ఫలించిన పోతురాజు పోరాటం | Sakshi
Sakshi News home page

ఫలించిన పోతురాజు పోరాటం

Published Sat, Oct 8 2016 12:43 AM

ఫలించిన పోతురాజు పోరాటం - Sakshi

– సాగుభూమిని రిజిస్టర్‌ చేసే విధంగా కలెక్టర్‌ ఆదేశాలు
– దాడి చేసిన వారిపై అట్రాసిటీ కేసు
కర్నూలు (హాస్పిటల్‌)/రుద్రవరం: తమ కుటుంబం 80 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూమిని ఇతరులు ఆక్రమించుకోవడాన్ని నిరసిస్తూ పోతురాజు చేసిన పోరాటం ఫలించింది. సాగుభూమిని బాధితుని కుటుంబానికి రిజిస్టర్‌ చేయాలని జిల్లా కలెక్టర్‌ విజయమోహన్‌ రుద్రవరం తహసీల్దార్‌ను​ఆదేశించారు. తన భూమిని తనకు ఇప్పించాలంటూ దళిత రైతు కిరణ్‌ బుధవారం సాయంత్రం కలెక్టరేట్‌లో క్రిమసంహారక మందుతాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంగతి విదితమే. ఈ విషయమై జాతీయ ఎస్‌సీ కమిషన్‌ తీవ్ర ఆగ్రహం చేసింది. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని జిల్లా అధికారులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌ సీహెచ్‌ విజయమోహన్, జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణతో కలిసి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పోతురాజు కిరణ్‌ను పరామర్శించారు. ఆలమూరులో దాడికి సంబంధించిన ఉదంతాన్ని కలెక్టర్, ఎస్పీ అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి తక్షణ ఖర్చుల నిమిత్తం రూ.10వేలు చెల్లించాలని ఆర్‌డీఓ రఘుబాబును కలెక్టర్‌ ఆదేశించారు.  ప్రస్తుతం వారు సాగు చేసుకుంటున్న భూమిని వారికే చెందేటట్లు రిజిస్టర్‌ చేయాలని చెప్పారు. కిరణ్‌పై దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని జిల్లా ఎస్పీకి సూచించారు.  
 

Advertisement
Advertisement