటి కుమారుడు రాజశేఖర్‌ ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా శ్రీకాంత్‌ ఓ అడుగు ముందుకేసి బీటెక్, ఎంబీఏ పూర్తి చేశాడు. ప్రభుత్వ ఉద్యోగం లక్ష్యంగా హైదరాబాద్‌లోనే ఉంటూ చదువుకున్నాడు. ట్యూషన్‌ చెబుతూనే ఖర్చులకు సంపాదించుకున్న శ్రీకాంత్‌ కష్టమేంటో తెలుసుకున్నాడు.   
 
చదువు ఉచితం.. ఉన్నత ఉద్యోగం
నారాయణపేట రూరల్‌: నిరుపేద కుటుంబంలో పుట్టిన చదువుకోడానికి పైసా ఖర్చు పెట్టలేదు.. ప్రతిభ ఆధారంగా ఉచితంగానే విద్యాభ్యాసం చేసి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాడు అరుణ్‌కుమార్‌. నారాయణపేట మండలం జాజాపూర్‌కు చెందిన మంగలి నారాయణ వృత్తి రిత్యా గ్రామంలో హేయిర్‌ కటింగ్‌ దుకాణం నడుపుతుంటాడు. భార్య లక్ష్మి నిరక్షరాస్యురాలు. ముగ్గురు సంతానం కాగా వారిలో చిన్నబ్బాయి రాజేష్‌ టీటీసీ పూర్తిచేయగా, రెండవ వ్యక్తి ప్రకాష్‌ బీటెక్‌ చదువుకున్నాడు. అందరికన్న పెద్ద కుమారుడు అరుణ్‌కుమార్‌ ఎస్‌ఐ ఉద్యోగం సాధించాడు. మొదట కానిస్టెబుల్‌ ఎంపికైన అరుణ్‌ ఎస్‌ఐలో 369 మార్కులతో సీటు సంపాదించాడు.

Advertisement
Advertisement