జగన్పై పాట రాసిన బీటెక్ విద్యార్థి రాజేష్
సఖినేటిపల్లి (రాజోలు) :
వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్ల అభిమానాన్ని చాటుకుంటూ స్థానిక మూడు తూములు సెంటర్కు చెందిన బీటెక్ విద్యార్థి జంగిల్ రాజేష్ కంపోజ్ చేసిన పాట (రాజువై... నువ్వు రావయ్యా) కేసెట్ను శనివారం రాత్రి ఆ పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ బొంతు రాజేశ్వరరావు విడుదల చేశారు. ఈ కేసెట్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భారీ స్క్రీన్పై ఆయన లాంచ్ చేశారు. పాటకు అనుగుణంగా రూపొందించిన జగన్మోహన్రెడ్డి రాష్ట్ర పర్యటన క్లిప్పింగ్లు, ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో ఆయన మాట్లాడుతున్న క్లిప్పింగ్లను స్క్రీన్పై ప్రదర్శిస్తున్న సమయంలో యువత కేరింతలు కొట్టింది. తొలుత పార్టీ నాయకులు జంపన రామకృష్ణంరాజు అద్యక్షతన నిర్వహించి సమావేశంలో రాజేశ్వరరావు మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డి సారథ్యంలో యువతకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. విద్యావంతులైన యువకులను రాష్ట్రంలోని ప్రభుత్వం రోడ్లుపైకి నెట్టిందని, వారి నిరుద్యోగ సమస్యను పట్టించుకున్న దాఖలాలు లేవని ధ్వజమెత్తారు. విద్యార్థి జంగిల్ రాజేష్ మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డి అంటే ఎంతో అభిమానమని, అందుకే ఆయనపై రాసిన పాటను చెన్నైలో కంపోజ్ చేయించినట్టు చెప్పారు. పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రతినిధి నల్లి డేవిడ్, మామిడికుదురు మండల శాఖ అధ్యక్షుడు బొలిశెట్టి భగవాన్, ఎంపీటీసీ సభ్యురాలు గొల్లమందల జ్యోతి, నాయకులు నల్లి ప్రేమానందం, గొల్లమందల చిట్టిబాబు, మోకా ఏసురాజు, కుసుమ జానకి, మైఖేల్, రాకేష్, బంగారి, జీ శ్రీనివాస్ యాదవ్, వీరా పెద్దిరాజు పాల్గొన్నారు.