నర్సింగ్‌ కళాశాలలో వందకు పెరిగిన సీట్లు | Sakshi
Sakshi News home page

నర్సింగ్‌ కళాశాలలో వందకు పెరిగిన సీట్లు

Published Thu, Jun 1 2017 12:54 AM

seats increase in nursing college

కర్నూలు(హాస్పిటల్‌):  కర్నూలులోని ప్రభుత్వ నర్సింగ్‌ కళాశాలలో సీట్ల సంఖ్యను 25 నుంచి 100కు పెంచుతూ వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ పూనం మాలకొండయ్య బుధవారం జీవో (85) జారీ చేశారు. సీట్ల సంఖ్యను పెంచాలని గతేడాది నవంబర్‌ 2న కళాశాల ప్రిన్సిపల్‌ నుంచి వినతులు వెళ్లాయి. ఈ మేరకు స్పందించిన ప్రభుత్వం సీట్ల సంఖ్యను పెంచేందుకు అంగీకరించింది. ఇదిలా ఉండగా 1982లో కర్నూలు మెడికల్‌ కళాశాలకు అనుబంధంగా నర్సింగ్‌ కళాశాలను 25 సీట్లతో ఏర్పాటు చేశారు. పదేళ్ల క్రితం వరకు ఈ మెడికల్‌ కళాశాలలోనే ఇది కొనసాగింది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి చొరవ కారణంగా నర్సింగ్‌ కళాశాలకు సొంత భవనం, వసతి గృహం మంజూరైంది. ప్రస్తుతం ఈ కళాశాల వంద మంది విద్యార్థులకు అనుగుణంగా ఉన్నందున సీట్లను పెంచాలని కళాశాల ప్రిన్సిపల్‌ కోరారు. ఈ కళాశాలలో చదివిన విద్యార్థులు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో  క్లినికల్‌ సేవలను అందిస్తారు. ఈ మేరకు నాలుగేళ్లకు గాను వచ్చే మూడేళ్లలో 300 మంది విద్యార్థులు ఆసుపత్రిలో సేవలందించే అవకాశం ఉంది. 
 

Advertisement
Advertisement