పెళ్లి పీటలెక్కకముందే.. | Sakshi
Sakshi News home page

పెళ్లి పీటలెక్కకముందే..

Published Mon, Jul 3 2017 10:43 AM

పెళ్లి పీటలెక్కకముందే.. - Sakshi

► రోడ్డుప్రమాదంలో యువకుడి మృతి
► త్రిపురారం మండలం
► అప్పలమ్మగూడెంలో విషాదం


త్రిపురారం(నాగార్జునసాగర్‌)/నేరేడుచర్ల(హుజూర్‌నగర్‌): బాజాభజంత్రీలు మోగాల్సిన పెళ్లి ఇంట్లో చావు డప్పులు మోగాయి. మరికొద్ది గంటలలో పెళ్లి కుమారుడి వివాహం కావాల్సిన తరుణంలో అతడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషాద ఘటన మండలంలోని అప్పలమ్మగూడెంలో చోటు చేసుకుంది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గంధం లింగయ్య, లక్ష్మమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వీరిది రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద కుటుంబం. గంధం లింగయ్య రెండేళ్ల క్రితం తన ఇద్దరి కుమార్తెల వివాహం జరిపించారు.

లింగయ్యకు ఒక్కగానొక్క కుమారుడైన గంధం నరేష్‌(27)కు సూర్యాపేట జిల్లా పాలకీడు మండలంలోని రావిపహాడ్‌ గ్రామానికి చెందిన ఓ అమ్మాయితో ఈనెల 3న వివాహం చేయడానికి నిశ్చయించారు. సోమవారం పెళ్లి కావడంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పెళ్లి కుమారుడైన గంధం నరేష్‌ వివాహా కార్డులు పంపిణీ చేయడానికి సూర్యాపేట జిల్లాకు వెళ్లి తిరుగు ప్రయాణంలో మోటర్‌ బైక్‌పై వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో నరేష్‌ మృతి చెందాడు. ఆనందంగా వివాహం జరగాల్సి  సమయంలో మృతి చెందడంతో కుటుంబ సభ్యులకు, బంధువుల రోదనలతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడు తల్లి లక్ష్మమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ యాదవేందర్‌రెడ్డి తెలిపారు. 

Advertisement
Advertisement